నేను శ్రీరామోజు హరగోపాల్. మాది నల్గొండ జిల్లా, ఆలేరు. అమ్మానాన్నలు వరలక్ష్మీ, విశ్వనాథం. ఎం.ఏ.తెలుగు, ఎం.ఇడి. చదివాను. గజిటెడ్ హెడ్మాష్టరుగా పనిచేసి 2013లో రిటైరైనాను. ఉపాధ్యాయ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసాను. అనేక సాహిత్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాను. నేను రాసిన కవిత్వాన్ని 1991లో మట్టిపొత్తిళ్ళు, 2006లో మూాలకం కవితాసంపుటులుగా ప్రచురించాను. 1987లో ఆలేరులో రచనసాహితీకళావేదిక అనే సాహిత్యసంస్థను స్థాపించి అనేక సాహిత్యకార్యక్రమాలను నిర్వహించాను. అనేక పుస్తకాలను సంస్థ తరపున ప్రచురించాను. నెలా నెలా రచన కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలపాటు నిర్వహించాను. 1994లో బాలచంద్రిక అనే పిల్లలసంస్థను ఏర్పాటుచేసి ప్రతిసంవత్సరం పిల్లలకు సాహిత్య,సాంస్కృతిక,క్రీడా,బౌద్ధిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పుస్తకసమీక్షలు, సాహిత్యవ్యాసాలు, గల్పికలు, నాటికలు, కథలు, పాటలు రాసాను. నా పాటల్ని గాలి అలలమీద నీ నవ్వులు అనే పాటల ఆల్బంగా తెచ్చాను. ప్రస్తుతం చరిత్రమీద ఆసక్తితో తెలంగాణ చరిత్రను పరిశోధన చేస్తున్నాను. నాతో కలిసివచ్చిన మిత్రులు, మార్గదర్వకులతో కొత్త తెలంగాణ చరిత్ర బృందంగా ఏర్పడి ప్రస్తుతం తెలంగాణా అంతట పర్యటిస్తున్నాం. ఆదిమానవ సంస్కృతి, నాగరికతలు, గ్రామాల చరిత్ర,శాసన పరిష్కరణ, స్థానిక చరిత్రల గురించి అన్వేషణ చేస్తున్నాం.