ఎడితనూర్ ( సంగారెడ్డి మండలం, మెదక్ జిల్లా, తెలంగాణా రాతిపుటల్లో రాసిన చరిత్ర--Sriramoju haragopal (చర్చ) 08:19, 21 మే 2014 (UTC) మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని ఎడితనూర్ గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ పాతరాతి యుగం నుండి రాచరిక యుగాల దాకా విలసిల్లిన అఖండ నాగరికత గురించిన ఆనవాళ్లు మాలో ఆనందాన్ని నింపాయి. అదే సమయంలో ఇది పలు చారిత్రిక సందేహాల్ని పెంచింది. ఎడితనూరు గోదావరి నది, ఉపనది మానేరుకు పిల్ల నదులైన వాగులో ఒకటైన నక్కవాగు ఒడ్డున ఉంది. ఇప్పుడున్న ఎడితనూర్ గ్రామానికి ఉత్తరాన కొండల గుంపు ఉంది. ఆ కొండల్లో తూర్పు దిక్కున ఎత్తయిన బండలతో కూడిన ప్రాకారం లాంటిది ఉంది. లోపలికి దారి చేసుకుని వెళితే గుట్ట అంచున తూర్పువైపు ఒక పడిగెరాయిలో లోపలివైపు రాతి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రిత శిలాశ్రయం మధ్య శిలాయుగాల (Mesolithic Period) నాటిదిగా తెలుస్తోంది. ఆ చిత్రాలలో వేదిలో ఉన్న ఆదిమానవుల చేతుల్లో వలరి, రాగోల వంటి పనిముట్లు బరిసె, వలలున్నాయి. మూపురాలున్న ఎద్దులు, ఆవులు, ఎడ్లబండి, బండి కిరువైపుల ఆవు, ఎద్దు, ఆవుదూడ, తాబేలు బొమ్మలు కన్పిస్తున్నాయి. మరికొన్ని రాతి పెచ్చులూడి వర్షానికి తడిసి పాడైపోయి తేటగా కన్పించడం లేదు. ఈ బొమ్మల వల్ల అప్పటి మనుషులు జంతువులను మచ్చిక చేసుకుని ఉంటారని, వేట, వ్యవసాయాలు తెలిసిన వారై ఉంటారని, ప్రాచీనులనీ తెలుస్తున్నది. ఈ చిత్రిత శిలాశ్రయానికి కొంచెం వెనక పడమరగా లోపలికి ఒక గుహ ఉంది. అందులో గంటు బొమ్మలు ఫెంచిలో పెట్రోైగ్లెఫ్స్ అని పిలుస్తారు) మూడు దిక్కులా ఉన్నాయి. ఈ తొలువుడు బొమ్మల్లో పుల్లగీతల వంటి ఆకతిలో మనుషులు, చేతి ఆకారాలు, గణిత సంబంధమైన అనేక రూపాలున్నాయి. అయితే, ప్రపంచంలోని అనేక ఆదిమానవుల ఆవాసాల్లో ఇటువంటి గంటు బొమ్మలు అగుపిస్తుంటాయి. మన దేశంలో లడఖ్‌లో, గోవా - ఉస్గరిమల్, తమిళనాడు - పెరుముక్కల్, కేరళ - ఎడక్కల్‌లలోనూ ఈ గంటు బొమ్మలున్నాయి. ఇవన్నీ ఆదిమానవుల ప్రతీకాత్మక ( Symbolic) రేఖారూప భాషలు. గుహలోని Rock carvings మాత్రమేకాక బయట గుట్టలమధ్య లోయలో మరోచోట మరొక గంటు బొమ్మల శిల వుంది. దానిమీద రేఖాకతులు సంక్లిష్టంగా ఉన్నాయి.

ఈ ఆదిమానవుల ఆవాసాల నుండి కొంచెం పడమరగా ముందు కెళితే 30, 40 అడుగుల ఎత్తున్న ఏటవాలు కొండగుహలలో చౌడమ్మ తల్లి వెలసింది. అమ్మ దేవతల ఆరాధనలకు ప్రతీక ఈ చౌడమ్మ దేవత. ఆమె పేరు మీదే ఈ గుట్ట చౌడమ్మ గుట్ట అయింది. ఈ తల్లి గిరిజనుల దేవతే. తర్వాత ఎవరో దుర్గ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుంది. ఇక్కడ ఏటేటా జాతర చేస్తారు . ఈ గుహాలయం పక్క మరొక సన్నని దోనెలో భైరవుని (బయ్యన్న) విగ్రహం ఉంది. ఈ శిల్పాన్ని బట్టి 5, 6 శతాబ్దాల కిందటిది అనిపిస్తుంది.చౌడమ్మ, బయ్యన్నల గుళ్ళ ముందరి విశాలమైన వేదిక వంటి బండ మీద కప్పులేని మంటపం ఒకటి వుంది. పడమట శివాలయంగా మార్చబడ్డ ఒక రాతిగూడు ఉంది. లోపల రాష్ట్ర కూటుల నాటి పానవట్టంపై శివలింగం, బయట మెడ తెగిపోయిన ఇసుకరాతి నంది ఆకారం ఉన్నాయి. ఆ పక్కనే చిన్న జలాశయం. పడమటి వైపు గుట్ట దిగబోతుంటే ఏదుల బండగా పిలువబడే నీటి చెలిమె సొరికె ఉంది. దాంట్లోంచి ప్రవహించే నీటితో అక్కడొక రైతు రెండు ఎకరాలు పండించుకుంటున్నాడు. మిగిలిన నీరు కొండదిగి కట్టుకాలువ ద్వారా చెరువులోకి పోతున్నది.ఆ పొలం దాటి గుట్టల నడుమ లోయలోకి ప్రవేశించగానే ఎదుట మూడు రాళ్ళ వరుస గుండు కన్పిస్తుంది. అదే గద్ద గుండు. దీని గురించే కౌశీ పాండ్యన్ తన పుస్తకం మరుగున పడ్డ వారసత్వంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ గుండుకు పడమటి వైపు ఎనుపోతు ఆకారం (గీత రూపంలో) చెక్కి ఉంది. ఈ మహిషం బొమ్మ ఇక్కడ వేలాది ఏళ్ళుగా జీవించి రాజ్యాల నేలిన మహిష గణం -టోటెం, ఒక జాతి చిహ్నం. ఆదిలాబాద్‌లో భైంసా వంటి గ్రామాలైనా, మన వూర్లలోని మైసమ్మలైనా మహిషకుల ప్రతినిధులే కదా! Ancient Society అనే పుస్తకంలో రచయిత మోర్గాన్ జాతుల పేర్లు ఆయా జాతుల చిహ్నాలనుబట్టి వచ్చాయని, ఈ పేర్లన్నీ పక్షులు, జంతువులవిగానే ఉన్నాయని చెబుతూ, ఆదిమ సమాజాలు ఆటవిక దశలో తమకు పక్షినో, జంతువునో తమ గుర్తు (టోటెం)గా పెట్టుకునే వారంటూ, ఆ గుర్తులతోనే ఆయా గణసముదాయాలన్నీ గుర్తించబడ్డాయనీ రాశారు.ఎడితనూరు గుట్టల వరుస చౌడమ్మ గుట్టనుండి సిద్ధ్దేశ్వరుని గుట్టవరకు 6 గుట్టలుగా విస్తరించి ఉంది. చౌడమ్మ గుట్ట, దేవతల కుచ్చె, వెంకన్న గుట్టల మధ్య గద్ద గుండు ఉంది. దానికి తూర్పు, పడమరలుగా విస్తరించిన విశాలమైన లోయను ఏనుగుల లొద్ది అని పిలుస్తారు. ఈ లోయలో రాజుల కాలంలో ఏనుగుల సంత జరిగేదని పెద్దలు చెబుతుంటే విన్నామని మాకు గైడ్‌గా వచ్చిన యం. నరేందర్ తెలిపారు. ఏనుగుల లొద్దిలో కొంత దూరంలో ఒక Ringing rock లేదా Musical stone ఉండేదట. అది తర్వాత కాలంలో క్వారీ పనుల వల్ల పాడైపోయిందని, దానిమీద నిలబడి రాయిని తొక్కుతూ ఊపితే చప్పుళ్ళొచ్చేవని ఆయన వివరించారు. పూర్వం ఒంటరిగా ఉన్న రాయసగాండ్రు రాయిని ఊపి పుట్టించిన నాదంతో వారకాంతలను తమ ఏకాంత సేవలకు రమ్మని పిలుచుకునే వారట. దానిని గ్రామస్తులు లంజగుండు అని పిలుస్తారు. ఇది ఒకప్పటి ఆదిమానవులు, ఆపై గిరిజనులు వార్తలు పంపుకునే తుడుం వంటి రాతివాద్యమే. ఆదిమానవుల ఆవాసాలున్న ఇట్లాంటి Ringing stones గల అనేక ప్రాంతాలు తాజాగా వెలుగుచూస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఆ లోయ పరిసరాల్లో పాటిగడ్డలు (పాత ఊరి దిబ్బలు) రెండు చోట్ల కనిపించాయి. అక్కడ మొద్దు పెంకలు, రాతి పనిముట్లు దొరికాయి. నాలుగైదు రక్కసి గూళ్ళు (సిస్త్‌లు) కొత్తరాతి యుగపు ఆనవాళ్ళుగా మిగిలి కనిపించాయి. ఆ పక్కన చిన్నగుట్ట్ట, గుట్టకొక గుహ. ఆ గుహలో వెంకన్నగా పిలువబడే రెండు చేతుల దేవుడు, కుడి పక్కనే ఒక స్త్రీ మూర్తి ఉబ్బెత్తు బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. దానికున్న ద్వారం చౌడమ్మ తల్లి గుడికున్న మాదిరే చిన్నదిగా ఉంది. పరిశీలనగా చూస్తే ఆ దేవుడి చేతిలో శంఖుచక్రాలు లేవు. ఫలమో, తామర మొగ్గో ఉన్నట్టుగా ఉంది. ఏదైనా, జైనయక్షిణులై ఉండొచ్చు! అక్కడికి దగ్గరలో రెండు నాగయక్షిణుల బొమ్మలు దొరికాయి. ఇక్కడున్న గుహాలయాల్లో మరొకటి సిద్ధేశ్వరుని గుట్టపై ఉంది. ఇప్పుడా గుడిలో శివలింగం లేదు. ముస్లింల సమాధి రాయొకటి, ఊదు పాత్రలు ఉన్నాయి. రాజులు మారినప్పుడల్లా వారి మతాధిపత్యాలు కూడా మారిపోతాయి, దేవుళ్ళు కూడా, అనిపించింది, చూస్తుంటే! ఎడితనూరు గ్రామానికి వాయవ్యాన వున్న చెరువుకు అంచున జంగిడి గుళ్ళుగా పిలువబడే చోట రెండు వీరగల్లున్నాయి. ఇద్దరు గిరిజన వీరుల, (స్త్రీ పురుషుల) వీరగల్లులలో విల్లమ్ములు, గొడ్డలి ఆయుధాలున్నాయి. తలకట్టు, ఆభరణాలు గిరిజన సంప్రదాయాలే. మరొక వీరగల్లు 6, 7 శతాబ్దాల కాలం నాటి ఆహార్యం ధరించిన వీరుని స్మారక శిలగా ఉన్నది.జంగిడిగుళ్ళు అనగానే మా ఊళ్ళో మా చిన్నప్పుడు బలాదూరుగా తిరిగే పిల్లల్ని ఏమిరా! మిమ్మల్ని జంగిడి కొదిలిన్రా అనేవాళ్ళు. జంగిడికి విడవడం అంటే జన్నె (యజ్ఞం) కొదిలిన అర్థంలో దేవుడికి అంకితం చేసినట్టా లేక జంగిడి అంటే జంగల్ (అడవి) అనే అర్థంలోనా? ఆలోచించాల్సిన మాటే! ఎడితనూరు వేలయేళ్ళుగా వర్థిల్లిన గిరిజన రాజ్య కేంద్రమని, పాతరాతి యుగం నుండి ఆధునిక రాజ్యాలదాకా చారిత్రిక కాలాన్ని తనలో దాచుకుని రాతిపుటల్లో రాసుకున్నదని ఈ ఊరిని సందర్శించిన వాళ్ళకెవరికైనా అనిపిస్తుంది.ఈ ఊరిలో ఎక్కడా శాసనాలు లభించలేదు. కాని, ఊరికి దక్షిణాన చెరుకు తోటలో ఒక శిథిల దేవాలయం బయటపడింది. ఆలయ ద్వారబంధం మీద వేణు వూదుతున్న కష్ణుడు, ఇరువైపుల గోపికలు, గోవులు అందంగా చెక్కబడి ఉన్నాయి. అంతరాళం పూర్తిగా తవ్వేయబడి ఉంది. ఆ ద్వారానికి ఆరాకుల పువ్వు చెక్కబడి ఉంది. ఇట్లాంటి చిహ్నాలే ఉన్న ఆలయాలు రాష్ట్రకూటుల కాలం నాటివని, వర్గల్‌లో కూడా ఇట్లాంటి గుర్తులున్నాయని మా గురువు విరువంటి గోపాలకష్ణ (కొలనుపాక) చెప్పారు. అట్లే, ఎడితనూరు గురించి 50 ఏళ్ళ కిందటే సంగనభట్ల నరహరి పరిశోధించి వివరాలు రాసిన ఆయన డైరీలవల్ల తెలుస్తున్నదని చారిత్రక పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ అన్నారు. ఆ విషయాలు వెల్లడైతే భారతదేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయంగా ఎడితనూరు లిఖించబడుతుంది