మద్దిన వెంకటేశ్వరరావు (చిన్న) మద్దిరాల - ముప్పాళ్ళ (గ్రామము) పిన్ -523181

కవితలు మార్చు

పగలంతా తను పడిలేస్తూ ప్రతి క్షణం పరుగులు తీస్తూ ప్రపంచానికే వెలుగిచ్చే బంగరు సూరీడు మనవాడు

చల్లని వెన్నెల కురిపిస్తూ ప్రతి రేయీ జగతిని జోకొడుతూ అలసిన కనులకు కలలను పంచే అందరివాడూ నెలరాజు

పక్షుల కిలకిలా రావాలు ఎం ఎస్ సుప్రభాతాలు బిస్మిల్లా శెహ్నాయి మేళాలు చిత్ర చిలిపి సరాగాలు లత-ఆషాల గానాలు

అమ్మ నోటి దీవెనలు చెమ్మగిల్లిన నాన్న కనులు చెల్లాయితో గిల్లికజ్జాలు బామ్మ చేతి బొబ్బట్లు

తీయని మాయని స్నేహాలు దాచిన దాగని ప్రణయాలు పెనవేసుకున్న అనుబంధాలు ఇవే మన సిసలైన సంపదలు !!!


కోకిలల కుహు కుహు రాగాలు గజరాజ ఘీంకారాలు శార్దూల గర్జనలు స్తబ్దుగా సెలవు తీసుకుంటున్నాయ్ నేను తిరిగిన ఆ నందనవనం నేడు బోసి పొయింది

గల గల పారే సెలయేళ్ళు నిశ్చలంగా నిశ్శబ్దంగా పారుతున్నాయి. విరబూసి వికసించాల్సిన మొగ్గలు గుబాళింపులు లేకుండానే రాలిపోతున్నాయి నేను తిరిగిన ఆ నందనవనం నేడు బోసి పోయింది

ఝుం అనే తుమ్మెదలు నెమ్మది తిరుగుతున్నాయి తేనెటీగలు మకరందం లేదని మదనపడటం మానేశాయి నేను తిరిగిన ఆ నందనవనం నేడు బోసి పోయింది

ప్రభాసాన ప్రచండ భానుడు ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. నేను తిరిగిన.... ఆ.... నందనవనం..... వస్తుందా.... మళ్ళీ... తెస్తుందా.... మళ్ళీ... నాడు వెదజల్లిన సౌరభాలు

నీతి మార్చు

భారతీయుడై పుట్టినందుకు గర్వించకు. భారతీయత ఆచరించినప్పుడు గర్వించు.

తెలుగువాడిగా పుట్టినందుకు ఆనందించకు తెలుగుతనాన్ని చాటి చెప్పినప్పుడు ఆనందించు.

వేదాలతో విద్యావంతుణ్ణని విర్రవీగకు వెలుపలి వారికి విద్యా దానం చేసినపుడు విర్రవీగు.

తాతలు నేతులు తాగారని నినదించకు చేతలు నీతిగ సాగినపుడు నినదించు.

ఏదీ కానప్పుడు నోరు మూసుకో ఎగతాళి మాత్రం చేయకు.

కథలు మార్చు

ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది. ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి... పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.

దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది." అనుకుంది.

అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే...! పదునైన "వింటి కోపు" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి