వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 34వ వారం

సోమనాథ్

సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రం లోని వెరావల్‌లో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. ఆరుమార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణించబడుతుంది. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశ మరియొక మంత్రి అయినకె ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితోనూ పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్ధము.

(ఇంకా…)