వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 22వ వారం

తిరుమల ప్రసాదం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా నివేదించి, భక్తులకు పంచిపెట్టే లడ్డు, వడ వంటి తినే పదార్థాలు తిరుమల ప్రసాదంగా ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం లడ్డు తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొంది, తిరుమల ప్రసాదం అంటే గుర్తుకువచ్చేలా పేరు తెచ్చుకుంది. అయితే చారిత్రకంగా 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ వడకు తిరుమల ప్రసాదంగా ప్రస్తుతం లడ్డుకు ఉన్న పేరు ఉండేది. మనోహరం పడిగా పిలిచే సున్నుండ వంటి ప్రసాదానికి కూడా 16-20 శతాబ్దాల కాలంలో ప్రాముఖ్యత ఉండేది. ఈ రెండు ప్రసాదాల ప్రాధాన్యతను 20వ శతాబ్ది నుంచి సెనగపిండితోనూ, పంచదారతోనూ చేసే ప్రస్తుత తిరుపతి లడ్డు తీసుకుంది. విజయనగర సామ్రాజ్యం అత్యున్నత దశకు చేరుకునే నాటికి రాజులు, అధికారులు, సంపన్నులు ఏర్పాటు చేసిన దానాల వల్ల వందలాది గంగాళాల్లో నిత్యం వందసార్లు నివేదించే స్థితి నుంచి ఈస్టిండియా కంపెనీ కాలంలో అన్ని నైవేద్యాలను నిలిపివేసింది. 1840లో తిరిగి మహంతుల చేతికి దేవాలయాన్ని అప్పగించాకా తిరిగి ప్రారంభమైన నైవేద్యాలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. ప్రసాదం తయారీలోనూ, వాటి ప్రాధాన్యతల్లోనూ, పంపిణీలోనూ, తయారుచేసే వ్యవస్థలోనూ వందలాది ఏళ్ళలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.

(ఇంకా…)