వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 27వ వారం

శ్యాంప్రసాద్ ముఖర్జీ

శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెసు వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951 న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953 న మరణించేవరకు కొనసాగినాడు. వినాయక్ దామోదర్ సావర్కర్తో బాటు ముఖర్జీ కూడా భారతదేశంలో హిందూజాతీయ వాదపు, ముఖ్యంగా హిందూత్వ ఉద్యమమునకు ప్రముఖుడిగా పరిగణించబడతాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు విశ్వహిందూ పరిషత్తు మద్దతుదారులచే మంచి గౌరవానికి పాత్రుడయ్యాడు. 1960, 70 దశకాలలో భారతీయ జనసంఘ్ పార్టీకి ఆ తదనంతరం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి దోహదపడిన అటల్ బిహారీ వాజపేయికి శ్యాంప్రసాద్ ముఖర్జీ మంచి మార్గనిర్దేశం చేశాడు.

(ఇంకా…)