వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 29వ వారం

భాభా అణు పరిశోధనా కేంద్రం
బాబా అణు పరిశోధనా కేంద్రం భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అణుపరిశోధన సంస్థ. ఇది ముంబైకి సమీపంలోని ట్రాంబే అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అణు శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అధునాతన పరికరాలు, వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి.అణుశక్తిని ప్రధానంగా మానవాళి మేలు కొరకు ఉపయోగించడానికి ఈ సంస్థ ప్రయోగాలు చేస్తుంది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం, ముఖ్యంగా విద్యుదుత్పత్తి కోసం, వాడుకోవడమే BARC ప్రధాన ఉద్దేశం. రియాక్టర్ల సైద్ధాంతిక రూపకల్పన, కంప్యూటరీకరించిన మోడలింగ్, అనుకరణ, ప్రమాద విశ్లేషణ, కొత్త రియాక్టర్లు, కొత్త ఇంధన పదార్థాల అభివృద్ధి, పరీక్ష మొదలైన అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ ఇది నిర్వహిస్తుంది. వాడేసిన ఇంధనాన్ని ప్రాసెసింగ్ చెయ్యడం, అణు వ్యర్థాలను సురక్షితంగా పారవేయడంపై కూడా ఇది పరిశోధన చేస్తుంది. పరిశ్రమలు, ఔషధం, వ్యవసాయం మొదలైన వాటిలో ఐసోటోపులను వాడడం దాని ఇతర పరిశోధనాంశాలు. BARC దేశవ్యాప్తంగా అనేక పరిశోధన రియాక్టర్లను నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వం 1954 జనవరి 3 న అణు పరిశోధన కోసం అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ మెంట్, ట్రాంబే అనే సంస్థను స్థాపించింది. దీని ముఖ్య ఉద్దేశం వివిధ సంస్థల్లో అణు రియాక్టర్లు, వాటి సాంకేతిక పరిజ్ఞానం పైన పనిచేస్తున్న శాస్త్రవేత్తల కృషినంతటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం.
(ఇంకా…)