వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 32వ వారం

రాజేంద్ర సింగ్
డా. రాజేంద్ర సింగ్ (జ. 1959 ఆగస్టు 6) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాకు చెందిన నీటి పరిరక్షకుడు, సంఘసేవకుడు. అతనిని "వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" గా పిలుస్తారు. తన కృషికిగాను స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. 1975లో ప్రభుత్వేతర సంస్థ "తరుణ్ భారత్ సంఘ్" ను స్థాపించాడు. రాజస్థాన్‌ లో మంచి నీటి నిర్వహణలో విశేష కృషి చేసినందుకు గాను 2001 లో రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నాడు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌ లో అంతరించిపోయిన 5 నదులకు జీవం పోసి, 1000 గ్రామాలకు నీరందించాడు. వందల అడుగులు తవ్వితేగానీ జల పడనిచోట ఆయన పాటించిన విధానాలతో 15 అడుగుల లోతులోనే నీళ్లు పడేంతగా భూగర్భజలాలు అభివృద్ధి చెందాయి. అతను వర్షపు నీటిని నిల్వచేసేట్యాంకులు, చెక్ డ్యాం లను ఉపయోగించి నీటిని సంరక్షించే విధానాలను అవలంబిస్తాడు. 1985లో ఒక గ్రామం నుండి ప్రారంభించి ఈ సంస్థ 8600 జోహాద్‌లు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వచేసింది. అతను చేసిన ఈ విధానాల వల్ల రాజస్థాన్ లో అర్వారి, రూపారెల్, సర్సా, భగాని, జగజ్వాలి అనే ఐదు నదులు పునరుజ్జీవనం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి.
(ఇంకా…)