ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సినిమా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా అతని ప్రస్థానం ప్రారంభమైంది. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగాను, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలూ అందుకున్నాడు. కమల్ హాసన్, రజనీకాంత్ ల నుండి నగేష్, రఘువరన్ ల దాకా ఎంతోమంది నటులకు గాత్రదానం చేసిన డబ్బింగు కళాకారుడు బాలు.పాడుతా తీయగా వంటి సూపర్‌హిట్ టెలివిజన్ కార్యక్రమాలకు ఆద్యుడతడు. కోవిడ్ వ్యాధి కారణంగా భారతదేశం కోల్పోయిన సుప్రసిద్ధులలో ఒకడాయన.
(ఇంకా…)