వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 28వ వారం

రిషి వ్యాలీ పాఠశాల
రిషి వ్యాలీ పాఠశాల జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన భారతీయ ఆశ్రమ పాఠశాల. ఇది ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని మదనపల్లె సమీపంలో ఉంది. ఇక్కడి విద్యా విధానం కృష్ణమూర్తి బోధనా దృక్కోణం ఆధారపడి ఉంది. సమాజ సేవ, పాఠ్యేతర కార్యకలాపాలు, చర్చలు, సమావేశాలు, ప్రత్యేక ఆసక్తులపై సమావేశాలూ విద్యార్థుల పాఠశాల విద్యలో భాగం. ఈ పాఠశాల బహుళశ్రేణి బోధన పద్ధతిని ఆవిష్కరించింది. ఈ పద్ధతి దేశవ్యాప్తంగా, ప్రపంచంలో చాలా చోట్ల ఆదరణ పొందింది.

ఈ ఆశ్రమ పాఠశాల రిషి లోయలో 375 ఎకరాల విస్తీర్ణంలో, కొండలు, చిన్న గ్రామాల మధ్యలో ఉన్నది. కొండవాలు (ఆంగ్లంలో 'వ్యాలీ') ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడ ఋషులు నివసించేవారనే జానపద కథనాలున్నందునా ఈ ప్రాంతానికి "ఋషివ్యాలీ" లేదా రిషి వ్యాలి అనేపేరు వచ్చింది. హార్సిలీ హిల్స్ నుండి, ఈ లోయ ప్రాంతం సుందరంగా కనిపిస్తుంది. ఇది మదనపల్లె పట్టణానికి 16 కి.మీ. దూరంలో, మదనపల్లె - కదిరి మార్గంలో ఉంది. ప్రధాన రహదారి నుండి, 5 కి.మీ. లోతట్టున ఈ పాఠశాల ఉంది. తిరుపతి నుండి రెండు గంటలు, బెంగుళూరు నుండి రెండున్నర గంటలు, చెన్నై నుండి ఐదు గంటల ప్రయాణంతో ఈ పాఠశాలను చేరవచ్చు.
(ఇంకా…)