వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 37వ వారం

ఫిరోజ్ గాంధీ

ఫిరోజ్ గాంధీ (జన్మనామం: ఫిరోజ్ జహంగీర్ ఘండి) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు. అతను ది నేషనల్ హెరాల్డ్, ది నవజీవన్ వార్తాపత్రికలను ప్రచురించాడు. అతను 1950 నుండి 1952 ల మధ్య కాలంలో భారతదేశ ప్రాంతీయ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. తరువాత లోక్‌సభ సభ్యునిగా, పార్లమెంటులో దిగువ సభలో సభ్యునిగా పనిచేసాడు. అతని భార్య ఇందిరా నెహ్రూ, పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరూ భారత దేశానికి ప్రధానులుగా పనిచేసారు. అతని జన్మనామం ఫిరోజ్ జహంగీర్ ఘండీ. అతను పార్శీ కుటుంబంలో జహంగీర్ ఫెరెడూన్ ఘండీ, రతిమయి దంపతులకు జన్మించాడు. వారు బొంబాయిలోని ఖేట్వాడీ మొహల్లా లోని నౌరోజీ నాటక్‌వాలా భవన్ లో నివసించేవారు. అతని తండ్రి జహంగీర్ కిల్లిక్ నిక్సాన్ లో మెరైన్ ఇంజనీరుగా పనిచేసేవాడు. తరువాత వారెంటు ఇంజనీరుగా పదోన్నతి పొందాడు. ఫిరోజ్ ఐదుగురు సహోదరులలో చివరివాడు. అతనికి జొరాబ్, ఫరీదున్ జహంగీర్ అనే ఇద్దరు అన్నయ్యలున్నారు. తెహ్మినా కేర్షష్ప్, ఆలూ దస్తూర్ అనే అక్కలున్నారు. ఈ కుటుంబం భరుచ్ (ప్రస్తుతం దక్షిణ గుజరాత్) నుండి బొంబాయిలోని కోట్పరివాడ్ లోని తాతగారింటికి వలస వెళ్లారు. 1920 ల ప్రారంభంలో తన తండ్రి మరణం తరువాత, ఫిరోజ్, అతని తల్లి అలహాబాదులోని మాతృసంబంధిత అత్త గారింటికి జీవించడానికి వెళ్లాడు. అతని అత్త అవివాహిత, నగరంలోని లేడీ డఫెరిన్ హాస్పిటల్‌లోని సర్జన్ గా పనిచేసేది.
(ఇంకా…)