విజయనగరం పూర్వ చరిత్ర

మన జాతీయగీతం 'జనగణమన'లో రవీంద్రనాద్ టాగుర్ చెప్పినట్లు 'ద్రావిడ ఉత్కళ' పదాలు ఒక దాని వెనక ఒకటి ఉన్నట్లే, ఆంధ్రా ఒడిషా రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నాయి. తెలుగు వారు ద్రావిడ సంతతికి చెందిన వారు కాగా ఒడిషా వారు ఉత్కళులు. ఒకప్పుడు గోదావరి నది మొదలు మహానది వరకూ ఉన్న భూభాగాన్ని... అంటే... తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటూ ఒడిషా లోని కొంత భాగాన్ని కలిపి కళింగ దేశమనే వారు.

విజయనగర సంస్థాన రాజముద్ర

క్రీస్తు శకం 15 వ శతాబ్దం వరకూ కళింగ దేశం మీద ఎందరెందరో దండయాత్రలు చేసినా...ఇక్కడి భాషా సంస్కృతులు మారలేదు.గోదావరి నదికి అవతలి వారిని తెలుగువారని, ఇవతలి వారిని కళింగులని కొందరు భావించారు.ఒడిషా రాష్ట్రం సరిహద్దుగా ఉండడం వల్ల ఆ సంస్కృతి కొంత ఆంధ్రుల మీదా పడుతోంది. తెలంగాణా, రాయలసీమల లానే...కళింగం కూడా సమగ్రాంధ్రలో ఒక ప్రాంతం. ఒకప్పుడు ఇది చాలా వెనుక బడి ఉండేది. అందుచేత సంస్కృతాంధ్ర భాషాప్రభావం తక్కువ గానే ఉండేది. దీర్ఘతమసుడు అనే ఆయన అంగవంగ కళింగాలని ఏక దేశంగా చేసుకొని పాలించాడని మహా భారతంలో చెప్పబడింది. కళింగ దేశంలో ఏనుగులు ఎక్కువని అందుకే ఇక్కడి రాజులకి గజపతులు అని పేరు వచ్చిందని అర్ధశాస్త్రంలో ఉంది. విదేశీ చరిత్రకారులు ప్లీనీ, మెగస్తనీస్, హుయన్ చాంగ్ లు కళింగ దేశ నాగరికత గురించి రాశారు. కళింగ భూములు ఎంతో సారవంతమయినవని...బెల్లంకొండ నుంచి పాలకొండ వరకూ ఎన్నో కొండలున్నాయని ప్లీనీ రాశాడు. అక్కడి ప్రజలు మోటు వారయినా న్యాయం తప్పని వారని హుయాన్ చాంగ్ రాశాడు. క్రీస్తు పూర్వం తరువాత గంగరాజులు ఈ దేశాన్ని పాలించారు. బౌద్ద, జైన మతాలు ఎక్కువ ప్రాభవం పొందాయి. సాలి హుండం మొదలు కొని జామి వరకూ బౌద్ధులూ జైనులూ నివసించారనడానికి ఆధారాలున్నాయి. అశోకుని సైతం అహింసావాదిగా మార్చిన అమృత సీమ ఈ కళింగసీమ అంటారు. ప్రస్తుత విజయనగరం జిల్లా పూర్వం శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో కలసి వుండేది. క్రీ.పూ.4వ శతాబ్దం నాటికే గోదావరి మహానదుల మధ్య భాగాన్ని అంటే కటకం నుంచి పిటాపురం వరకూ ఉన్న ప్రాంతాన్ని కళింగదేశం అన్నారు.


మూలాలు మార్చు