వ్యవసాయ పెట్టుబడులు

కావలసిన పదార్ధాలు 5 శాతం వేప గింజల కషాయం గల 100 లీటర్ల ద్రావణం తయారు చేయటకు

  • బాగా ఎండిన వేప గింజల విత్తనాలు – 5 కేజీలు.
  • నీరు – 100 లీటర్లు.
  • సబ్బు పొడి -200 గ్రాములు.
  • వడపోత కోసం పలుచని గుడ్డ.
ఎరువులు చల్లే పంపు వ్యవస్థ

వేప గింజల కషాయం తయారు చేయట (5% ద్రావణం) మార్చు

పద్ధతి

  • అవసరమైన 5 కేజీల వేప గింజల విత్తనాలను తీసుకోవాలి.
  • విత్తనాలను నూరి పొడి చేయాలి
  • 20 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి.
  • ఉదయాన్నే కర్రపుల్లతో ద్రావణాన్ని పాల తెలుపు రంగు వచ్చే వరకు బాగా కలయ తిప్పాలి.
  • పలుచని గుడ్డసంచితో వడపోసి 100 లీటర్ల ద్రావణం తయారు చేయాలి.
  • 1 శాతం సబ్బు పొడిని ద్రావణంలో కలిపి తిప్పాలి.
  • ద్రావణాన్ని బాగా కలిపి ఉపయోగించుకోవాలి.

గమనిక

  • వేప కాయలను కాయలు కాసే కాలంలో సేకరించి, నీడలో గాలికి ఆరబెట్టాలి.
  • ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం ఉన్న విత్తనాలను ఉపయాగించరాదు. ఈ వయసు కంటే ఎక్కువ దాచి ఉంచిన విత్తనాలు[+] ద్రావణం తయారికి[+] పనికిరావు.
  • ఎల్లప్పుడు తాజాగా తయారుచేసిన వేప గింజల కషాయ ద్రావణాన్ని ఉపయాగించాలి.
  • మంచి ఫలితాలు రావాలంటే ద్రావణాన్ని 3.30 P.M తర్వాత పిచికారి చేయాలి

పురుగుమందులు కొనేటపుడు, ఉపయోగించేటపుడు రైతులు చేయవలసినవి, చేయకూడనివి మార్చు

కొనుగోలు చేసేటపుడు చేయవలసినవి

  • సరైన లైసెన్సు ఉన్న అధీకృత డీలర్ వద్దనుంచి మాత్రమే పురుగుమందులు/జైవిక పురుగుమందులు కొనుగోలు చేయాలి.
  • ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక్కసారి సరిపడ పురుగుమందు ఎంత కావాలో అంతే మోతాదులో కొనుగోలు చేసుకోవాలి.
  • పురుగుమందుల డబ్బాలు/సంచులపై అనుమతుల సమాచారం ముద్రించిన లేబుల్ ను గమనించాలి.
  • లేబుల్ మీద బ్యాచ్ నంబరు, నమోదు నంబరు, తయారీ తేదీ, కాల పరిమితి వివరాలను గమనించాలి.
  • డబ్బాలలో చక్కగా ప్యాక్ చేసిన పురుగుమందులనే తీసుకోవాలి.

కొనుగోలు చేసేటపుడు చేయకూడనివి

  • లైసెన్సు లేని వ్యక్తులనుంచి లేదా అనధీక్రుత డీలర్ల నుంచి పురుగుమందులు కొనకూడదు.
  • మొత్తం పంటకాలానికి సరిపోయేపురుగుమందును ఒకేసారి కొనకూడదు.
  • అనుమతితో కూడిన లేబుల్ లేని పురుగుమందును కొనకూడదు.
  • కాలం చెల్లిన పురుగుమందులను ఎప్పుడూ కొనకూడదు.
  • డబ్బాలు పగిలి కారుతున్న, మూత తీసిఉన్నా, కొద్దిగా వాడి ఉన్నా ఆ పురుగుమందును వాడకూడదు.

నిల్వ చేసే సమయంలో చేయవలసినవి

  • పురుగుమందులను ఇంటి ఆవరణకు దూరంగా ఉంచాలి
  • పురుగుమందులను కొన్నప్పడు ఉన్న డబ్బాల్లోనే భద్రపరచండి.
  • పురుగుమందులను/కలుపు సంహారకాలను వేర్వేరుగా భద్రపరచాలి.
  • పురుగుమందులను భద్రపరిచేచోట హెచ్చరికలు పెట్టండి
  • పిల్లలు, కోళ్ళు, పశువులకు పురుగుమందులను అందుబాటులో లేకుండా చూడాలి.
  • నిల్వ ఉంచే స్థలము ఎండ, వానలకు గురి కాకుండా కాపాడుకోవాలి

నిల్వ చేసే సమయంలో చేయకూడనివి

  • పురుగుమందులను ఇంటిలో ఎప్పుడూ ఉంచకూడదు.
  • పురుగుమందులను కొన్నప్పటి డబ్బాలనుంచి వేరే డబ్బాల్లోకి మందును మార్చకూడదు.
  • పురుగుమందులను, కలుపు సంహారకాలతో కలిపి భద్రపరచకూడదు.
  • పురుగుమందులు నిల్వ చేసిన చోటుకు పిల్లలను వెళ్లనీకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పురుగుమందులకు ఎండ, వాననీరు తగలకుండా చూసుకోవాలి.

ఉపయోగించే సమయంలో చేయవలసినవి

  • రవాణా సమయంలో పురుగుమందులను విడిగా ఉంచవలెను
  • పురుగులమందులు వాడే ప్రదేశానికి జాగ్రత్తగా తీసుకెళ్లడం అవసరం.

ఉపయోగించే సమయంలో చేయకూడనివి

  • పురుగుమందులను ఆహారం/పశువుల మేత/ఇతరఆహార పదార్ధాలతోకలిపి రవాణా చేయకూడదు
  • పురుగుమందులను తల/భుజాలు/వీపు మీద ఎప్పుడూ మోసుకెళ్ళకూడదు

ద్రావకాలను తయారుచేసే సమయంలో చేయవలసినవి

  • ఎల్లప్పుడూ మంచి నీటినే వాడాలి
  • మొత్తం శరీరాన్ని కప్పే విధంగా చేతి తొడుగులు, ముఖానికి తొడుగు, టోపీ, ఏప్రాన్, ప్యాంటు మొదలైనవాటిని విధిగా వాడాలి
  • ద్రావకం చింది ముక్కు, కళ్ళు, చెవులు, చేతులపైన పడకుండా కాపాడుకోవాలి
  • పురుగుమందుల డబ్బా మీది సూచనలను శ్రధ్ధగా చదవాలి.
  • ద్రావకాన్ని అవసరమైనంతవరకు తయారచేసుకుని 24 గం || లోపు వాడాలి.
  • గుళికల పురుగుమందును కూడా అలాగే వాడాలి
  • పురుగుమందు ద్రావకాలను ట్యాంకులో పోసేటపుడు బయటకు చిమ్మకుండా జాగ్రత్త పడాలి
  • సూచించిన పరిమాణంలోనే పురుగుమందులు వాడాలి
  • ఆరోగ్యానికి భంగం కలిగించే ఏ పనులూ చేయకూడదు.

ద్రావకాలను తయారుచేసే సమయంలో చేయకూడనివి

  • బురదనీటినిగానీ, మురికినీటినిగానీ వాడకూడదు
  • శరీరానికి రక్షణ తొడుగులను ధరించకుండా పిచికారి ద్రావకాలను తయారుచేయ కూడదు, స్ప్రే చేయకూడదు.
  • పురుగుమందులు/ద్రావకాలు మీ శరీరభాగాలపైన పడకుండా జాగ్రత్త పడాలి.
  • లేబుల్ మీద...వాడకం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ఇచ్చిన సమాచారాన్ని చదవడం మానకూడదు
  • మిగిలిపోయిన ద్రావకాన్ని తయారుచేసిన 24గంటల తర్వాత ఎప్పుడూ వాడకూడదు
  • గుళికలను నీటితో కలపకూడదు
  • పురుగుమందు చల్లే ట్యాంకు వాసన చూడకూడదు
  • పరిమితిని మించిన పరిమాణం వాడి మొక్క ఆరోగ్యం, పర్యావరణానికి హాని చేయకూడదు
  • పురుగుమందులు వాడు సమయంలో తినడం, తాగడం, పొగ తాగడం, లాంటి పనులు చేయకూడదు

పురుగు మందుల వాడకానికి ఉపయోగించు పరికరాల ఎంపిక సమయంలో చేయవలసినవి

  • మంచి పరికరాలనే ఎంచుకోండి.
  • సరైన పరిమాణమున్న నాజిల్ ఎంచుకోవాలి.
  • పురుగుమందులకు, క్రిమసంహారకాలకు వేర్వేరు పిచికారులను వాడాలి

పురుగు మందుల వాడకానికి ఉపయోగించు పరికరాల ఎంపిక సమయంలో చేయకూడనివి

  • చిల్లులు, లోపాలు ఉన్న పరికరాలను వాడకూడదు
  • సిఫార్సు చేయబడని/లోపభూయిష్టమైన నాజిల్ ఎంచుకోకూడదు. మూసుకుపోయిన నాజిల్ ను నోటితో ఊదడంగానీ, శుభ్రపరచడంగానీ చేయకూడదు
  • పురుగుమందులకు, క్రిమసంహారకాలకు ఒకే పిచికారి వాడకూడదు

ద్రావకాల పిచికారి సమయంలో చేయవలసినవి

  • సూచించబడిన పరిమాణాన్ని, నీటిని మాత్రమే వాడాలి
  • చల్లగా, ప్రశాంతంగా ఉన్నరోజునే పురుగుమందును ఉపయోగించాలి
  • సాధారణంగా పొడిగా ఉన్న రోజుననే పురుగుమందు వాడవలెను
  • ప్రతి పురుగుమందు ఉపయోగానికి వేర్వేరు పిచికారిలను వాడవలెను
  • గాలి వీచే దిశలోనే పురుగుమందు పిచికారి చేయవలెను
  • మందు వాడకం పూర్తయిన తర్వాత పిచికారిలను, బాల్చీలను డిటర్జెంట్/సోప్ లతో మంచినీటితో కడగవలెను
  • పిచికారి పూర్తయిన వెంటనే పొలంలోకి పశువులనుగానీ, కూలీలను గానీ అనుమతించకూడదు

ద్రావకాల పిచికారి సమయంలో చేయకూడనివి

  • సూచించినదానికంటే ఎక్కువ పరిమాణాన్ని, ఎక్కువ గాఢతతో కూడిన ద్రావకాలను వాడకూడదు
  • ఎండ బాగా కాస్తున్నరోజునగానీ, బాగా గాలులు వీస్తున్న రోజునగానీ ద్రావకము పిచికారి చేయకూడదు
  • వర్షాలు రావడానికి ముందుగానీ, వర్షాలు కురిసిన వెంటనేగానీ వాడకూడదు
  • పాలలా చిక్కగా ఉండే ద్రావకాలను బ్యాటరీతో నడిచే యూఎల్వీ పిచికారిని ఉపయోగించకూడదు
  • గాలి వీచే దిశకు వ్యతిరేకంగా పిచికారి చేయకూడదు
  • పురుగుమందులు కలపడానికి ఉపయోగించిన డబ్బాలను, బాల్చీలను ఎంత శుభ్రంగా కడిగినాగానీ ఇంట్లో అవసరాల కోసం వాడకూడదు
  • మందులు చల్లిన వెంటనే రక్షణ దుస్తులు ధరించకుండా పొలంలోకి వెళ్ళకూడదు

పిచికారి పూర్తయిన తర్వాత చేయవలసినవి

  • మిగిలిపోయిన ద్రావకాలను బీడు భూములు వంటి సురక్షిత ప్రదేశంలో పారబోయవలెను
  • వాడేసిన పురుగుమందుల డబ్బాలను ముక్కలుగా చేసి ఊరికి దూరంగా భూమిలో పాతేయండి.
  • తినడానికి/పొగతాగడానికి ముందు చేతులను, ముఖాన్ని శుభ్రమైన నీరు, సోపుతో కడుక్కోవాలి
  • విషప్రభావమేమైన కనబడితే ప్రథమ చికిత్స చేసి రోగిని వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళండి. వాడేసిన పురుగుమందు డబ్బా కూడా వైద్యునికి చూపించాలి

పిచికారి పూర్తయిన తర్వాత చేయకూడనివి

  • మిగిలిపోయిన ద్రావకాలను మురుగు కాలువలలో, చెరువుల్లోగానీ, నీటి కాలవల్లోగానీ పోయకూడదు
  • ఉపయోగించబడిన పురుగుమందు డబ్బాలను తిరిగి వాడరాదు
  • బట్టలు ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా తినడంగానీ, పొగతాగడం గానీ చేయకూడదు
  • విషప్రభావమేమైనా కనబడితే వైద్యుడిదగ్గరకు తీసుకెళ్ళటం మానకండి.అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన ప్రాణం పోయే అవకాశముంది.

భూసార వివరాలు మార్చు

నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. పంటలకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత పరిమాణంలో నేలలో సహజంగా వుంటాయి. అయితే వీటిలో ఎంతో వ్యత్యా సాలు ఉండే అవకాశం ఉంది. నేలలో పోషకాలు ఎంత లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంత అవసరమో నిర్దారించి ఎరువులు వాడాలి. కావున భూసారాన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భూసార పరీక్షల ముఖ్య ఉద్దేశము

  1. నేలలో సహజంగా వున్న పోషకాల స్థాయిని తెల్సుకొని, వేయబోవు పంటలకు ఎరువుల మోతాదులను నిర్ణయించుటకు.
  2. చౌడు, ఆమ్ల గుణాల స్థాయిని నిర్దారించి సరిచేయుటకు. తద్వారా అధిక దిగుబడులు సాధించడానికి.

భూసార నమూనాల సేకరణ
పొలమంతా ఒకే రకంగా వున్నప్పుడు 5 ఎకరాల విస్తీర్ణానికి ఒక్క నమూనా చొప్పున తీయాలి. మట్టినమూనా తీయదల్చిన పొలంలో 10 నుండి 12 చోట్ల మట్టి సేకరించాలి. మట్టినమూనా తీయదల్చిన చోట నేలపై వున్న గడ్డి, చెత్త, కలుపు మొదలగు వాటిని తీసివేయాలి. పార ఉపయోగించి “ v ’’ ఆకారంలో 6 – 8 అంగళాలు (15 సెం.మీ) అంటే నాగటి చాలంతా గుంత తీయాలి. పై నుంచి దిగువ వరకు ఒకే మందంలో పలచని పొరవచ్చే విధంగా మట్టిని తీయాలి. ఇలా అన్ని చోట్ల నుండి సేకరించిన మట్టిని గోనెపట్టా, పాలీధీన్ పట్టా లేదా గట్లమీద వేసి మట్టి గడ్డలు చిదిమి బాగా కలిపి చతురస్రాకారంగా పరచి నాలుగు సమ భాగాలుగా విభజించాలి. ఎదురు, ఎదురుగా ఉన్న 2 భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని తీసివేయాలి. మరల నాలుగు బాగాలుగా చేయాలి.
ఈ విధంగా అరకిలో మట్టి నమూనా మిగిలే వరకు చెయ్యాలి. పండ్ల తోటలు వేయదలచిన పొలంలో చదునుగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అందులో 3 అడుగుల గొయ్యితీసి ప్రతీ అడుగుకు పై నుండి క్రిందికి ఒక్క మట్టినమూనా చొప్పున సేకరించి వివరాలతో పరీక్షా కేంద్రానికి పంపాలి.
నమూనాను శుభ్రమైన గుడ్డ సంచిలో గాని, ఫ్లాస్టిక్ సంచిలో గాని నింపాలి. సంచి లోపల రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, సర్వే నెంబరు, వేయదలచిన పంట మొదలగు వివరాల లో. మట్టినమూనాను దగ్గరలో వున్న భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి.

మట్టి నమూనా సేకరించటంలో మెళకువలు

  1. చెట్ల క్రింద, గట్ల ప్రక్కన, కంచెల వద్ద, కాలిబాటల్లో నమూనాలు తీయకూడదు, బాగా సారవంతమైన చోట్ల, మరీ నిస్సారవంతమైన చోట్ల మట్టిని కలిపి తీయకూడదు.
  2. సమస్యాత్మక భూముల్లో నమూనాలు విడిగా తీయాలి, రసాయన ఎరువులు వేసిన 45 రోజుల లోపు నమూనాలు తీయకూడదు.
  3. నమూనా తీసేటప్పుడు నేలపై నున్న ఆకులు చెత్తాచెదారము తీసివేయాలి, నీరు నిలిచి బురదగా వున్న నేల నుండి నమూనా తీయకూడదు. తప్పని సరిగా తీయవలసి వచ్చినపుడు నీడన ఆరబెట్టి పరీక్షా కేంద్రానికి పంపించాలి.
  4. మెట్ట / ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తీయవలసినపుడు వరుసల మధ్య నుండి నమూనా సేకరించాలి, చౌడు భూముల్లో 0 – 15 సెంమీ, 15 - 30 సెంమీ లోతులో రెండు నమూనాలు తీయాలి.

[1]

వనరులు మార్చు

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]