సాహిత్యాకాశంలో సగం

సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తెలుగు రచన

సాహిత్యాకాశంలో సగం తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం. దీనిని కాత్యాయని విద్మహే వ్రాసారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషిచేసిన ఆమెకు 2013 ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది.[1] ఈ రచన తెలుగులో స్త్రీల కవిత్వం- కథ-అస్తిత్వ చైతన్యంపై వ్రాసిన వ్యాస సంకలనం.

సాహిత్యాకాశంలో సగం
కృతికర్త: కాత్యాయనీ విద్మహే
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం
ప్రచురణ: సెల్ఫ్ పబ్లిష్డ్
విడుదల: 2010

రచయిత గూర్చి మార్చు

ఆమె వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు డిపార్ట్‌మెం ట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి సాహిత్య అకాడమి డిసెంబరు 18న ఎంపిక చేసింది. ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా' రాసిన బాలీవుడ్‌కు రచయిత జావేద్ అక్తర్, 'మిల్‌జుల్ మన్' రాసిన హిందీ నవలా రచయిత్రి మృదులా గార్గ్ ఉన్నారు. 2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు.[2]

నేపథ్యం మార్చు

పుస్తకంలోని ఆరు వ్యాసాలు స్త్రీల సాహిత్యానికి సంబంధించిన సిద్ధాంత నేపథ్యాన్ని, స్త్రీల సాహిత్యాన్ని గుంపుగా అధ్యయనం చేయటాన్ని తెలియజేస్తాయి. తక్కినవి పది వ్యాసాలు స్త్రీల కవిత్వాన్ని, పన్నెండు వ్యాసాలు స్త్రీల కథల్ని విశ్లేషించాయి. కాత్యాయని ప్రధానంగా కల్పనా సాహిత్య విమర్శకులయినా స్త్రీల కవిత్వాన్ని కూడా విశ్లేషించారు. స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించింది చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో. ఆ వర్ణన ఆధారంగా ఓల్గా ‘ఆకాశంలో సగం’ అనే నవల రాయగా, కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’ అనే విమర్శ గ్రంథం రాశారు. ఈ విమర్శగ్రంథంలోని వ్యాసాలు 1984-2010 మధ్య రెండున్నర దశాబ్దాలలో సదస్సుల కోసం రాసినవి కొన్ని, పత్రికల కోసం రాసినవి ఇంకొన్ని, పుస్తకాలకు రాసిన ముందుమాటలు మరికొన్ని. ఈ వ్యాసాలు స్త్రీవాదం తెలుగులో ప్రారంభమౌతున్న దశలో మొదలై అది స్థిరమైన సిద్ధాంతంగా రూపొంది సామాజిక ఆమోదం పొందే దాకా రాశారు కాత్యాయని. సామాజిక పరిణామ క్రమానికి ప్రాతినిధ్యం వహించే ఈ వ్యాస సంపుటి స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఒక దిక్సూచి, ఒక కరదీపిక.[3]

విశేషాలు మార్చు

కేంద్ర సాహిత్య అకాడమీ గెలుచుకున్న కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’లో 28 వ్యాసాలు ఉన్నాయి. ఇది 2010లో వెలువడింది. ‘రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం’, ‘ప్రాచీన సాహిత్యం- మరోచూపు’ తదితర వ్యాసాలు ఉన్నాయి. కట్టుబాట్లను ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ, విమల తదితరులు చేసిన రచనలను కాత్యాయని విశ్లేషించారు. పుస్తకాలను అర్థం చేసుకోవడానికి, పఠనానుభూతిని ఇతరులతో పంచుకోవడానికి తాను రచనలు చేశానని ఆమె విలేకర్లతో అన్నారు. వరంగల్ జిల్లా నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న వారిలో కాత్యాయని రెండోవారు. జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్‌కు 2004లో ఈ అవార్డు వచ్చింది.[4]

ఈ పుస్తకం 1982 నించీ స్త్రీల రచనల పై నేను రాసిన వ్యాసాల సంకలనం.” స్త్రీల సాహిత్యం ఎందుకు చదవాలి? ఎలా చదవాలి?
స్త్రీల సాహిత్యం చదవడం వల్ల వచ్చే సామాజిక, సాహిత్య ప్రయోజానాలు ఏవిటి?” అని చర్చించే సిద్ధాంత వ్యాసాలు కూడా ఇందులో
ఉన్నాయి. తెలంగాణా విప్లవోద్యమంలో స్త్రీలు రాసిన కథల పై విశ్లేషణలు ఉన్నాయి. కవిత్వం, కథల మీద విశ్లేషణలు ఉన్నాయి.
మొత్తంగా స్త్రీల రచనల మీద అధ్యయనానికి అవసరమైన సైద్ధాంతిక వ్యాసాలున్నాయి. తెలుగు రచయిత్రులకు సంబంధించిన పుస్తకం
కాబట్టి ఈ అవార్డు తెలుగు రచయిత్రులందరిదీ.[5]

కాత్యాయనీ విద్మహే, -

మూలాలు మార్చు

  1. "సాహిత్య అకాడమీ అవార్డులు" (PDF). Archived from the original (PDF) on 2013-12-19. Retrieved 2016-02-08.
  2. "ఆధ్రజ్యోతి లో పురస్కార విశేషాలు". Archived from the original on 2013-12-28. Retrieved 2016-02-08.
  3. సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి – రాచపాళం చంద్రశేఖరరెడ్డి
  4. కాత్యాయనికి కేంద్ర సాహిత్య అవార్డు Sakshi | Updated: December 19, 2013
  5. కాత్యాయనీ విద్మహే గారితో డా||కె.గీత ఇంటర్వ్యూ

ఇతర లింకులు మార్చు