సెట్టి లక్ష్మీనరసింహం

ఉపాధ్యాయుడు, న్యాయవాది, కవి, పండితుడు, నాటక రచయిత, ప్రయోక్త, నటుడు.

సెట్టి లక్ష్మీనరసింహం (1879 - 1938) ఉపాధ్యాయుడు, న్యాయవాది, కవి, పండితుడు, నాటక రచయిత, నాటక సమాజ నిర్మాత, నాటక ప్రయోక్త, నటుడు. వీరిని "సెట్టి మాస్టరు" గారని కూడా పిలిచేవారు.

వీరు 1879 సంవత్సరం గంజాం జిల్లా గోపాలపురంలో జన్మించారు.

ధార్వాడ నాటక సమాజం వారు ఆంధ్ర దేశమంతా అంతా నాటకాలను ప్రదర్శించారు. ఆ కాలంలో శ్రీ రఘునాథ వర్మ గారు జగన్మిత్ర నాటక సమాజాన్ని 1885 సంవత్సరంలో స్థాపించారు. అందులో అంకితం జగ్గారావు, విక్రమదేవవర్మ, మొసలికంటి సూర్యనారాయణ, కాదంబరి జగన్నాథం, సెట్టి లక్ష్మీనరసింహం మొదలైన వారు సభ్యులుగా ఉండి షేక్ ష్పియర్ నాటకాలు, వేణీసంహారం, చంద్రహాస, శ్రీనివాస కళ్యాణం, హరిశ్చంద్ర మొదలైన నాటకాలను అద్భుతంగా ప్రదర్శించేవారు. 1901 సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు జగన్మిత్ర సమాజంలో ప్రముఖ బాధ్యతలు వహించారు.

నరసింహంగారు మద్రాసులో పట్టభద్రులైన తర్వాత విశాఖపట్నం చేరి కళాభిలాషక నాటక సమాజ స్థాపనలో మారేపల్లి రామచంద్రశాస్త్రి గారితో పనిచేశారు.

వీరు ఎక్కువగా భీముడు, భీష్ముడు, సత్యవంతుడు, అర్జునుడు, దుర్యోధనుడు మొదలైన ఉదాత్తమైన పాత్రలను ధరించారు.

నరసింహంగారు రుక్మిణీ కళ్యాణం (1905), కీచక వధ (1907), చిత్ర హరిశ్చంద్రీయం (1913), లుబ్ధాగ్రేసర చక్రవర్తి ప్రహసనం (1914), చిత్ర (1933) మొదలైన నాటకాలను రచించారు.

ఎన్నో ఘన విజయాలు సాధించిన సెట్టి గారు 1938 జూన్ 12 వ తేదీన పరమపదించారు.