స్మారక నాణెం

స్మారక నాణెం అనేది ఒక ప్రత్యేక రకం నాణెం

స్మారక నాణెం అనేది ఒక ప్రత్యేక రకం నాణెం, ఇది ఒక నిర్దిష్ట సంఘటన, వ్యక్తి లేదా ముఖ్యమైన మైలురాయిని గౌరవించడానికి, జరుపుకోవడానికి జారీ చేయబడుతుంది.[1] ఈ నాణేలను సాధారణంగా సాధారణ చలామణిలో ఉపయోగించరు. వీటిని కేవలం ముద్రించి సేకరణ వస్తువులుగా అమ్ముతారు. వీటిని ఎక్కువగా నాణేల సేకరణదారులు కొనుక్కుంటారు. అయితే కొన్ని దేశాలు సాధారణ చలామణి కోసం స్మారక నాణేలను కూడా జారీ చేస్తాయి. స్మారక నాణేలను ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు జారీ చేస్తాయి. ఇవి సాధారణంగా ముఖ్యమైన చారిత్రక వార్షికోత్సవాలు, జాతీయ వేడుకలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక పండుగలు లేదా రాజకీయ నాయకులు, కళాకారులు లేదా శాస్త్రవేత్తలు వంటి ప్రముఖ వ్యక్తులను గౌరవించడానికి సృష్టించబడతాయి. ఈ నాణేలను ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలో ఉన్న నాలుగు భారత ప్రభుత్వ సంస్థలలో ఉత్పత్తి చేస్తారు. ఇవి సాధారణంగా పరిమిత పరిమాణంలో ఉత్పత్తి చేయబడతాయి. మొట్ట మొదట జవహర్‌లాల్ నెహ్రూ గౌరవార్థం 1964లో భారతదేశం తన మొదటి స్మారక నాణాన్ని విడుదల చేసింది.[2]

రు. 75 నాణేన్ని విడుదల చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

చరిత్ర మార్చు

చారిత్రక పరిశోధనలో నాణేలు చాలా ముఖ్యమైనవి, ముఖ్యంగా ఈ నాణేల సహాయంతో చరిత్రలోని సంస్కృతి వయస్సును నిర్ణయించడానికి చాలా అరుదుగా ఉపయోగించబడతాయి. మొహెంజొదారో, హరప్పా, చన్హుదారో, తక్షిలా, లోథాల్ మొదలైన పురాతన సాంస్కృతిక కేంద్రాలలో త్రవ్వకాలలో లభించిన నాణేలు చరిత్ర గురుంచి తెలుసుకోవడానికి సహాయపడ్డాయి.

పురాతన, మధ్యయుగ కాలాలు మార్చు

పురాతన, మధ్యయుగ కాలంలో పాలకులు వారి పాలన, సైనిక విజయాలు, మత లేదా సాంస్కృతిక సంఘటనలకు గుర్తుగా స్మారక నాణేలను విడుదల చేశారు. ఈ నాణేల మీద సాధారణంగా పాలక రాజవంశం లేదా స్మారక సంఘటనకు సంబంధించిన శాసనాలు, చిహ్నాలు, చిత్రాలు ఉన్నాయి.

వలస కాలం మార్చు

భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనలో, బ్రిటిష్ రాజుల సందర్శన, ఢిల్లీ దర్బార్, ఈస్టిండియా కంపెనీ వంటి ముఖ్యమైన సందర్భాలకు గుర్తుగా స్మారక నాణేలను విడుదల చేశారు. ఈ నాణేల మీద తరచుగా బ్రిటిష్ చక్రవర్తుల చిత్రాలు లేదా బ్రిటిష్ ఆయుధాలు ఉండేవి.

స్వాతంత్ర్యానంతర కాలం మార్చు

1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత ప్రభుత్వం ప్రముఖులను, జాతీయ మైలురాళ్లను, ముఖ్యమైన సంఘటనలను గౌరవించడానికి స్మారక నాణేలను జారీ చేయడం ప్రారంభించింది. ఈ నాణేలు సాధారణంగా రూపాయిలు, పైసలతో సహా వివిధ డినామినేషన్లలో ముద్రించబడతాయి, ఇవి రాగి, నికెల్, వెండి, బంగారం వంటి వివిధ లోహాలతో తయారు చేయబడతాయి.

గుర్తించదగిన స్మారక నాణేలు మార్చు

భారతదేశం అనేక స్మారక నాణేలను విడుదల చేసింది, ఇవి ఎక్కువగా సేకరణదారుల వస్తువులుగా మారాయి. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు:

  • జవహర్ లాల్ నెహ్రూ శతజయంతి నాణెం (1989) : భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 100వ జయంతిని పురస్కరించుకుని విడుదల చేశారు.[3]
  • మహాత్మాగాంధీ శతజయంతి నాణెం (1969) : జాతిపిత మహాత్మాగాంధీ 100వ జయంతిని పురస్కరించుకుని దీనిని రూపొందించారు.
  • ది గోల్డెన్ జూబ్లీ కాయిన్ ఆఫ్ ఇండిపెండెన్స్ (1997) : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విడుదలైంది.
  • జాతిపిత మహాత్మాగాంధీ గౌరవార్థం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్మారక నాణేలను విడుదల చేసింది. ఈ నాణేలు గాంధీ జీవితంలోని ముఖ్యమైన అంశాలను, భారత స్వాతంత్ర్యోద్యమానికి ఆయన చేసిన కృషిని హైలైట్ చేస్తూ వివిధ విభాగాలు, డిజైన్లను కలిగి ఉన్నాయి.
  • భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125 వ జయంతిని పురస్కరించుకుని 2015 లో భారత ప్రభుత్వం స్మారక నాణేన్ని విడుదల చేసింది. ఈ నాణేనికి ఒకవైపు అంబేద్కర్ చిత్రపటం, మరోవైపు అశోక స్తంభం చిహ్నం ఉన్నాయి.
  • ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2013లో స్మారక నాణేన్ని విడుదల చేసింది. ఈ నాణెంపై స్వామి వివేకానందుడి బొమ్మతో పాటు 150వ జయంతి వేడుకల చిహ్నం కూడా ఉంది.
  • కవి, తత్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 150 వ జయంతి సందర్భంగా, భారత ప్రభుత్వం 2011 లో స్మారక నాణేన్ని విడుదల చేసింది. ఆ నాణెంలో ఠాగూర్ చిత్రపటం, చేతిరాత సంతకం ఉన్నాయి.
  • పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ 350 వ జయంతిని 2017 లో ప్రత్యేక నాణెంతో జరుపుకున్నారు. ఈ నాణెంలో గురు గోవింద్ సింగ్ చిత్రపటంతో పాటు 350వ జయంతి వేడుకల చిహ్నం కూడా ఉంది.
  • క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం: 2017లో క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్బీఐ స్మారక నాణేన్ని విడుదల చేసింది. ఈ నాణేనికి వార్షికోత్సవం లోగో, "క్విట్ ఇండియా ఉద్యమం 1942-2017" అనే నినాదం ఉన్నాయి.

రూ. 75 నాణెం మార్చు

ప్రముఖ వ్యక్తులకు నివాళులు అర్పించడం, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం లేదా కీలకమైన చారిత్రక సంఘటనలను గుర్తుచేసుకోవడం వంటి అనేక కారణాల వల్ల భారతదేశం 1964 నుండి స్మారక నాణేలను విడుదల చేస్తోంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశాడు ( 2023 మే 25 విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదట కాయిన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. డెబ్బై-ఐదు రూపాయల నాణెం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అధికారం కింద జారీ చేయడానికి టంకశాలలో తయారు చేయబడుతుంది” అని అది పేర్కొంది).

విశేషాలు మార్చు

  • రూ.75 నాణెం 44 మిమీ వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది, దాని అంచుల వెంట 200 సెర్రేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమంతో తయారు చేసారు.[4]
  • నాణెంకి ఒక వైపు మధ్యలో సత్యమేవ జయతే అనే అక్షరాలతో, ఎడమ అంచున "భారత్" అనే పదంతో దేవనాగరి లిపిలో, కుడి అంచున ఆంగ్లంలో "INDIA" అనే పదాలు ఉన్నాయి.
  • నాణేనికి వేరొక వైపు కొత్త పార్లమెంట్ భవనంచిత్రం. "సంసద్ సంకుల్" అనే అక్షరాలు ఎగువ అంచున దేవనాగరి లిపిలో వ్రాయబడి ఉండగా, నాణేనికి దిగువ అంచున ఆంగ్లంలో "Parliament Complex" అని రాయబడింది.
  • ఎవరైనా స్మారక నాణేలను కొనుక్కోవాలంటే వీటిని సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్‌సైట్‌లో కొనుకోవచ్చు.
  • నాణేల చట్టం, 2011 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వివిధ విలువలతో నాణేలను రూపొందించే, ముద్రించే అధికారం ఉంటుంది. నాణేల విషయంలో, ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే నాణేల పంపిణీకి మాత్రమే పరిమితం చేయబడింది.
  • ఇది మూడవ పార్టీల అభ్యర్థన మేరకు కూడా అటువంటి నాణేలను ముద్రిస్తుంది.

2017లో, భారతీయ నటుడు, రాజకీయవేత్త దివంగత ఎంజి రామచంద్రన్, కర్ణాటక గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మిలకు నివాళులర్పించేందుకు ప్రభుత్వం స్మారక నాణేలను విడుదల చేసింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి స్మారక నాణేల కోసం శ్రీ షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్ & సంగీత సభ, ఎంజి రామచంద్రన్ స్మారక నాణేల కోసం తమిళనాడు ప్రభుత్వం అభ్యర్థనను సమర్పించిన తర్వాత నాణేలను తయారు చేసింది.[5]

మూలాలు మార్చు

  1. "Importance of commemorative coins". World Coin Association. Retrieved 2023-05-29.
  2. "Commemorative coins: How Indian currency has served as a publicity tool". The Indian Express. 2017-09-13. Retrieved 2023-05-29.
  3. "List of Commemorative Coins in India Information". www.oldcoinonline.com. Retrieved 2023-05-29.
  4. "Here's the first look of the Rs 75 coin, postage stamp released by PM Modi to mark new Parliament's opening". The Indian Express. 2023-05-28. Retrieved 2023-05-29.
  5. "PM Modi releases Rs 75 coin on new Parliament inauguration day: Features, how to get it". The Indian Express. 2023-05-28. Retrieved 2023-05-29.