1956 గోదావరి పుష్కరాలు

మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి పుష్కరాలు. అన్ని పుష్కరాల విధంగానే ఈ పుష్కరాలకు కూడా అధికారికంగా తేదీలు నిర్ణయించారు. అయితే ఆ తేదీలు సరైనవి కావని పండితులు మరో తేదీలు ఖరారు చేశారు. కనుక 24 రోజులు పుష్కరాలు చేయడం తప్పనిసరి అయింది. వేద సండితులు నిర్ణయించిన ప్రకారం మే 3 నుంచి 14 వ తేదీ వరకు పుష్కరాలు జరిగాయి. అధికారులు మే 22 నుంచి జూన్ 2 వరకి పుష్కరాలను జరిపించారు.

గోదావరి పుష్కరాలు

1956లో వేసవికాలంలో పుష్కరాలు వచ్చాయి. దీంతో స్నానాలు చేయడానికి తగినంత నీళ్లు లేక భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పటి లెక్కల ప్రకారం ఈ పుష్కరాలలో మొత్తం 22,55,675 మంది స్నానాలాచరించారని అధికారికంగా ప్రకటించారు. ఈ పుష్కరాలను అప్పటి దేవాదాయశాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి ప్రారంభించారు.

పుష్కరాలకు ఏపి పేపర్ మిల్ వెనేక ఉన్న ప్రాంతంలో తాటాకు పాకల్లో పుష్కరనగర్ నిర్మించారు. తడికలు, పందిళ్లు వంటివి ఏర్పాటుచేయడంతో యాత్రికులు బసచేయడానికి అక్కడికి వెళ్లేవారు. అక్కడ ఆ పేపర్ మిల్లు దుర్గంధం ప్రయాణికులను బెంబేలెత్తించింది.

అధికారికంగా పుష్కరాలు ప్రరంభమైన మే 22 సాయంత్రం పెద్దగాలివానతో కూడిన తుఫాన్ వచ్చింది. గోదావరి రైల్వేస్టేషన్ వద్ద నిర్మించిన అదనపు వసతి రేకుల షెడ్ గాలికి ఎగిరిపోయింది. కరెంట్ సరఫర కూడా నిలిచిపోయింది.

రాజమండ్రిలో చాలా ప్రాంతాలలో ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటుచేసి, యాత్రికులకు వైద్య సదుపాయం అందించారు. జీవ కారుణ్య సంఘం కుష్టు రోగులకు, అనాథ వృద్ధులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కోనాల నూకరాజు లేఅవుట్ లో ప్రత్యేక వసతి, ఉచిత అన్నదాన కేంద్రాన్ని నిర్వహించారు.

యాత్రికులు నగరంలో తిరగకుండా వారిని పాత సీ.పీ.ఆర్.ఐ. ఎదురుగా ఉన్న స్థలానికి తీసుకువెళ్లి అప్పటి పుష్కర కమిటీ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది.

నాగులచెరువు ప్రాంతంలో ఏర్పాటుచేసిన సినీ ఎగ్జిబిషన్ ను అప్పటి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పోతుల వీరభధ్రరావు ప్రారంభించారు. పిలిప్స్ కంపెనీ వారు తొలిసారిగా టీవీని ప్రదర్శించి ఐదు రూపాయలు టికెట్ గా వసూలుచేశారు. అప్పట్లో కొత్తగా వచ్చిన టీవి చూడడానికి అధిక సంఖ్యలో తరలివెళ్లేవారు.

గోదావరి పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకొని గోదావరి రైల్వేస్టేషన్లో రెండవ రైల్వేలైనుకు కూడా ఈ పుష్కరాలలోనే నిర్మించారు.

పోలీసులకు వసతి ఏర్పాటుచేసిన లూధర్ నగర్ లో కాట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా భొజనాల్లో సాంబారుతోపాటు కప్పలు వచ్చాయి. దీంతో సుమారు 500 మంది పోలీసులు రెండురోజులపాటు భోజనం మానేసి నిరిహారదీక్ష చేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన ఈ పుష్కరాలు కొన్ని చేదు అనుభవాలను మిగిల్చాయి.

పుష్కరాల నిర్వాహక కమిటీ మార్చు

మూలాలు మార్చు

  • ఆంధ్రప్రభలో కొండ్రెడ్డి శ్రీనివాస్ వ్యాసం_ ఏప్రిల్ 18, 2015