కల్లూరి చంద్రమౌళి

స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు.

కల్లూరి చంద్రమౌళి (నవంబరు 15, 1898 - జనవరి 2, 1992) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఆర్ష విద్యాలంకార బిరుదాంకితుడు. ఇతను సంయుక్త మద్రాసు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ మూడింటిలో మంత్రిపదవి నిర్వహించాడు. దేవాదాయ శాఖా మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా పనిచేశాడు.భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించాడు.[1].సమగ్ర పంచాయితీ రాజ్ చట్టం మొదటిసారి రూపొందించి మద్రాసు శాసన సభలో అమోదింపజేసిన వ్యక్తి. శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించాడు.

కల్లూరి చంద్ర మౌళి
శ్రీ కల్లూరి చంద్ర మౌళి స్వాతంత్ర సమర యోధులు
జననం1898 నవంబరు 15
మోపర్రు, గుంటూరు జిల్లా
మరణం1992 జనవరి 2
Notable work(s)మద్రాసు, ఆంధ్రప్రదేశ్ లలో మంత్రివర్యులు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
రాజకీయ ఉద్యమంస్వాతంత్ర సమరం
మతంహిందువు
భార్య / భర్తశ్రీమతి బుల్లెమాంబ
పిల్లలుఒక కుమారుడు, ఒక కుమార్తె
తల్లిదండ్రులువెంకమాంబ , సుదర్శనం
Honoursఆర్ష విద్యాలంకార

జననం, విద్య మార్చు

కల్లూరి చంద్రమౌళి 1898 నవంబరు 15న గుంటూరుజిల్లా, అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. వీరికి బాల్యం నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టం. ప్రాథమిక విద్య తుళ్ళూరు, తెనాలి, బాపట్ల లోనూ ఉన్నత విద్య కలకత్తా లోనూ చదివాడు. 1920లో ఇంగ్లాండు వెళ్ళి స్కాట్లాండు లోని ఎబర్డీన్ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందాడు. విద్యనభ్యసించిన చంద్రమౌళి 1924 లో స్వతంత్ర భావాలను గుండెలలో నింపుకొని భారతదేశానికి తిరిగివచ్చారు. చంద్రమౌళి వివాహం ముల్పూరు చెందిన ఆవుల పిచ్చయ్య పుత్రిక బుల్లెమాంబ తో 1919లో జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె .

స్వాతంత్ర పోరాటంలో మార్చు

బ్రిటీష్ ప్రభుత్వంలో ఉద్యోగం చేయటానికి నిరాకరించిన చంద్రమౌళి దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. 1926లో వార్దా సేవాగ్రాం వెళ్ళి గాంధీజీని కలిసాడు. అక్కడ మూడు నెలలు ఉండి కాంగ్రెస్ కార్యకర్తగా ఖద్దరు దరించి, గుంటూరు వచ్చాడు. ఊరురూ తిరిగి యువజన సంఘాలను పెట్టి వారిలో స్వతంత్ర భావాలను నాటాడు.1929 లో గాంధిజీ గుంటూరు జిల్లా పర్యటనలో తోడుగా ఉండి తన స్వగ్రామం మోపర్రు తీసుకు వెళ్లి స్వాతంత్ర్య సమరానికి విరాళాలు పోగుచేసాడు. మహాత్మా గాంధీ నాయకత్వంలో అన్ని జాతీయోద్యమాలల్లో పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు.[1]

ఉప్పు సత్యాగ్రహం లో పాల్గోని అరెస్టైయి 18-6-1930 నుండి 12-3 1931 వరకు రాయవెల్లూరు జైల్లో గడిపాడు. గుంటూరులో కొండా వెంకటప్పయ్య ఇంటిలో ఉప్పు తయారు చేసి శాసనోల్లఘన చేసినందులకు 25-2-1932 నుండి 24-2-1933 వరకు కడలూరు జైల్లో గడిపాడు.1933 డిసెంబరులో గాంధీజీ ఆంధ్రలో హరిజన యాత్ర సాగించాడు. వారి గుంటూరు పర్యటనలో చంద్రమౌళి అన్ని తానై దానిని విజయవంతం చేసాడు. గాంధీజీ చేత 1933 డిసెంబరు 23 న కావురు వినయాశ్రమంకి ప్రారంబోత్సవం చేపించాడు, అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించాడు.

1934 లో గుంటూరు జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడైనాడు.[2] 1938లో జిల్లా బోర్డ్ అద్యక్షునిగా ఎన్నికైనాడు.

1940 లో కుచిపూడి గ్రామంలో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో కళా వెంకట్రావు, శరణు రామస్వామి చౌదరి, మంతిన వెంకట రాజు వంటి స్వాతంత్ర్య యోద్గులతో కలిసి ప్రారంభించగా ఇతనికి 300 రూపాయలు జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష విధించగా తిరుచునాపల్లి జైలులో గడిపాడు.

1942లో కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది. ఆ ఉద్యమ సమయంలో 1942 సెప్టెంబరు 12 న తెనాలిలో చంద్రమౌళి నాయకత్వంలో శాంతి యుతంగా మొదలైన అందోళన వారి అదుపుతప్పి ఉద్రిక్తంగా మారి హింసాత్మక రూపు ధరించింది. తెనాలి రైల్వై స్టేషన్ తగలపెట్టిన ఆందోళనకారులు తాలూకా ఆఫీస్ లక్ష్యంగా వస్తున్న వేళ జరిగిన పోలిసు కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు అసువులు బాసారు. తెనాలిలో వారి స్మృతి చిహ్నంగా 1959లో 'రణ రంగ చౌక్' ను నిర్మించారు.

ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు చంద్రమౌళితో పాటు అనేక మందిని అరెస్టచేసారు.ఇతను రెండు సంవత్సరాలు రాయవెల్లూరు జైలులో గడిపాడు.[3]

1946 లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్కు (మొదటి పార్లమెంట్) సభ్యునిగా మద్రాస్ ప్రొవెంషియల్ నుండి ఎన్నికై భారత రాజ్యంగ సభ్యులుగా రెండు ఏళ్ళు పనిచేసాడు.

రాజకీయ జీవితం మార్చు

1937, 1946, లలో శాసనసభకు ఎన్నికై మద్రాసు ప్రావిన్సులో శాసన సభ్యునిగా పనిచేసాడు.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓ,పి రామస్వామి రెడ్డియార్ మంత్రివర్గంలో చంద్రమౌళి స్డానిక సంస్థలు, సహకార శాఖామాత్యులుగా (1947 - 1949) పనిచేసాడు. 1949- 52 లలో పి.యస్. కుమారస్వామి రాజా మంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.1952 జరిగిన మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలో పరాజయం పొందాడు.
పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానంతో 1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1955 లో జరిగిన తొలి శాసన సభ ఏన్నికలో చంద్రమౌళి అమృతలూరు నుండి ఏన్నికై బెజవాడ గోపాలరెడ్డి మంత్రి వర్గంలో రెవెన్యూ, దేవాదాయ శాఖా మంత్రిగా (1955-56) పనిచేసాడు. దామోదరం సంజీవయ్య గారి మంత్రి వర్గంలో దేవాదాయ శాఖా మంత్రిగా (1960- 62) పనిచేసాడు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశాడు. 1962లో శాసన సభకు జరిగిన ఎన్నికలో వేమూరు నుండి ఏన్నికై శాసన సభ్యునిగా పనిచేశాడు.
1964లో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షునిగా, రామాలయ జీర్ణోద్ధరణ సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యినిగా పనిచేసాడు.

పరిపాలక కేంద్రాలుగా గ్రామాలు మార్చు

“నగర జీవనం నాగరికత కాదు” నగరాలు అంటూ పరుగెత్తితే పాలు కాదు నీళ్ళు కూడా దొరకవు. గ్రామాలకు ఆర్థిక వనరులు పెంచాలి. న్యాయ పరిపాలనా బాధ్యతలు పెంచాలి. వాటి పని తీరు మెరుగుపరచాలి. గ్రామాలను ప్రాథమికమైన పరిపాలక కేంద్రాలుగా తయారు చేయాలి. గ్రామాల వనరుల మీద గ్రామానికి అధికారాలు ఉండాలి. గ్రామాల్ని పంచాయతీలుగా విభజించి వాటి సమగ్ర అభ్యున్నతికి అవకాశం కల్పించాలి. భారతీయ సంస్కృతికి, సత్ప్రవర్తనకూ గ్రామమే ప్రధాన కేంద్రం. మన దేశపు ఉత్తమ సంప్రదాయాలకు ఉదాత్త ఆశయాలకూ గ్రామమే ఉత్పత్తి స్థానం."
స్వేచ్ఛా భారత్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన సహకార శాఖా మంత్రిగా పనిచేసిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ కల్లూరి చంద్రమౌళి నోట జాలువారిన మాటలివి. చంద్రమౌళిగారు. మోపర్రు గ్రామంలో 15.11.1898న జన్మించారు. వెంకమ్మ, సుదర్శనం తల్లిదండ్రులు. 1924లో ఇంగ్లాండులో వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడై స్వదేశానికి తిరిగి వచ్చిన కల్లూరి చంద్రమౌళి బ్రిటీష్ పాలనలో భారతదేశ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూసి చలించిపోయి స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రత్యక్షంగా పోరాటానికి నడుం బిగించారు. ఆంధ్రదేశంలో మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితులలో ఒకరైన కల్లూరి చంద్రమౌళి, మహాత్మాగాంధీ చూపిన బాటలో నడిచి ఆనాటి మేటి ఉద్యమాలైన సైమన్ గో బ్యాక్, ఉప్పు సత్యాగ్రహం. విదేశీ వస్త్ర బహిష్కరణ, శాసనోల్లంఘన, హరిజనోద్ధరణ, సహాయ నిరాకరణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని ప్రజలకు నాయకత్వం వహించి పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. స్వాతంత్ర్యోద్యమకాలంలో జిల్లా కాంగ్రెస్కు, ఆంధ్ర అసెంబ్లీ కాంగ్రెస్ కు అధ్యక్షులుగా పనిచేశారు.
1938-42 మధ్య కాలంలో గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షునిగా ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేపట్టి జిల్లాలోని మారుమూల గ్రామాలలోని ప్రజలకు కూడా చేరువయ్యాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు జిల్లా బోర్డు అధ్యక్ష పదవిని త్యజించాల్సి వచ్చినా లెక్క చేయక ఉద్యమానికి నాయకత్వం వహించి జైలు జీవితం గడిపిన త్యాగమూర్తి. 1933లో ఆయన రాసిన నానా దేశ రాజ్యాంగాలు, రైతు రాజ్యాంగం పుస్తకాలు కల్లూరి చంద్రమౌలికి వివిధ దేశాల రాజ్యాంగాలపై ఉన్న పట్టుకి నిదర్శనాలుగా నిలుస్తాయి. అందువల్లనే ఆయనని భారత రాజ్యాంగ పరిషత్తుకి సభ్యునిగా ఎన్నుకొన్నారు. రాజ్యాంగ పరిషత్తు సమావేశాలలో పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాణానికి సహకరించారు. 1947 మార్చి 23న మద్రాసు ప్రావిన్సులో స్థానిక స్వపరిపాలన, సహకార శాఖా మంత్రిగా పనిచేసిన కాలంలో అయిన సుమారు 20,000 సహకార సంఘాల ఏర్పాటుకు, వాటి అభివృద్ధికి కృషి చేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం రావటంతో మరల స్థానిక స్వపరిపాలన సహకార శాఖామంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. అనునిత్యం ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వంగల చంద్రమౌళి గతంలో జిల్లా బోర్డు అధ్యక్షునిగా పనిచేయటం వల్లనూ, స్వతహాగా స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలనే ఆకాంక్ష గలిగిన వ్యక్తి కావటం చేత ప్రాచీన గ్రామ పంచాయతీ వ్యవస్థను పునరుద్ధరించి గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలలో మెరుగుదలను తీసుకొని రావాలని ఆకాంక్షించేవాడు. ఎప్పటినుండో తాను కంటున్న కలలను సాకారం చేసే ఉద్దేశంతో స్థానిక స్వపరిపాలనా మంత్రిగా పనిచేస్తున్న చంద్రమౌళి చొరవ తీసుకొని స్వాతంత్ర్యానంతరం గ్రామ స్వరాజ్యానికి తొలి పునాదిగా సమగ్ర పంచాయితీ రాజ్ చట్టాన్ని 1950లో గణతంత్ర భారతదేశంలోనే మొదటి సారిగా రూపొందించి మద్రాస్ రాష్ట్ర శాసన సభలో ఆమోదింపచేశారు.
ఆనాటి పంచాయతీ చట్టంలో ఇంటి పన్ను, వృత్తి పన్ను, మార్కెట్ -పన్నులు వసూలు చేయటానికి గ్రామ పంచాయతీకి అధికారాలు కల్పించారు. గ్రామంలో జరిగే వ్యవసాయ పంటల క్రయ విక్రయాలపై పన్నులు (కొలగారం పన్ను) వసూలు చేసుకొనే హక్కును పంచాయతీలకు కల్పించారు. పంచాయతీ అధ్యక్షులకు చెక్ పవర్ ఇవ్వటం అన్నది మొట్టమొదటిసారిగా ఈ చట్టం ద్వారానే అమల్లోకి వచ్చింది. ఏ ప్రజా ప్రతినిధికి లేని అధికారం గ్రామ పంచాయతీ అధ్యక్షునికి కల్పించటంలో చంద్రమౌళిగారి ముందు చూపు నేటికీ ఆదర్శనీయం. గ్రామ పంచాయతీలకు పునరుజ్జీవనాన్ని ప్రసాదిస్తూ వాటిని స్వయం. పాలనా సంస్థలుగా తీర్చిదిద్దటానికి అవసరమైన అన్ని అధికారాలను బదలాయిస్తూ చేయబడింది మద్రాస్ పంచాయతీ రాజ్ చట్టం (1950). భారతదేశం రిపబ్లిక్ గా ప్రకటించుకున్న తరువాత రూపొందించిన తొలి చట్టం కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులుగా పనిచేసిన కల్లూరి చంద్రమౌళి, భద్రాచల క్షేత్రాన్ని పునరుద్ధరించటంలో చూపిన చొరవవల్లే నేడు భద్రాచల పుణ్యక్షేత్రం శ్రీరామచంద్రుడు భక్తులకు దివ్య సుందర రూపంతో దర్శనమిస్తున్నాడంటే రైతు రాజ్యాంగం, నానాదేశ రాజ్యాంగాలు, భారతీయ ప్రతిభ. రామాయణు సుధాలహరి, మతం-భౌతిక శాస్త్రం, ఆండాళ్ వైభవం, పురుషార్థాలు, యుగ సమీక్ష, వేద సుధాకరం, ఉజ్వల తరంగిణి, భాగవత సుధ, ఆర్ష సంస్కృతి సీతామహా సాధ్వి, వివేకానందస్వామి' వంటి 14 పుస్తకాలను కూడా ఆయన రచించారు. ఫలాపేక్షరహితమైన సేవే నిజమైన సేవ. నిష్కామ కర్మ మాత్రమే నిజమైన తృప్తిని, ముక్తిని ప్రసాదిస్తుందని సమ్మే వ్యక్తి చంద్రమౌళి. స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చే 5 ఎకరాల భూమిని తీసుకొనేందుకు నిరాకరించారు చంద్రమౌళి, తనకంటూ ఎటువంటి సంపదనూ కూడగట్టుకోకుండా తన కుటుంబ యావదాస్థిని ప్రజల కోసం ఖర్చు చేసిన దాన కర్ణుడు చంద్రమౌళి. వినోభాభావే భూదాన ఉద్యమ స్ఫూర్తితో 1950లో గుంటూరు జిల్లా పొన్నూరు సమీపాన కొండముది గ్రామంలో తనకు గల 5 ఎకరాల మాగాణి భూమిని దానం చేసిన ప్రగతిశీల నాయకులు కల్లూరి చంద్రమౌళి. భారత ప్రభుత్వం స్వాతంత్ర్యోద్యమంలో నాయకత్వం వహించిన వారికి ఇచ్చే 'స్వాతంత్ర్య సైనిక్ సమ్మాన్'గా గుర్తించి పింఛను సదుపాయం ఏర్పాటుచేసింది. అయితే ఫించను తీసుకోవటానికి కూడా నిరాకరించిన ఆదర్శమూర్తి. శాసన సభ్యునిగా పనిచేస్తున్న కాలంలో జీత భత్యాలు తీసుకోవటానికి నిరాకరించి 'గాంధీ' గారిచే "ఒక ఆదర్శ కాంగ్రెస్ వాది అంటే చంద్రమౌళిలా ఉండాలి" అని అనిపించుకొన్న ఘనత ఆయనకే దక్కుతుంది.

పదవీ త్యాగం మార్చు

చంద్రమౌళి అధ్యక్షులుగా భద్రాచల రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఆలయాన్ని ఆగమ విరుద్దంగా నిర్మిస్తున్నారని దానిని నిలువరించాలని కాంగ్రెస్ లోని వీరి ప్రత్యర్థులు ఆందోళన చేసి, అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డిచే విచారణ కమిటీని ఏర్పాటు చేయించారు. తనను కనీసం సంప్రదించకుండా సంజీవ రెడ్డి కమిటీ నియమించినందులకు నిరసించారు. ఆత్మాభిమానంతో రామాలయ జీర్ణోద్ధరణ సంఘానికి రాజీనామా చేస్తూ, స్వార్ద రాజకీయాలకు నిరసనగా 1965 లో తన శాసన సభ సభ్యత్వానికి, టి.టి.డి అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసాడు. నమ్మిన సిద్దాంతం కొరకు పదవిని తృణప్రాయంగా విసర్జించిన పరిశుద్ధ గాంధేయ వాది చంద్రమౌళి. ఆ తరువాత విచారణ కమిటి దేవాలయ నిర్మాణంలో వచ్చిన ఆరోపణలలో నిజం లేదని, చంద్రమౌళి రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఆలయ నిర్మాణం కొనసాగించమని చెప్పింది.

భద్రాచలం మార్చు

చంద్రమౌళి సేవలలో ముఖ్యమైంది భద్రాచలం గుడి పునర్నిర్మాణం. 1960 నాటికి గుడి బాగా శిథిలమైంది. ఆకాలంలో చంద్రమౌళి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యాడు. వెంటనే గుడి పునఃనిర్మాణానికి నడుం కట్టారు. అతని అధ్యక్షతన రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటైంది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశాడు. నాడు భద్రాచలం మారుమూల అటవీప్రాతం. యాత్రీకులకక్కడ ఏ సౌకర్యాలు లేవు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించాడు. ముందుగా కల్యాణమండపం నిర్మించ తలపెట్టాడు. సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు. కొత్తగూడెం వరకు రైళ్ళలో తెచ్చి అక్కడినుండి గోదావరి వరకు లారీలలో తరలించారు. పెద్ద పెద్ద రాతి శిలలను ఇసుకలో నెట్టుకు వచ్చి, లాంచీలలో కెక్కించి అతికష్టంతో భద్రాచలం చేర్పించారు. చంద్రమౌళి నగర్లో 500 శిల్పులు 3 లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కళ్యాణమండపం నిర్మించారు. రామాలయానికి దక్షిణాన ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం నిర్మించారు. శిల్పశోభాయమానమైన గోపురాలు నిర్మించారు. దీనిలో ఆరు అడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు. రామదాసు కీర్తనలు, భక్తి తరతరాలవారికి తెలియచేసే అపురూప నిర్మాణమిది. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. ఈ రాతిని సమీపంలోని తాటియాకుల గూడెంలో సేకరించారు. మహామండపాన్ని అష్టలక్ష్ములు, దశావతారాలు, ఆళ్వారుల శిల్పాలతో అలంకరించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటుచేశారు. ఈ విమానం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది.
1965 నుండి రాజకీయాలకు దూరంగా గుంటూరులో రచనా వ్యాసాంగంలో కాలం గదుపుతున్న చంద్రమౌళి జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే 1974 లో తిరిగి రామాలయ ధర్మకర్తల సంఘానికి అధ్యక్షులుగా నియమించాడు. వెంటనే విశేషంగా విరాళాలు సేకరించి చిత్రకూట మంటపాన్ని 127 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించాడు. స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు చెక్కించాడు. మంటపంలో సంగీత సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తున్నారు.
ఈ విధంగా అనేక అపవాదులను, కష్ట నష్టాలను అపార భక్తితో భరించి భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి అపర రామదాసుగా కీర్తిగాంచారు.[4]

రచనలు మార్చు

 

చంద్రమౌళి రచనలు పరిశీలించితే అతనిని ఒక కవిగా, విమర్శకునిగా, తాత్వికునిగా గోచరిస్తారు. 1955లో తిరుపతిలో విశ్వ సంస్కృతసదస్సు నిర్వహించాడు. పొన్నూరు, అన్నవరం కవి పండిత సదస్సులలో పాల్గోన్నాడు. 1956 లో తణుకులో గజారోహణతో అతను రాసిన 'రామాయణ సుధాలహరి ' గ్రంథాన్ని ఊరేగించి 'ఆర్ష విద్యాలంకారా' అనే బిరుదును ప్రధానం చేసారు.

  1. రైతు - రాజ్యాంగము -1933
  2. నానా దేశ రాజ్యాంగములు -1933
  3. భారతీయ ప్రతిభ -1950
  4. రామాయణ సుధాలహరి -1953
  5. మతము- భౌతిక శాస్త్రము 1962
  6. పురుషార్దములు -1964
  7. ఆండాళ్ వైభవము -1964
  8. యుగసమీక్ష - 1970
  9. వేదసుధాకరం -1971
  10. ఉజ్వల తరంగిణి -1973
  11. భాగవతసుధ- 1975
  12. రామకథానిధి -1976
  13. ఆర్షసంస్కృతి -1977
  14. సీతామహాసాధ్వి -1981
  15. వివేకానందస్వామి -1981

చరమాంకం మార్చు

చంద్రమౌళి 1976 లో తన భార్య బుల్లెమాంబ మరణం తరువాత గుంటూరు నుండి తన స్వగ్రామం మోపర్రు వచ్చి తన శేష జీవితం ప్రశాంతంగా గడిపాడు. వారి కుమార్తె బాల్యంలోనే మరణించింది. కుమారుడు గోపాలస్వామి 1987లో మరణించాడు. వారికి సంతానంలేదు. సర్వం దేశ శ్రేయస్సు కొరకు త్యాగం చేసి, చివరికి సొంత ఇల్లు కుడా లేక అన్న ఇంటిలో చివరి రోజులు గడిపాడు . 1991 లో కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య ఉద్యమంలో నాయకత్వం వహించిన వారికి ఇచ్చే ' స్వాతంత్ర్య సైనిక్ సన్మాన్ ' అవార్దు ఇచ్చి గౌరవించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవార్డుతో పాటు ప్రభుత్వం ఇస్తున్న ఫించన్ తీసుకోలేదు. నిడారంబత, నిష్కలంక నిస్వార్ద నిర్మల జీవనం గడిపిన కల్లూరి చంద్రమౌళి 94 ఏళ్ళ వయస్సులో మోపర్రులో 1992 జనవరి 2న ఒక కర్మయోగిగా పరమపదించారు.[5]

పురస్కారాలు మార్చు

  • 1956 లో తణుకులో 'ఆర్ష విద్యాలంకారా' అనే బిరుదును ప్రధానం చేసారు.
  • గుంటూరులో అతని సహాయ సహకారలతో నిర్మించబడి, నివాసం ఉన్న కాలనీకి చంద్రమౌళి నగర్ గా నామకరణం చేసారు.
  • 1991 లో కేంద్ర ప్రభుత్వం నుండి ' స్వాతంత్ర్య సైనిక్ సన్మాన్ ' అవార్దు
  • గుంటూరు, మోపర్రులలో చంద్రమౌళి కాంస్య విగ్రహాలు నెలకొల్పారు.

ఇవి కూడా చూడండి మార్చు

  1. రణరంగ చౌక్ - తెనాలి
  2. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచలం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 బొర్రా, గోవర్దన్ (2010). శ్రీ కల్లూరి చంద్రమౌళి జీవిత చరిత్ర-. tenali: kodaali sudarsan. pp. 1–226.
  2. ఆంధ్రసర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.598
  3. The Hindu, Vijayawada (2014-08-14). "Ranarang Chowk- A symbol of freedom struggle".
  4. కొడాలి, శ్రీనివాస్ (2011). మాన్యశ్రీ కల్లూరి చంద్రమౌళి కీర్తి చంద్రిక - సంకలనం. గుంటూరు. pp. 21–25.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-06-15. Retrieved 2009-04-08.

బయటి లింకులు మార్చు