అంటరానివారు ఎవరు?

అంటరానివారు ఎవరు అనే ఖండకావ్యము శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి చే వ్రాయబడింది.పూజ్యబాపూజే ఆశయాల అనుసరించి వ్రాసిన అస్పృశ్యతా సాంఘిక దురాచారా నిర్మూలనా ప్రబోధ కావ్యము

అంటరానివారు ఎవరు?
కృతికర్త: వడ్డూరి అచ్యుతరామ కవి
అంకితం: ఇందిరా గాంధీ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): ఖండకావ్యము
ప్రచురణ: 1954
విడుదల: 1954

పుస్తకంపై అభిప్రాయాలు మార్చు

కృతికర్త విజ్ఞప్తి ! మార్చు

మహాశయులారా !
భగవంతుని ప్రేరణచే అంటరానివారు ఎవరు ? అను ఈ చిన్న ఖండకావ్యమును వ్రాసితిని. వ్రాసి చాలా కాలమైనను పుస్తక రూపంలో వెలుగులోకి రాలేదు. ఇప్పుడు కొయ్యలగూడెం పంచాయితీ ప్రెసిడెంట్ గారు శ్రీ శ్రీ A .S జాన్ గారు దీని ముద్రణా వ్యయం భరించి ముద్రణ చేయించి వెలుగులోకి తెచ్చి లోకానికి అందించి చరితార్దు లైనారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఆంధ్రరత్న కీర్తి శేషులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారును, అప్పటి పెద్దలును అంటరాని వారంటే మా వెంటరాని వారె అని పాడేవారు. పుట్టుక చేత నెవరైననూ అంటరాని వారనుటకు ఆధారములు కానరావు గదా! కనుకనే యుగపురుషుడన బడిన గాంధీ మహాత్ముడు ఈ విషయములో చొరవ తీసికొని కలకత్తాలో పండిత మహాసభను జరిపి శాస్త్రరీత్యా అస్పుశ్ర్యులని ఏజాతి వారినైనా అనుటకు తగిన శాస్త్రీయమైన ఆధారములు చూపించమనిరి. కానీ ఎవరూ గాంధీజీని ఒప్పించలేక పోయారు. ఆ విషయాలను నేను జ్ఞాపకమున్నంత వరకు తెలిసినంత వరకు ఈ ఖండకావ్యము ద్వారా పండిత ప్రపంచమునకు అందించు చున్నాను. విజ్ఞులెల్లరు ఇచ్చే సలహాలను సూచనలను సంతోషముతో స్వీకరింప సిద్ధముగా నున్నాను.

—వడ్డూరి అత్యుతరామకవి,.కన్నాపురం (మార్చి 25 1983)

కనుపర్తి లక్ష్మీ వీర్రాజు గారి అభిప్రాయం మార్చు

అంటరానివారు ఎవరు అను కావ్యమును వ్రాసిన వారు ఒక ప్రజా సేవలో కాకలు తీరిన ప్రముఖ సమరయోధుడు. గిరిజన, హరిజనాది పేదవర్గాల అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ కవి కవిత్వ రంగంలో కృషి చేసిన వారికి రాజకీయానుభవాలు ఉండడం అరుదు. నా చిన్నతనం నుండి ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన గాంధేయవాది బందకట్టు వంటి నీటి వనరులు సాధించి ప్రాంతీయాభి వృద్ధికి కృషి చేయడమే గాక అనేక రైతు ఉద్యమాలలో రైతులకు ప్రతినిధిగా పనిచేసిన కార్యకర్త, మంచి వక్త యిటువంటి విప్లవాత్మక కావ్య రచన చేయడం అలాగే ఒక కళాభిమాని, కళాపోషకుడు, నిగర్వి, ప్రజాసేవకుడు, ఉదార ధైర్య సాహసాలుగల వ్యక్తీ ఈ విప్లవాత్మక మైన గ్రంథమును ముద్రించి లోకానికి అందించడం మరొక విశేషం ఇది ఉభయ తారకంగా చెప్పదగిన విశేషము .శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు కవిగా, రాజకీయవాదిగా, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలలో ప్రముఖ ఉపన్యాసకులుగా ఆంధ్ర ప్రాంతానికి సుపరిచితులు, గిరిజనా భివృద్ధికి కృషి చేసినవారు . చేస్తున్నవారు, వీరు సుమారు 25 గ్రంథములు, స్థలపురాణములు, శతకములు, భక్తీ రస పూరితములు, మరికొన్ని గణనీయమైన రాజకీయ గ్రంథములు వీరి రచనలన్నీ మణిపూసలే, అసలు అంటరాని వారే లేరు, ఇటువంటి వారు అంటరానివారు అని సహేతుకంగా వారు పద్యాలలో వ్రాసి పూర్వపు ఉదాహరణలతో నిరూపించి ఋజువు చేసారు . వారు వ్రాసినదంతా నిజము అందుకే నేనంటాను. అంటరాని వారంటే, మంచికి వెంటరానివారే. కవి తన హృదయంలో భావాలను అక్షర రూపంలో పొందుపరచి వినిపిస్తే వినడమే కాదు ఆదరించే రస హృదయులు కావాలి. అలాంటి రస హృదయం గల వాడు కనుకనే శ్రీ A.S. జాన్ గారు గ్రంథమును ముద్రించి లోకానికి అందించారు .ఈ గ్రంథం రచించి 30 సంవత్సరాలు దాటినట్లు రచయిత ఉవాచ. ఓ ముఖ్య విషయమేమంటే పేజీలు  తిరగ వేయడం గాకుండా ఆసాంతం చదివితే రచయిత తపన తెలుస్తుంది.

శ్లో . అజ్ఞేభ్యో గ్రంథినః శ్రేష్టః గ్రంథిభ్యో దారినో వరాః
ధారి భోజ్ఞానినః శ్రేష్టా జ్ఞానిధ్యో వ్యవసాయినః

అని ఆర్యులన్నది నిజం కదా !కుల, మాట రాజకీయ కల్లోలాలతో కలిమి లేముల సంఘర్షణతో నిరంతరం, పరస్పరం, కొట్టు మిట్టాడుచున్న నేటి ప్రజానీకానికి ప్రభోదాత్మకమైన ఈ ఖండకావ్యము వెలుగుబాట చూపగలదని ఆశిస్తున్నాను.

ఆవుల సాంబశివరావు గారి అభిప్రాయం మార్చు

మహారాజశ్రీ అచ్యుటరామ కవి గార్కి నమస్కారములు మే 22 తేదీ గల మీ ఉత్తరం, అంటరానివారు ఎవరు ? అనే మీ కావ్యం అందాయి మీ కావ్యంలో మీరు చెప్పిన భావాలు విలువైనవి. అంటరానివారు కొన్ని కులాలలో పుట్టినవారు కారు. నిజమైన అంటరానివారు మోసగాళ్ళు, కుటిలకోరులు, అవినీతిపరులు, సమాజద్రోహులు, మీ భావాలకు తగు ప్రచారం రాగలదని ఆశిస్తున్నాను . ఇట్లు (Sd) ఆవుల సాంబశివరావు 29 .05 .84

పరకాల శేషావతారం గారి అభిప్రాయం మార్చు

శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు వ్రాసిన అంటరానివారు ఎవరు అను వ్రాత ప్రతి చదివాను.సంఘ సంస్కరణకు ఉపయోగపడే రచన భావాలు చక్కగా ఉన్నాయి. ఉదాహరణలు మూలసూత్రములు సమర్ధ నీయముగా ఉన్నాయి వీరి కావ్యములు అందలి రచనలు మహాపండితులే అభినందించారు వీరు మా కంటే ముందుగానే స్వాతంత్ర్య సమారా యుద్ధములో పాలు పంచుకొని పెద్దల మన్ననలు పొందారు. ఈయన మంచి కవి వక్త వీరి స్వరాజ్య రథము 1937లో పిఠాపురం రాజావారికి పోటీగా పళ్ళం రాజు గారు కాంగ్రెస్ తరపున పోటీ చేసినపుడు మంచి ఆదరణ పొందారు అల్లూరి సత్యనారాయణరాజు, మాగంటి బాపినీడు, కళా వెంకటరావు గార్లు బులుసు సాంబమూర్తి గారు వీరిని బాగా ఆదరించే వారు మద్రాసులో ఆంధ్రరాష్ట్రం గురించి వ్రాసిన బుర్రకథ లోని కొన్ని ఘట్టాలు మేలుకొలుపు ఇంకా పద్యాలు ఉద్రేకాన్ని కలిగించేలా ఉండేవి.చెన్నపురి ఆంధ్ర మహాసభలలో ఎన్నోసార్లు ఆంధ్రరాష్ట్రం గురించి పద్యాలు, మేలుకొలుపు వంటి ఘట్టాలు జన్నాన్ని ఆకర్షించాయి.వీరి భక్తీ రసాన్ని బాగా విన్పించగలిగిన కవి.దేశ భక్తీ గీతాలు, పద్యాలు, ఉపన్యాసాలు కూడా జనరంజకంగా ఉండేవి. అంటరానివారుఎవరో వీరు నిర్ణయించిన వారికి అందరూ కాకపోయినా నిజంగా అందరూ ఒప్పుకుంటారా, సంఘ విద్రోహులే అంటరాని వారు అనే నిజం ఈ గ్రంథం బహుళ ప్రచారంలోకి తేవడానికి అంతా ప్రత్నించెదము గాక!

A.S.జాన్ గారు అభిప్రాయం మార్చు

అంటరానివారు ఎవరు? అను గ్రంథమును ముద్రించుటకు ఆర్థికసహాయమోనర్చి చరిత్ర సృష్టించు కొన్న ఉదార స్వభావుడు శ్రీ A.S.జాన్ గారు ఈ కావ్యము వ్రాసి 30 ఏండ్లు దాటినా ఎందరో ప్రముఖులు దీనిని అచ్చు వేయించాలని అనుకొన్నప్పటికీ వారికి ఈ అవకాశం లభించలేదు.డబ్బు అనేకమంది అనేక విధముల ఖర్చు చేయుచుందురు.పరోపకారమునకు పుణ్య ఫలప్రాప్తికి కీర్తి లోకమున చిరస్తాయిగా ఉండుటకు వినియోగింపబడిన ద్రవ్యము సత్పాత్రదానమగును కృతి చిరస్తాయిగా నుండునది. చరిత్ర కెక్కిన ఉత్తములే ఈ నాటికి లోకమున కీర్తింపబడుచున్నారు.అందును ఈ అంటరానివారు ఎవరు?అను గ్రంథము చారిత్రక, రాజకీయ, సాంఘిక ప్రాధాన్యతగల విశిష్ట కావ్యమని పెద్దల మన్ననలందినది.అట్టి ఉత్తమ కావ్యమును ముద్రించుటకు ముందుకు వచ్చి చిరకాలమునుండి మరుగున ఉన్న దీనిని లోకానికి అందించి శ్రీ A.S.జాన్ గారు చిరకీర్తినార్జించుకొన్నారు.!కింజన్మ కీర్తింవినా!లోకమున పేరు నిల్పుకోలేని జన్మ ఎందుకు అంటారు.భర్తృహరి. మహాకవి కృతి వ్రాసిన కవి చిరంజీవియే వారిని పోషించిన కృతులు ముద్రించిన త్యాగధనులు కూడా చిరంజీవులే.ఉపాధ్యాయ వృత్తినుండి సమితి అధ్యక్షులుగా ప్రజలచే ఎన్నుకోబడికాంగ్రెస్ నాయకుల మన్ననలందుటేగాక భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి కృతి సమర్పింపబడిన ఈ గ్రంథ ముద్రణకు తోడ్పడి దేశానికి ఉత్తమ కావ్యమును అందించి కృతార్ధులైనారు.శ్రీ A.S.జాన్ గారు...రచయిత

నంబూరి దుర్వాస మహర్షి అభిప్రాయం మార్చు

02.10.1974 ఈ పవిత్ర గాంధీజయంతి రోజున పూజ్యులు మిత్రులు శ్రీ వడ్డూరి అచ్యుతరామకవి గారు వ్రాసిన అంటరానివారు ఎవరు? అను పుస్తకము వ్రాతప్రతి చదివాను చాలా ఆనందించాను.1942 నుండి రాజకీయ రంగములోను, కవితా రంగములోను నాకు బాగా సన్నిహితులు.జాతీయకవి.ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.రజితభారతి అను చిన్నకృతి శ్రీమతి ఇందిరాగాంధీకి కృతి ఇచ్చుట, మహా ఘనత వహించిన రాష్ట్రపతి శ్రీ V.V.గిరి గారు హైదరాబాదు రాజభవనంలో స్వయంగా కృతి స్వీకరించి సత్కరించుట.మా స్వాతంత్ర్య సమరయోదులందరికి గౌరవమే గాక గర్వకారణము.

      గుండుదెబ్బల కేడురేగి గుండెలిచ్చి
      రక్షక భాటాలి లాఠీల రాటుదేలి
      భారతమాత విముక్తికి పాటుబడిన
      తొల్లిటి స్వతంత్ర్య వీరయోధులము మేము

అని వ్రాసిన సీసపద్యము లోని ఈ గీతము మరువరానిది నిత్యసత్యమైనది. 1942 వ సంవత్సరము ఆగస్టు క్విట్ఇండియా తీర్మానం అనుసరించి బాపట్ల తాలూకా చీరాల వాస్తవ్యులు శ్రీ నాళం రామచంద్రరావు B.A.L.L.Bగారు చేసిన విప్లవ చర్యకు అతనును పట్టి ఒప్పగించిన వారికి 1000 రూపాయలు బహుమతి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 1942 లో ప్రకటించగా 36 రోజులు తన నివాసంలో రక్షణ ఇచ్చిన విప్లవవీరుడు అచ్యుతరామకవి. ఆ తరువాత 1944 లో అతనును పట్టుకున్నారు సరే.కాని రామచంద్రరావు గారికి Hourber ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.మిత్రుడు అచ్యుతరామారావు గారు ధైర్యంగా యిచ్చి ధైర్యాన్ని ప్రదర్శించారు. యీ కావ్యము పుట్టుకచేత అంటరానివారు ఎవరూ లేరని నడవడికవల్ల అంటరానివారు అవుతారని అవినీతిపరులే అంతరానివారని శాస్త్రములోని ఉదాహరణలతో తేలికభాషలో ఋజువు చేసిన మహామనీషి.రాజకీయ కవితా రంగాలలో రెండింటా కాకలుదీరిన స్వార్దమెరుగని వీరయోధుడు. పోలవరం తాలూకాలో బందకట్టు అను రిజర్వాయరు తగాయిదాగురించి కోయ రైతుల తరపున లక్కవరం జమీందారులు దిప్పకాయలపాడు భూస్వాములతో పోరాడి సత్యాగ్రహాలు చేసి, నిరాహారదీక్షలు సాగించి విజం సాధించి గిరిజనుల గిరిజనేతరుల వేలాది ఎకరాల భూమికి నీటి హక్కు కలిగించిన అన్నదాత శ్రీ వడ్డూరి అచ్యుతం గారు. నిరాహారదీక్ష నోటీసుతో పూజ్య బాపూజీ అప్పటి చీఫ్ మినిస్టర్ ప్రకాశం పంతులు గారికి లేఖ వ్రాశారు. కొవ్వూరు R.D.O.శ్రీ గంగాళం భీమశంకరం గారు ప్రభుత్వం తరపున కొప్పుల సత్యనారాయణ వారి సమస్యలంగీకరించుట గౌ!శ్రీ కళా వెంకటరావు గారు అప్పటి రెవిన్యూమంత్రి G O M S 1902\8\8\1947 ఉత్తర్వుల ద్వారా గిరిజనులకు బందకట్టు నీటిహక్కు కల్పించుట నాకు మరపురాని వీరగాధ. ఒక మహాకవి స్వార్ధరహితుడైన సేవానిరతుడైన స్వాతంత్ర్యమరయోధుడుగా నాకు ప్రాణ స్నేహితునిగా కలిగియున్నందుకు నేనెంతో సంతసించుచున్నాను. వీరిచే రచింపబడిన శ్రీ వేంకటేశ్వర భక్తిమాల నెన్నడు మరువలేను శ్రీ అల్లూరి బాపినీడు గారు ఆ శతకం గురించి నేను చెప్పి చదవగా తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని ఎదుట చదవాలయ్యా నాతొ రండి అని తిరుపతి వేంకటేశ్వరుని ముందర చదివించి ఆనందింప జేశారు. ఇవన్నీ మరువలేను. భక్తకవి స్వార్ధరహిత సేవాపరాయణుడు మిత్రుడు శ్రీ అచ్యుతరామకవి చిరకాలము వర్ధిల్లి జాతిసేవ, భక్తిప్రచారం చేయాలని పరమ్మత్ముని ప్రార్థిచు చున్నాను. నంబూరి దుర్వాస మహర్షి. ఎవరు అంటరానివారు? ఈ ప్రశ్న కొంచెము ఆలోచించే శక్తి ఉన్న ప్రతివారిలోను ఉద్భవిస్తుంది. నిజమే? భగవంతుని సృష్టిలో సర్వ మానవకోటి సమానమే! అయినప్పుడు జాతులేందుకు వచ్చాయి?సృష్ట్యాదిలో ఈ జాతులు ఉన్నవా? పరిశోధనలపై లేవు అన్న జవాబు వస్తుంది. అందుకే జన్మనా జాయతే సూద్రః అన్నారు. పుట్టుకచే అందరూ సమానమే!

గీతను బోధసేయునెడ కృష్ణుడు క్రీడికి చెప్పలేదె? నా చేతనే నాల్గు జాతులు విభాజిమ్పబదేన్ గుణకర్మ విభేదముచేత, అట్టు యెడ భాతిగా తెల్పరయ్య పంచమ జీటి యదెట్లు వచ్చెనో?భగవత్ సృష్టిలో మానవులంతా ఒకటే అయినా వారి వారి వృత్తులవల్ల నాల్గు జాతులుగా విభజింప బడినట్లు గీతలో గీతాచార్యులు వారే చెప్పారు. బాగానే ఉంది మరి మాదిగ, మాల అయి జాతులు ఎట్లా ఉద్భవించాయి.ఇదొక ప్రశ్న దీనికి నేను ఎక్కడో విన్న ఒక కథ గుర్తుకు వస్తుంది.ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రవేశించు కాలంలో ఎక్కువగా చిన్న చిన్న రాజ్యాలుగాను, ఆ రాజ్యాల లోనే ఎక్కువభాగం పల్లెలు గాను ఉండేవి.జనపదానికంటే అడవులే ఎక్కువగా ఉంటూ ఎక్కువ వ్యవసాయం, వేట మొదలగు వృత్తులతోనే కాలం గడుపుతూ ఉండేవారు ఆరోజులలో ఒక కొండ అనగా చిన్న గుట్ట మీద ఒక పల్లె ఉండేది. ఆ పల్లెలో ప్రజలంతా కలసి మెలసి కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో నాలుగైదు కుటుంబాల వారు అప్పటి కులాచారం ప్రకారం నడవకుండా ఏదో తప్పు చేసారు. మిగతా వాళ్ళంతా వాళ్ళను వెలివేసి కొండకిందకు పోయి ఇళ్లు కట్టుకోమని శాసించారు. వాళ్ళు కూడా అట్లాగే కొండదిగి ఇళ్లు కట్టుకున్నారు. అట్లా కొంతకాలం జరిగిన తరువాత ఇంకో పల్లెనుంచి యీ కొండమీద నున్న పల్లెను చూచుటకు కొంతమంది వచ్చారు.మాటల సందర్భములో క్రింది ఇళ్లు కట్టుకున్న వారు ఎవరు? అని అడిగారు అందుకు ఈ కొండమీద ఉన్నవాళ్ళు అక్కసుగా వాళ్ళంతా మాదిగువ వాళ్ళు అని చెప్పారు అనగా వాళ్ళకంటే వీళ్ళు దిగువనున్నట్లు చెప్పారు. కాలక్రమీణా అదే మాట !మాదిగువవాళ్ళు!!మాదిగవాళ్ళు!అయ్యారు. తరువాత అందులో కొంతమంది మళ్ళీ విడిపోయారు.వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళూ !మాలోవాళ్ళే! అన్నారు అదే మాట మాలోవాళ్లే మాలవాళ్ళు అన్నా మానవుని అంటరాదనటం హాస్యాస్పదం గాదా హాస్యాస్పదమే? అసలు అంటరానివారు ఎవరు? కృతఘ్నులు, మిత్రద్రోహులు, పరదారా ధనాపహారులు మాత్రమే అంటరానివారు.అందుకే !

శ్లో! మిత్రద్రోహీ కృతఘ్నశ్చ నృశం సశ్చనరాధమః

క్రవ్యాదై.క్రిమిభిశ్చా స్తర్ణభుజ్యంతే హతా వ్రుకాః!

కం! విను మిత్రద్రోహు గృత

ఘ్నని ఘాతకు మేని మాంస కోశంబులహా 
దినవట క్రవ్యాదములై 
చను కీటక కాక శునక జంబుకము లిలన్!

అనే నానుడి ప్రకారం అట్టివారు మాత్రమే అంటరానివారు మరి మాల, మాదిగలను ఎందుకు అస్పృశ్యులుగా చూస్తున్నారు? వారిలో ఉండే అపరి శుభ్రత వాళ్ళు ఆచార వ్యవహారములవల్లే!వాళ్ళను అంటరానివారుగా చూస్తున్నారు. వాళ్ళు కూడా పరిశుభ్ర ముగా ఉన్నవాళ్ళను ఎవరు అంటరాని వారిగా చూడబడుతలేదే! సంఘముకంటే ప్రభుత్వమే వాళ్ళను అంటరానివాళ్ళుగా చేస్తూఉంది.కారణమేమంటే వాళ్లకు ప్రత్యేకముగా వాడలు నిర్మించడం హరిజనవాడ ఊరికి దూరముగానే నిర్మించడం అట్లా కాకుండా గృహములు నిర్మించునపుడు హరిజనులకు హరిజనేతరులకు కలిపి గృహములు ఎందుకు నిర్మించకూడదు ప్రభుత్వం ఆపనిమాత్రం చేయదు. హరిజనులకు ప్రత్యేకంగా ఇళ్లు కట్టి హరిజనవాడ ప్రత్యేకంగానే ఉంచినపుడు ఈ వేరు భావము ప్రజలలో పోయే అవకాశం ఉండదు. అంతా ఒకే వాడలో కలిసి ఉండాలి.ప్రభుత్వము ఇకనైనా కాలనీలలో అందరికీ ఇళ్ళునిర్మించాలి. ఈ పుస్తకం ముద్రణ చేయించిన శ్రీ A.S.జాన్ గారు స్తవనీయులు, ఇటువంటి గ్రంథప్రచారముల వలననే సంఘులో పేరుకుపోయిన ఈ అమానుశాచారములు నశించుతాయి.శ్రీ జాన్ గారి మానవతా భావం జాతి సమైక్యతా దృష్టితో సాంఘిక దురాచార నిర్మూలనకై అచ్యుత రామకవి గారు వ్రాసిన ఈ కావ్యాన్ని ముద్రించి వెలుగులోకి తెచ్చుట సంతోషం ఈ గ్రంథ రచయిత శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారిని గురించి వ్రాయాలంటే అవి ఇంతకన్నా ఎక్కువే అవుతుంది ఒక సారి చదివితే రెండవసారి చూడక్కరలేని పుస్తకాలు వెలువడే ఈ రోజులలో ఈ కవి గారు ఎప్పుడూ చదవదగిన గ్రంథాలు 25 పైగా వ్రాసి పండితుల విమర్శకుల విజ్ఞానవేత్తల మన్ననలందారు.వీరు కవిగారే కాక వృద్ధ జాతీయ నాయకుల కోవకు చెందినా ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధులు, మా పోలవరం తాలూకాలో వీరు ఎన్నో ప్రజోపకార్యక్రమాలు ప్రభుత్వ దృష్టికి తెచ్చి రైతులకు ముఖ్యంగా గిరిజనులకు ఎంతో మేలు చేశారు.బందకట్టు అనే నీటి పారుదల తగాయిదా జమీందారీ రైతులకు గిరిజనులకు మద్య వున్నా చిరకాలపు తగవు సాధించి గిరిజనులకు పేద రైతులకు వేల ఎకరాల సాగుకు నీరు ఇప్పించిన కార్యకర్త వారు ఇంకా ఇలాంటి ఎన్నో పనులు రైతుల తరపున చేసి రైతులకు ఉపకారం చేశారు. ఈ సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి వీరు వ్రాసిన ఈ కావ్యం మంచి ప్రచారంలోకి వచ్చి ప్రజాదరణ పొందగలదనే పెద్దల అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.

శ్రేయోభిలాషి - మద్దు చలపతిరావు నిమ్మలగూడెం 05.04.84

కాలాత్మక పరమేశ్వర స్తుతి శా!శ్రీమద్భక్త మనోజ్ఞబంధుమమలం సింధూర వర్ణాంచితం

సోమర్కాగ్ని మయైక కాంతి వపుషం!శుభ్రద్యుతిం సుందరం 
కామారాతి విరించి మాధవల సత్కాంత్యుజ్వలో ద్భాసితం 
కామక్రోధ మదాది దుర్గుణహరం!కాలస్వరూపం భజే !

ఓ ప్రత్యక్ష దైవమా!కర్మసాక్షి!జగచ్చక్షూ!

అమరుల్ మౌనులు మూడుకాలముల సంధ్యావందనల్ సేయుచున్ 
శ్రమమున్ బాపగనేక చక్రరధ సంచారుండవై నిత్యమున్ 
నిమిషార్ధంబున రెండువేల మరియున్నిన్నూరులౌ యోజనాల్ 
గమనంబొప్పగ గర్మ సాక్షీ వనలోక జ్యోతివై వేల్గునీ 
కమరేంద్రార్చిత భక్తీ మ్రొక్కెదను దేవా!సూర్యనారాయణా!

చ! పురుషుడు గాక స్రీయును నపుంసక మూర్తియుగాక మూడునై

సురనర తిర్యగాడులని చొప్పడ జెప్పగరాక నన్నియై 
సురుచిర కాంతి నన్నిటాను జ్యోతియనన్ వెలిగించి వెల్గుచున్ 
ధర సకలంబునైన పరతత్వము బ్రహ్మము నాశ్రయించెదన్!

చ. కనులకు కానవచ్చుచు జగంబుల సృష్టి వినాశ సంస్టితుల్

బనికొని సేయుచున్ శశి దివాకరుడై దినరాత్రి భేదముల్ 
జనులకు గల్గజేయుచు నిజాశ్రితులన్ గృపజూచి బ్రోచునా 
ఘనుని బరాత్పరున్ గొలుతు గాలనియామకు లోకదీపకున్!

మ.దినరాత్రంబుల సూర్యచంద్రులనగా దేదీప్యమానుండవై

ఘనసృస్టి స్థితినాశంబులు కృతఘ్నఘ్నా!ధరన్ జేయుచున్
కలువిందై కనుపట్టు దేవుడవు లోకైకద్యుతీ! నిన్నునే
వినుతింతున్ బరమాత్మవంచు సకలోర్వీధూర్వహా!భాస్కరా!

ఉ. తల్లిని దండ్రినిన్ కడుముదంబున బ్రార్ధనజేసి సద్గురున్

ఉల్లమునందునిల్పి సుమనోజ్వల దివ్యపద్దర్ధ దాత్రి సం
ఫుల్ల సరోనజనేత్ర కవిభూషిత గాత్రినివేడి లక్ష్మి భా
సిల్లెడు శ్రీ గణేశ్వరుని చిత్తమునన్ తలపోసి భక్తితోన్!!

చ. అజగజవక్త్ర వాణి గురులార్యమునీంద్ర కవీంద్ర పండిత

వ్రజముల తల్లిదండ్రులను వ్యాసుని వాల్మీకి కాళిదాసులన్
సుజనుల పోతనామరుల సూరిమయూరిని నన్నయాదులన్
ద్విజులను తెల్గుతల్లిని నుతించుచు జేసెద దివ్యబోధమున్!

గీ.పూర్వకవితల్లజులనెల్ల బూజసేసి

వర్తమాన కవీంద్రుల వరుస ంరొక్కి
ముందు రాబోవు కవులకు ముదుపుగట్టి

యాంద్రవీరుల కిడెద బోధామృతంబు. భరతమాత స్తుతి సీ.భూరి సస్యఫల ప్రపూర్ణ సంపూర్ణ సౌ

భాగ్య భాగ్యోపేత భరతమాత!
భరతాది సుగుణ సంభరితపాలిత నిత్య
ఫలిత పుణ్యవ్రాత భరతమాత!
హతపాతకవ్రాత నుతలోక సంఘాత
బహువిధాఖ్యాత మా భరతమాత!
పూర్వసంచిత భాగ్య భోగ్యసంధాత దు
ర్భర దుఃఖనాశ శ్రీ భరతమాత!

తే.గీ.మహిత విష్ణుపదీపూత భరతమాత

వర మహావీరమాత మా భరతమాత!
భవ్యరత్నప్రసూతి మా భరతమాత!
మాతలకు మాత భారతమాత దలతు!!

తెలుగుతల్లికి వందనము సీ.కలుములోసంగెడి కనకదుర్గాదేవి

ఇలవేల్పుగా గల్గు తెలుగుతల్లి!
పతితపావన తుంగభద్ర గోదావరీ
యమృతవాహినులోప్పు నమరసీమ!
అమరావతి యజంతా కళాక్షేత్రంబు
లలరారు నందనోద్యానవనము!
సంగీత సాహిత్య సరస కవిత్వ స
ద్గోస్టినుండెడి పరమేస్టి నెలవు!

గీ.అతి సుస్వరంబున శ్రుతిగానమొనరించు

వేదగాయకులోప్పు వేదభూమి
పాదిపంటలు పుష్పఫల భాగ్యములోసంగి
కామితార్ధములిచ్చు కల్పతరువు !!

గీ.ఆడితప్పని నిత్య సత్య వ్రతులకు

అతిథి సేవాభిరతులైన యాస్తికులకు
పేదసాదలసేవించు పెద్దలుకును
నిలయమౌచును విలసిల్లు తెలుగుతల్లి
కెల్లవేళల ంరొక్కెద నుల్లమందు!!

మాతృభాషాభివందనము గీ.సూరిజనలోక సంతోష శుభ్రవేష

మహిత శబ్దార్ధవేత్తల మంజుఘోష
యురుభాంధుల పాలిట యుదయపూష
అర్ధబంధుర భాష మా యాంధ్రభాష !

గీ.అఖిలభాషల దివ్యమౌ నమలభాష

అభినవామరభాష సంయమ విశేష
భాషలకు నెల్ల సద్భూష పాపశోష
అర్ధబంధుర భాష మా యాంధ్రభాష!

గీ.మాన్య కర్మిష్తులకునెల్ల మాతృభాష

ధర్మవీరులు పల్కెడు తల్లిభాష
దేశభాషల లెస్సయౌ దివ్యభాష
అట్టి మా యాంధ్రభాషనే నభినుతింతు!!

సీ.కలదానిలోన బీదలకీయ దలపోయు

ధర్మసంయుక్త వద్దన్యులార!
ఒరుల కష్టములకై యోర్వ లేమినిజూపు 
కరుణాభిరమ్య సంకల్పులార!
జ్ఞానప్రదీప్తి నజ్ఞానాంధమును బాపి
దీనాంధులను బ్రోచు దివ్యులార!
జన్మభూమి రక్షకై జన్మమర్పింపంగ
వెరపెరుంగని మహావీరులార!

తే.గీ.మానధనులార భాషాభిమానులార

తప్పులెరుంగని యొప్పులకుప్పలార
నాగరిక మోహమగ్న వినాక పరిస
రాంధ జనదీపతుల్యులౌ ఆర్యులార !
ఆదరమొప్ప నొక్కపరమార్ధము దెల్పెదమీకు సోదరీ

సోదరులార ! రండు పరిశుద్ధ మనస్కులరై వినుండు మీ ఖేదము బాపు దాని నతిభీకర భూరి భవోగ్ర శ్రుంఖల చ్చేధము సేయు దాని బుధసేవ్యమునై తనరారు దానినేన్!

వ.మహశయులారా!

ఉ.పాలను నీరముంట పరిపాతియె గావున మీరలెల్లరున్ 
పాలును నీరమున్ గలియ పాలను గ్రోలెడి రాజహంసలన్
బోలి రసంబు గ్రోలుచును పోలని నీరసమున్ ద్యజించుచున్
గ్రోలగడంగుడీ ! మధువు కోవిదులార ! రసాభిమానులై !

సీ.శ్రీ వివేకానంద శ్రీ రామకృష్ణుల

యధ్యాత్మ తత్వ బోధామృతంబు
అరవింద రమణ మహార్ష్యాది మహితాత్ము
లవని వర్షించు జ్ఞానామృతంబు 
గాంధీ తిలక్ దేశబంధులోసంగిన 
యకలంక దేశసేవామృతంబు 
శ్రీ హరనాధుడు శ్రీ సాయిబాబాల
ధ్యానగాన ప్రబోధామృతంబు !

గీ.ఇంకిపోసాగె జగతిలో నీర్ష్యప్రబలి

ప్రేమనసియించి స్వార్ధంబు పెచ్చుపెరిగి
శాస్త్రవివిజ్ఞానమున నణుశక్తి ప్రబలి
ప్రకృతి మానవఘర్షణ ప్రబలిపోయె !!

మహాశయులారా ! పరమేశ్వరునిచే సృజింపబడిన మానవులెల్లరొక్కతటే యని, దేవుడొక్కడేయనియు ఎవరు ఏ పేరున ఏ భాషలో పిలచినా ఒకనికే చెందునని ఎందరో మహానుభావులు బోధించినను మనలో మతభేదములు, జాతిభేదములు, కులభేదములు, అంటరాని భావములు పెరుగుచున్నవే గాని తగ్గుటలేదు.

శ్లో!!అత్యంత మలినోదేహః దేహీచా త్యంత నిర్మలః
ఉభయోదంతరం జ్ఞాత్వాసశ్యశౌచం విధీయతే!!
ఈ శరీరము మలిన భూయిష్టమైనదే గదా! ఈ శరీరమును నడిపించు దేహి అనగా జీవాత్మ ఎల్లప్పుడు పవిత్రమైనదేగదా!

దేహి దేహాల వివరము నిజస్టితి గ్రహించిన దేనికి శుచిత్వము? దేనికి అశుచిత్వము నిర్ణయింపవలయును ? దేశమున "అంటరానివారు" అనువారెవరని నిర్ణయించి పుట్టుకచే, జాతిచే, కులముచే అంటరానివారెవరునూ లేరని గుణము, నడతచేతనే అంటరానివారుగా భావించవలెనని వెల్లడించుటకే యీ గ్రంథమఉద్దేశింపబడినదిగా పరమాత్మ విశదీకరించుగాక! జాతులనెల్ల నొక్కటని చాటుటకేగద వెంకటేశ యీ నాతిని బీబిదేవిని జనంబులు మెచ్చ గ్రహించినాడ వీ నీతి గ్రహింపలేక యవనిన్ తగవాడుచునున్నవారలీ భూతల ముద్దరింపవె ప్రభూ!వసుధైక కుటుంబ భర్తవై !

శ్రీ మద్వేంకటశైల స్వామికి గణనాధునకు, శారదకు.గురు స్వామికి, తలిదండ్రులకును గామితము లోసంగ మొక్కి గావింతు కృతిన్

శ్రీకరంబు వేదసిద్దాంతయుతమైన భరతఖండమందు ప్రజలలోన అంటరానివారలనువారు గలరంట యెవరో?వారి నిర్ణయింపవలయు. శ్రీ మంతము సకల సౌభాగ్య సంపన్నము వేదభూమి యనబడు నీ భారతదేశములో “అంటరానివారు “ అస్ప్రుశ్యులు మానవజాతికి చెందినా వారిలోనే కొందరున్నారట . ఆ అంటరానివారెవరు ? అట్టి వారిని నిర్ణయింప వలసిన సమయము ఇప్పుడాసన్నమైనది . వేదములు అపౌరుషేయములు అనగా ఏ పురుషునిచేత అనగా ఏ మానవులచేత చెప్పబడినవి కావు అట్టి వేదశాస్త్ర పురాణేతిహాసాలసములు ఆధారముగాగల సిద్ధాంతముల చేతనే పూర్వ ప్రముఖుల అభిప్రాయములతోడీరణతో నే యీ అంటరానివారెవరో నిర్ణయించెదము గాక . గీ.అవనిన్స్ప్రుశ్యు లని మానవాళి లోన కొంతమందిని ముట్టరు వింతగాదే ! మనుజులందరు నొకటని మనువు, మునులు వేద శాస్త్రాలు చెప్పగా వినగాలేదే !

తమవలనే జన్మించి జీవించు మానవులను కొంతమంది ముట్టరాడందురు గదా ! ఆశ్చర్యమే అయితే తోటిమానవులకు ద్రోహము చేసి మానవ సాంప్రదాయ ములకు విరుద్ధముగా ధర్మ వ్యతిరేకముగా నడచచు ప్రజాకంట కులైనవారిని వారెంర వారైనాను పుట్టుక ఎట్టిదైనను అట్టి నీచకర్ములను వేలివేయుట సహజమే ధర్మసమ్మతమే కాని పుట్టుకచేతనే అంటరానివారని ఎవరినైనా నిర్ణయించుట ఎట్టి న్యాయము ? పుట్టుకచేత అందరు ఒకటే . స్మృతి నిర్మాత యైన మనువు అట్లే నిర్ణయించి యున్నాడు .

శ్లో!ఎకవర్ణ మిదం పూర్వం ! విశ్వ మాసీ ద్యుధి స్టిర !

కర్మ క్రియావిశేషేణ చాతుర్వర్ణ్యం ప్రతిష్ఠితమ్ !!

వ.ధర్మరాజా ! సృష్టాదిలో ఈ ప్రపంచమున ఒకే మానవ జాతి యుండెను కాలాంతరమున ఆయా మానవులోనర్చు వృత్తి, ఉపాధి, కర్మ ధర్మాదుల వలన కర్మ క్రియా విశేషముల చేత నాలుగు వర్ణము లేర్పడినవి సుమా ! అని భీష్ముడు ధర్మ రాజునకు చెప్పెను . ఆ.వె.జన్మచేత సకల జనులినోక్కటే వర్ణమనుచు కర్మవలన గలిగె అన్నివిధములైన యా కర్మలన్నియు జీవయాత్ర కొఱకు జేయవలసె . ఆ.వె.పాంచ భౌతిక ములు ప్రజల దేహంబులు తెలియ నందరొకటే దేహసృష్టి గుణము, నడత, బుద్ధి కోరికలనుబట్టి వర్గవిభాజనంబు వసుధగలిగె దేహనిర్మాణములో మానవులందరూ ఒకటే. యీ దహ్యమానమగు దేహము పంచ్ భూతాత్మకముగదా!ఇక వారి నడవడిక తీరుతెన్నులు గుణగణాదులను బట్టి వర్గ విభజన ఏర్పడినది . ఆత్మయొక్కటి వేరు లేదందులోన నాత్మ దృష్టిని జూచిన నందరొకటే సాత్విక రజస్తమోగుణ తత్వములను పాధి భేదములుండును ప్రజలలోన సర్వ జీవులలో ఉండే ఆత్మస్వరూపమొకటే. అలాగున ఆత్మదృష్టితో చూచినచో అందరు నొకటియేగదా! ఇక బ్రతుకు దెరువుల తేడాలను బట్టి కొంత వ్యత్యాసముండును. అది సహజమే సాత్విక గుణము, రజోగుణము, తామసగుణము, వాటిలో మరల నోకదానితో నొకటి మిశ్రమ మైనప్పుడు కలుగు లక్షణములను బట్టి ఆయామానవుల నడవడిక మారుచుండును. నడతను బట్టి న్యూనతాదికృతలు సంఘములో చూపబడు చుండుట మానవ నైజము అయినను అన్ని యవయవంబు లవసరంబగు దేహి కవని హెచ్చుతగ్గులనగరాదు అట్లె యన్ని జాతులవసరంబగు జనుల్ సంఘ జీవులగుట జగతియందు శరీరములో అవయవములున్నవి. వానిలో వాటి ఉపయోగముల ననుసరించి కొన్ని కొన్ని తేడాలుగా ఎవరికి వారే చూచుట కాదనలేము కాళ్ళు చేతులు శిరస్సు పాదములు అట్లే అవయవములు వేరు వేరు ఉపయోగములుండును. వానిని బట్టి మార్దవ కాఠీన్యములు న్యూనతాధిక్యతా భావములు ఎవరికివారు నైసర్గికము గానే పరిశీలించెదరు. అయితే అన్నియు దేహమునకవసరమే ఏది లేకపోయినా శరీర యాత్రకు ప్రతిబంధకమే.దేనికి అపచారము కలిగినను బాధాకరమే కాని భావనలో తేడాలున్నవి . కాళ్ళకు చేతులకు తేడాగా ఎవరికి వారే చూచెదరు ఎదమచేతికి కుడి చేతిని తేడాగా చూచెదరు గదా ! శరీర భావములో ఒకటేగదా ! అంతమాత్రమున అవి వేరగునా !అట్లే వృత్తి భేదములచే వేరు వేరుగా ప్రవర్తించు వారు సంఘపరముగా అందరొక్కటే కాగలరు. అంత మాత్రము చేతనే దేహమంతయు ఒకటి కాదనరాదు గదా! పెద్దలైనవారు, శాస్త్రములు ఏమిచెప్పినవనగా ఆ.వె.కులముగాదు వాని గుణము ప్రధానంబు గుణవిహీనుడెట్టి కులజుడైన కులము లేనివాడే గుణవంతుడేవడైన ఉత్తమ ద్విజుండే ఉర్వియందు . అనగా ఎవరిని ఎవరని నిర్ణయించుటకైనను వానికులము పుట్ట్టిన తీరు ప్రధానము గాదు. వాని గుణము, నడత ప్రయత్నము ప్రధానములని చెప్పినవారు.దీనినే అపవిత్రుడైన వ్యాసవసిష్టుల జన్మ విధము లెరిగి చర్చ సేయ పుట్టుతీరుబట్టి చెట్ట తలంచుట తగదటంచు తెలియదగును ధరణి . శ్లో!గణికాగర్భ సంభూతో వశిష్టశ్చమహాముని తపసా బ్రాహ్మణో జూతస్సంస్కారాస్తత్ర కారణమ్! సూర్యుడు, వరుణుడు కలసి వెళ్ళుచుండగా మార్గ మధ్యమున ఊర్వశి కనబడెను.ఆమె అందమును చూడగా వారి మనస్సులు చలించి రేతఃపతన మయ్యెను. వారి వీర్యమును ఊర్వశి ఒక కుండలో భద్రపరచెను. ఆ కుంభము నుండి వశిష్టుడు, అగస్త్యుడు జన్మించిరి. వారు తపస్సు చేసి మహా మహులిరి. అందుచేత జన్మ విధానము మానవుల హెచ్చుతగ్గులకు కారణము కాదు. కాలేదు కారాదు. వేశ్యసుతుడు వశిష్టుడు విప్రుడయ్యే తపముచే సంస్కృతియే ఎందు ధర్మమగును జాలరికి వ్యాసుడును, బరాశరుడు మాలె తకు సుతులై ద్విజులైరి లెక్కకిది మించే అని పెద్దలని యున్నారు. అందుచేతనే కులముచేత నెవని గొప్ప కొద్దియటంచు పలుకరాదటంచు ప్రాజ్ఞులండ్రు పంకమందు బుట్టు పద్మము నీచమా పుట్టుచోటు పలుక బూతులనరే !

కులమునుబట్టిగాని, జన్మస్థలమును విధానమునుబట్టి గాని హెచ్చుతగ్గులు పలుకరాదు గదా! బురదలోపుట్టిన పద్మ మెంతగా నాదరింపబడు చున్నది దేవుని శిరమునే యలంకరించు చున్నది గదా!అంతేకాదు. మనము పుట్టిన చోటు నోట పలుకరాదు గదా!పలికిన బూతుమాట అంటారు గదా! చూచిన వెగటు గలుగును గదా! కావున ఎవరిని గాని వారి వారి గుణ కర్మ విశేషములచే మంచి చెడ్డలు నిర్ణయించవలెను. కాని జన్మచేత కాదు. కారాదు.ఇదిఅందరికీ తెలిసిన విషయమే! అయినను కొందరిని పుట్టుక చేతనే అంటరానివారని వెలిగా చూచుచున్నారు గదా! అది శాస్త్ర సమ్మతముగాదు.వెలివేయదగిన వారు వేరుగానున్నారు.వారిని గురించి తెలుసుకొనేదము గాక నిర్ణయించుటకు ప్రయత్నింతము గాక. మాల మాదిగలనుచును, మానవులలో జీతిభేదాల జగడాలు సాగుచుండు అన్ని యవయవముల్ గల్గ మన్నగల్గు నన్నిజాతులు నున్ననే యన్నమమరు. మాలలని, మాదిగలని, చండాలురని కొన్నిజాతులవారిని అంటరానివారని దూరముగా నంచు చున్నారు . అది సమర్ధనీయము కాదు . శరీరములో కొన్ని అవయవములున్నవి . వాటిలో తెడాలున్నవి .కొన్నిటిని ఎల్ల వేళల ముట్టరాదు చూడరాదు .కాని అవి శరీరమునకు అవసరమే . అవన్నియు కలిసియే శరీరము.ఏఅవయవము లోపించినను శరీరయాత్ర జరుగదు . కొన్ని గౌరవముగా చూడబడి మనోహరముగా అలంకరింపబడును కన్ని సామాన్యముగా చూడబడును.మరికొన్ని నీచముగా పరిగణింపబడును.ఈ తేడా ఇతరుల విషయములోకాదు . తనకుతానే అట్లు చూచుందురు అరచేయిని, అరికాలును ఒకలాగ చూడడు .ఎడమచేతిని, కుడిచేతిని తేడాగానే చూస్తాడు.కానీ అంతా తనశరీ రములోని భాగాలే అన్ని తనకు అవసరమే.ఏది లేకపోయినా సాగదు.దేనికి బాధకలిగినను తను అనుభవించ గలడు. ఎందు చేత తేడాగా చూచుచున్నాడు? నైసర్గికము స్వభావమన్న మాట అది ఎవరు చెప్పినది, చేయమని ఆజ్ఞాపించినది కాదు.అలాగునే మానవజాతి ఒకటే!అమ్మ కడుపునుండి పుట్టినపుడు ఒకటే!అంతా సమానమే. తనబుద్ధి, నడవడిక, కృషిఫలితముగా సంఘములో పరిగణన లభించు చున్నది.ఏ మానవుడు మరొక మానవుని నీవీవిధముగా నడచుకోనుమనిగాని నీవిలాగే బ్రతుకుమని గానీ నీవు శుచిగా ఉండవద్దు, నీవు చదువుకోవద్దు అని యిలా ఎవరూ ఎవరినీ శాసించలేదు. అలా శాసించే అధికారము ఎవరికీ లేదు.మానవుడు తన యిస్తానుసారముగా తన జీవన యాత్రను కొనసాగించు కొనవచ్చును, చదువ వచ్చు, సంపాదించుకో వచ్చు.మన రాజ్యాంగము, మన ధర్మశాస్త్రాదులు మానవునకు ఆ స్వాతంత్ర్యమును ఎప్పుడునూ ఇచ్చియన్నవి.అందుచేతనే ఆరవ యింద్రియమైన మనస్సు మనకు భగవంతుడిచ్చిన, స్వేచ్ఛాధికారాలను ప్రసాదించి కర్మలనే కొలబద్దను ఏర్పాటు చేసియున్నాడు. ఆ మీటరు మన బాగోగులు, వృద్ధి క్షయాదులు, ఉత్తమాధమ స్థితిగతులు నిర్ణయించుచున్నది. దీనిని ఎవరు అతిక్రమించలేరు.దేవుడుకూడా దానిని బట్టియే కర్మ ఫలమని అనుభవించమని చెప్పినట్లు పురాణాలు చెప్పుచున్నవి.దానికితరులు కర్తలుకారు, కాలేరు

మూలాలు మార్చు