అధికారి హితోపదేశము

అధికారి హితోపదేశం అనేది వడ్డూరి అచ్యుతరామ కవి రచించిన ఒక విశేషమైన పుస్తకం. దీని రచనా కాలం 1953. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు నిర్వర్తించాల్నిన బాధ్యతలను గురించి ఇందులో రచయిత ఉపదేశించారు.

అధికారి హితోపదేశము
కృతికర్త: వడ్డూరి అచ్యుతరామ కవి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల: 1953

కృతికర్త విజ్ఞప్తి మార్చు

దేశమే యొక గృహము ... ప్రభుత్వము కుటుంబ యజమాని, అధికారులు గృహ నిర్వాహకులు, ప్రజలు బిడ్డలు. ఇదివరలో మన ఇంటి పెత్తనం విదేశీయులు, పరాయి వారైన ఆంగ్లేయులు చేసియున్నారు. ధన, కనక రత్న రాసులతో, పాడి పంటలతో కలకల లాడే మన గృహం (దేశం) పరాయి పెత్తనం మూలంగా అయ్య వారి నట్టిల్లయినది. మన పెద్దలు జాతీయ నాయకులు అవిరళ ప్రయత్నములు చేయగా బాపూజీ నాయకత్వాన కాంగ్రెస్ ఆధ్వర్యమున మన ఇంటి పెత్తనం మనకు దఖలు పడినది. మన ఇంటికి (దేశానికి) మన ప్రజలే ఇప్పుడు బాధ్యత వహించియున్నారు. ఇక (దేశం) ఇల్లు అభివృద్ధి చేసుకొనవలసి యున్నది. గృహ నిర్వహణ విషయంలో ఇదివరకు విదేశీయుల పెత్తనంలో ఉండే పద్ధతులు మార్చుకొని ఆత్మాభిమానంతో ఆ ఇంటికి చెందిన వారందరూ (దేశప్రజలందరూ) బాధ్యతతో ప్రవర్తించాలి. ఇది సక్రమంగా నెరవేరుటలో గృహిణి ప్రధాన బాధ్యతతో తన విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించే యెడల ఇటు బిడ్డలు, అటు యజమాని, గృహము అభివృద్ధి చెంది గౌరవ ప్రతిష్టలు పొందుట సాధ్యమగును. మన భారత దేశమనే ఇంటికి ప్రజా ప్రభుత్వం ఇంటి యజమాని. అధికారులు తల్లి వంటివారు. ప్రజలు బిడ్డల వంటి వారు. అధికారులు నీతి పరులై తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వాశయములను సక్రమంగా అమలు జరుపుచూ ప్రజలను బిడ్డలవలె ఆదరించి సమ దృష్టితో వ్యవహరించిన దేశం అభ్యుదయాన్ని అందుకొని కీర్తి, గౌరవములు, శాంతి, సౌఖ్యములు పొందగలుగును. యీ విషయములు ఈ పుస్తకమున పొందుపరచబడినవి. అధికారులు దేశమందు రాజ్యాంగ యంత్రమున ప్రధాన పరికరము. దేశాభ్యుదయం జాతీయ ప్రభుత్వాశయం వారి మీదనే యాధారపడియున్నది. నా భావాలను స్పష్టీ కరిస్తూ వ్రాయబడిన ఈ చిన్న పుస్తకమును అధికారులు సదుద్దేశంతో గ్రహించి ఆదరిస్తారని, కాబోయే అధికారులయ్యే విద్యార్థులు పాత్యపుస్తకంగా పరిగ్రహించి పఠిస్తారని, జాతీయ ప్రభుత్వాధికారులు నా యాశయమును గుర్తించి ఆచరణలో పెట్టగలరని ఆశిస్తున్నాను. పెద్దలు యీ కృతి నాశీర్వదించి నన్ననుగ్రహించె దరు గాక ! కృష్ణ దేవరాయల పరిపాలనానంతరం నేటికి స్వపరిపాలనాధికార యోగ్యత పొందగలిగిన మన ఆంధ్ర జాతికి శుభోదయ మనదగిన ఈ అక్టోబరు 1 వ తేదీన1953 వ సంవత్సరం యీ కృతిని నవ్యాంధ్ర ప్రభుత్వమునకు అంకిత మొసంగడమైనది.

  గురువరుడుత్తమ శిష్యుని 
  వరుడన్నిటయోగ్యయైన వధువును ధరణీ 
  వరుడుత్తమానుచరులను   
  గర మన్వేషింపవలయు గద రాష్ట్రపతీ!