బూర్గుల రామకృష్ణారావు, వి.బి.రాజు, జనార్దనరావు దేశాయి మొదలైనవారు విశాల రాష్ట్రాన్ని కోరే వర్గం గొంతు వినిపించడానికి ఆంధ్రజనత అనే పత్రికను స్థాపించారు. హైదరబాదు నుండి వెలువడిన ఈ దినపత్రిక 1956లో ప్రారంభమైనది. ముకరంజాహీ రోడ్డులోని మిలాప్ ప్రెస్‌లో ఈ పత్రిక ముద్రించబడేది. ఈ పత్రిక కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు.[1] అజంతా, జి.ఎస్.వరదాచారి ఈ పత్రికకు సహాయ సంపాదకులుగా ఉండేవారు. కాజ రాధాకృష్ణశాస్త్రి, బి.నాగేశ్వరరావు, తురగా కృష్ణమోహనరావు, బుద్ధవరపు విశ్వేశ్వరరావు, కె.ఎల్.సింహా, ఎ.ఎల్.నరసింహారావు, ఉషశ్రీ, పొత్తూరి వెంకటేశ్వర రావు మొదలైన వారు ఈ పత్రికలో పనిచేశారు.[2] ఈ పత్రికలో వార్తలతో పాటు సంపాదకీయం, వారఫలాలు, ఆకాశావాణి హైదరాబాదు కేంద్రం కార్యక్రమ వివరాలు, ధరవరలు మొదలైనవి ప్రకటించబడేవి. వివిధ రకాల ప్రకటనలు అంటే సినిమా ప్రకటనలు, ట్రావెల్ సర్వీసు ప్రకటనలు, టెండరు నోటీసులు, కోర్టు నోటీసులు మొదలైనవి ఈ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికను 1965లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొనుగోలు చేసింది. పండితారాధ్యుల నాగేశ్వరరావు 1965, వేటూరి సుందరరామమూర్తి 1967-68, జి.సి.కొండయ్య 1968-70, భాట్టం శ్రీరామమూర్తి1970-72, ఎ.చక్రపాణి 1972, కాట్రగడ్డ రాజగోపాలరావు 1972-73లలో ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. ఈ పత్రిక సుమారు 20 సంవత్సరాలు నడిచింది.

ఆంధ్రజనత
రకంప్రతి దినం దినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంజనత ట్రస్ట్
ప్రచురణకర్తసీత యుధ్‌వీర్
సంపాదకులుకె.ఎస్.సుబ్రహ్మణ్యం
స్థాపించినది1956, హైదరాబాదు
కేంద్రంహైదరాబాదు
Circulation4000

విశాలాంధ్ర ఉద్యమంలో ఈ పత్రిక చరిత్రాత్మకమైన పాత్ర నిర్వహించింది. వేర్పాటువాదులు దాడులు జరిపినప్పుడుగాని, తన అభిప్రాయాలను నిర్ద్వంద్వంగా చెప్పే విషయంలోగాని ఈ పత్రిక ధైర్యసాహసాలతో వ్యవహరించింది. ఆ కాలంలో ఈ పత్రిక నాలుగువేల సర్క్యులేషన్‌ను అధిగమించింది.

మూలాలు మార్చు

  1. కె.ఎస్., సుబ్రహ్మణ్యం (1958-03-01). "ఆంధ్రజనత". ఆంధ్రజనత. No. 231. Archived from the original on 2016-03-05. Retrieved 17 January 2015.
  2. పొత్తూరి వెంకటేశ్వర రావు (2004-08-01). ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగు పత్రికలు (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ. pp. 389–390.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆంధ్రజనత&oldid=3899219" నుండి వెలికితీశారు