కాకతీయ ప్రస్థానం (పుస్తకం)


కాకతీయ ప్రస్థానం కాకతీయుల చరిత్రకు సంబంధించిన పుస్తకం. నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం సంచికైన బతుకమ్మలో ప్రతివారం జర్నలిస్టు నగేష్ బీరెడ్డి రాసిన వ్యాసాలను తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కాకతీయ ప్రస్థానం పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది.

కాకతీయ ప్రస్థానం
కృతికర్త: నగేష్ బీరెడ్డి
సంపాదకులు: మామిడి హరికృష్ణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): చరిత్ర
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: డిసెంబర్ 23, 2018
పేజీలు: 120
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-936452-1-5

రచన మార్చు

తెలుగు నేలను, దక్షిణ భారత ప్రాంతాన్ని దాదాపు 300 ఏళ్ళ పాటు అప్రతిహతంగా పాలించిన కాకతీయులకు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలు ప్రపంచానికి తెలియవు. కాకతీయుల చరిత్ర పరిశోధన, రచనల్లో ఉన్న ఖాళీలను నింపడానికి చేసిన ప్రయత్నంలో కాకతీయ చరిత్రలో తారీఖులు, యుద్దాలు, ముఖ్యమైన సంఘటనలతోపాటు కాకతీయుల కాలంనాటి రాజకీయ, సాంఘీక, మత, సాంస్కృతిక చరిత్రకు నగేష్ బీరెడ్డి తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి సేకరించిన కాకతీయ చరిత్రను పక్కదారి పట్టనివ్వకుండా క్రమపద్ధతిలో సరైన వివరాలతో రాశాడు.

ఈ పుస్తకంలో కాకతీయ రాజ్య పతనం తర్వాత కాకతీయుల వారసుల గురించి, బస్తర్ ప్రాంతంలో వారి వారసులు ఇప్పటికీ జీవించి ఉన్న విషయాల గురించీ ససాక్ష్యంగా, ఆధార సమితంగా విశ్లేషించి, దాదాపు 750 సంవత్సరాల మిస్సింగ్ లింక్‌ను (1323 నుండి నేటి వరకు) కనుగొనబడింది.

పుస్తకంగా మార్చు

కాకతీయుల చరిత్ర గురించి నగేష్ రాసిన వ్యాసాలు 2017 మే నెలనుండి నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రతీ ఆదివారం వచ్చే బతుకమ్మ సంచికలో మన చరిత్ర అనే శీర్షికతో ధారావాహికగా దాదాపు 77 వారాలు ప్రచురితమయ్యాయి. ఆ వ్యాసాలన్నింటిని ఒకచోట చేర్చి కాకతీయుల చరిత్రను ముందుతరాలకు... ముఖ్యంగా కాకతీయుల చరిత్రను అధ్యయనం చేసే పరిశోధకులకు ఒక ఆధార గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో సంచాలకుడు మామిడి హరికృష్ణ సంపాదకులుగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నుండి ఈ పుస్తకం ప్రచురించబడింది.[1]

పుస్తకంలో మార్చు

  1. కాకతీయులు ఎవరు, ఎక్కడివారు?
  2. కాకతీయుల మూలాలు శాసనాధారాలు
  3. కాకతీయులది ఏ కులం?
  4. కాకతీయుల తొలితరం నాయకులు
  5. ఆధిపత్య పోరు... సార్వభౌమత్వం వైపు అడుగులు షురూ...
  6. కాకతీయుల తొలి సార్వభౌముడు చక్రవర్తి రుద్రదేవుడు
  7. రాజు లేని రాజ్యాన్ని రక్షించుకున్న సైన్యం..
  8. గణపతిదేవుడు
  9. సకల దేశ ప్రతిష్టాపనాచార్య
  10. స్త్రీ అధికారానికి బీజం
  11. సామ్రాజ్ఞి రుద్రమ
  12. ప్రతాపరుద్రుని ప్రతీకారం త్రిముఖ వ్యూహం
  13. ఓరుగల్లుపై తురుష్కుల తొలి దండయాత్ర
  14. ప్రజలపై హింస చూడలేక ఖిల్జీతో సంధి
  15. ఢిల్లీ సింహాసనం సంక్షోభాల నిలయం.. కారణం ఇదేనా?
  16. ప్రతాపరుద్రుడి చివరి యుద్ధం
  17. ప్రతాపరుద్రుడి నిర్యాణం - నిజానిజాలు
  18. కాకతీయుల దగ్గర పరుసవేది ఉండేదా?
  19. జనబాహుళ్యంలో ఉన్న కథ సాక్ష్యాలు
  20. కాకతీయుల గురించి మనకు తెలిసిందెంత?
  21. ఓరుగల్లు నుంచి బస్తర్
  22. సజీవ సాక్ష్యాలు కోకొల్లలు
  23. బస్తర్ పాలకుల్లో వీరాధివీరులు
  24. బస్తర్‌లో వెలుగుతున్న కాకతీయ వారసత్వపు దివ్వెలు!

విడుదల మార్చు

2018, డిసెంబరు 23న తెలంగాణ కళాభారతి మైదానం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరిగిన జాతీయ పుస్తక మహోత్సవంలో నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి చేతులమీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి చంద్రమోహన్, సీనియర్ జర్నలిస్టు జగన్‌రెడ్డి, పుస్తక రచయిత బీరెడ్డి నగేశ్ పాల్గొన్నారు.[2]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, ఆదివారం (25 November 2018). "కాకతీయ ప్రస్థానం ఇతిహాసంలో తెలంగాణ ఎక్కడ?". www.ntnews.com. Archived from the original on 28 నవంబరు 2018. Retrieved 8 November 2019.
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ (23 December 2018). "మన చరిత్రను మనమే రాసుకోవాలి". www.ntnews.com. Archived from the original on 8 నవంబరు 2019. Retrieved 8 November 2019.