కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో ఉన్న ఆలయం.[1]

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హన్మకొండ
ప్రదేశం:కొత్తకొండ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వీరభద్రస్వామి దేవాలయం
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

చరిత్ర మార్చు

సా.శ.1600వ సంవత్సరం కాలంలో వంట చెరుకు కోసం కొందమంది కుమ్మరులు ఎడ్లబండ్లతో కొండపైకి వెళ్లారు. వంట చెరుకు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు నిద్రపోయారు. కాసేపటి తరువాత లేచి చూడగా, ఎడ్లు కనబడకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్ఠిస్తే వారి ఎడ్లు దొరుకుతాయిని చెప్పడంతో, గుట్టకింద దూదిమెత్తలలో విగ్రహాన్ని ఉంచి వీరభద్రస్వామిని ప్రతిష్ఠించినట్లు, ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు తెలుపుతుంటారు.[2]

జాతర మార్చు

కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ళ మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందురోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రాధాన ఆకర్షణ సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమినాడు 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది.[3]

ప్రతి సంవత్సరం జనవరి 10న శ్రీ వీరభద్రస్వామి కల్యాణం జరుగగా, 11న గవ్యాతం, నిత్యోపాసన, నిత్యహోమం, నవగ్రహ హోమాలు, 12న బలిహరణ, సూర్యయంత్ర పతిష్టాపన, అరుణ పారాయణం, 13న ఏకాదశి రుద్రహోమం, 14న భోగిపండుగ రోజున చండీహోమం, వేదపారాయణం, 15న బండ్లు తిరుగుట (జాతర), శత రుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 16న నాగవెల్లి, వసంతోత్సవం, 17న గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు అనంతరం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి.[4] ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు గండాలు తీరాలని గండదీపం, వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరించి 27 రోజులు దీక్షలు చేపడతారు.

సంతానయోగం మార్చు

ఇక్కడి వీరభద్రస్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నట్లు భక్తుల నమ్మకం. సంతానం లేనివారు స్వామి వారికి కోరమీసాలు సమర్పించు కుంటే పుత్రసంతానం కలుగుతుందని, కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తులు నమ్మేవారు. కోడెలు కట్టటం, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, అమ్మ వారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, నవగ్రహ పూజలు, ఆంజనేయునికి ఆకుపూజలు, చందనోత్సవాలు మొదలైనవి భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.[5]

మూలాలు మార్చు

  1. ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం". Archived from the original on 16 July 2018. Retrieved 29 May 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 15 జూలై 2018 suggested (help)
  2. "కోరిన కోరికలను నెరవేర్చే కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం గురించి తెలుసా - Wirally". www.wirally.com. Archived from the original on 2019-10-05. Retrieved 2021-11-08.
  3. "వీరన్న కల్యాణం చూతము రా..రండి!". EENADU. 2020-01-09. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  4. "విద్యుత్ వెలుగుల్లో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం". ETV Bharat News. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  5. వీరభద్రస్వామి దేవాలయం-కొత్తకొండ గ్రామం (కరీంనగర్‌ జిల్లా), సూర్య ఆదివారం సంచిక, 02-01-2011

వెలుపలి లంకెలు మార్చు