కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్


కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ (ఆగష్టు 25, 1894 - డిసెంబర్ 19, 1967) స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశీలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు.

జననం మార్చు

కృష్ణస్వామి 1893, ఆగష్టు 25కృష్ణాష్టమి రోజు[1] జాల్నాలోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు.[2] ఎంతో కష్టపడి చదువుకొని చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, ఆ తరువాత నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆ తరువాత బొంబాయిలో ముద్రణ, ప్రచురణా సాంకేతికతలో కోర్సు చేశాడు. కొన్నాళ్ళు అప్పటి హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి మహారాజ్ క్రిషన్ ప్రసాద్ వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తరువాత ఆడిటర్ జనరల్ కార్యలయంలో ఉద్యోగం చేపట్టాడు.

ఆ తరువాతి కాలంలో ఆంగ్ల దినపత్రికైన డెక్కన్ స్టార్ లో, ఉర్దూ దినపత్రిక అయిన మసావత్ తో సంపాదకుడిగా పనిచేశాడు. న్యూ ఎరా పత్రికకు కూడా సంపాదకత్వం వహిస్తూ, సియాసత్, రయ్యత్, రహనూమా-ఏ-డెక్కన్, ఎమ్రోజ్ వంటి అనేక ఉర్దూ వార్తాపత్రికలలో కాలమ్స్ వ్రాశాడు. 1925లో కృష్ణస్వామి తన సొంత ముద్రణాలయం ప్రారంభించి 1929లో పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథాన్ని వెలువరించాడు. ఇది రెఫెరెన్సు గ్రంథంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈయన హైదరాబాదు చరిత్ర, గోవాలో స్వాతంత్ర్యోద్యమం తదితర అంశాలపై అనేక పుస్తకాలను వ్రాశాడు.

కృష్ణస్వామి 1918లో సోషల్ సర్వీస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. 1925లో జాంబాగ్ దేవాలయంలో హిందూ ధర్మ పరిషత్ మహాసభను స్థాపించాడు. 1926లో రావుబహద్దూర్ వెంకట్రామిరెడ్డి, మాడపాటి హనుమంతరావు, పండిట్ నరేంద్రజీలతో కలసి సుల్తాన్ బజార్లో శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం రజతోత్సవాన్ని నిర్వహించాడు. 1933 నుంచి 25 సంవత్సరాల పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థలో చుడీ బజార్ ప్రాంతానికి మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1940, 1955 లలో డిప్యూటీ మేయర్ (నాయబ్ మీర్ మజ్లిస్) గా, 1957 నుండి 1958 వరకు హైదరాబాదు నాలుగో మేయరుగా సేవలు అందించారు. మేయరుగా ఉన్న కాలంలో హైదరాబాదుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించి నగరంపై చెరగని ముద్రవేశాడు. రచయితగా, సాహితీవేత్తగానే కాకుండా పాత్రికేయుడిగా కూడా ఆయన సేవలందించారు. సామాజిక రుగ్మతలపై అనేక పుస్తకాలు వ్రాశాడు baharat independence charitra rasey sagamlo .

మరణం మార్చు

నిరాడంబర జీవితాన్ని గడిపిన కృష్ణస్వామి 1967, డిసెంబర్ 15 న మరణించాడు.

ముదిరాజు చరిత్ర మార్చు

చరిత్రపుటలు: నాడు రాజరికం.. నేడు పేదరికం

దక్షిణభారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో వివిధ పేర్లతో, అత్యధిక జనాభాతో 'ముదిరాజ్‌' జాతి ప్రజలు ఉనికిలో ఉన్నారు. తమ పేరులో తొణకిసలాడుతున్న రాజరికపు ఆనవాళ్లు నిజజీవితంలో కనీసం ఊహించుకోవడానికి కూడా అవకాశంలేని రీతిలో కడు పేదరికంలో 'దినదినగండం, నూరేళ్ల ఆయుష్షు'లాగా బతుకుతున్నారు. ఒకప్పుడు భారత ఉపఖండంలోని దక్షిణాపథంలో చక్రవర్తులుగా, రాజులుగా, సామంతరాజులుగా, మండలాధీశులుగా, సేనాధిపతులుగా, పాలెగాళ్లుగా, సైనికులుగా, గ్రామపాలకులుగా, గ్రామరక్షకులుగా అత్యంత వైభవోపేత చరిత్రను స్వంతం చేసుకున్న 'ముత్తరాసులు' ఆ తర్వాత కాలక్రమంలో రాజ్యాలు కూలిపోయి, రాజరికాలు అంతరించిపోయి చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరితోపాటు శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, థాయిలాండ్‌లాంటి అనేక దేశాలకు వలస వెళ్లి తమ జాతి జనాభాను విస్తరించుకున్నారు. వివిధ దేశాలుగా, భౌగోళికంగా స్థిరపడిన ప్రాంతాలలో అక్కడి భాష, ఆచార వ్యవహారలకు అలవాటుపడి, గతకాలపు మూలాలతో సంబంధాలు తెగిపోయిన 'ముదిరాజు'లు ఒక నిర్దిష్ట వృత్తిగానీ, సాంప్రదాయక వ్యాపకంగానీ లేక అత్యంత దీనావస్థలో ఉన్నారు. 2013 ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్‌ కేంద్రంగా ఈ వ్యాసరచయిత చొరవతో 'ముదిరాజ్‌ అధ్యయన వేదిక' ఏర్పాటు చేసేదాకా ఈ చారిత్రక అంశాలపైన నిర్థిష్ట అధ్యయనం జరగకపోవడంతో ఈ జాతికి సంబంధించిన అనేక చారిత్రక సత్యాలు మరుగున పడిపోయిన విషాదాలుగా మిగిలిపోయాయి.

అనేక రకాలుగా విస్తరించి

భారతదేశంతోపాటు పలు దక్షిణాసియా దేశాలలో విస్తరించుకున్న తీరుతెన్నులు, అందుకు దారితీసి పరిస్థితులు, వర్తమాన కాలంలో ముదిరాజుల స్థితిగతుల మీద లోతైన పరిశీలన, అధ్యయనం జరగాల్సిన అవసరం ఉన్నది. అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఉనికిలో ఉన్న ముదిరాజులు ఉత్తర భారతం నుండి దక్షిణాదికి విస్తరించారని తెలియుచున్నది. ఆర్యుల దండయాత్రలను ఎదిరించే క్రమంలో హిమాలయ పర్వతప్రాంతాలలో 'కల్చూరీ'లుగా ఉనికిలోఉన్న ఈ జాతి ప్రజలు దక్షిణాదిలో 'కలబ్రాలు'గా పిలువబడినారని తెలియుచున్నది.

ఆర్యులు ఉత్తర భారతం నుండి దక్షిణాదికి విస్తరించకుండా నిలువరించడంలోనూ, ఆర్యుల సంస్కృతికి ప్రత్యామ్నాయంగా జైనం, బౌద్ధ విశ్వాసాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలోనూ, దక్షిణ భారతంలో సుమారు 650 సంవత్సరాల సుధీర్ఘకాలంపాటు సుస్థిర పరిపాలన అందించడంలోనూ, భారతదేశ సంస్కృతీసాంప్రదాయ వికాసాలను పాదుకొల్పడంలోనూ ముదిరాజులు చరిత్రాత్మక పాత్ర నిర్వహించారనడానికి అనేక ఆధారాలున్నాయి. ఈ చారిత్రక సత్యాలు గ్రంధస్థం కాలేదు. ముదిరాజుల చరిత్రకు సంబంధించిన సాధికారిక ఆధారాలు భవిష్యత్తు తరాలకు అందకుండా చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆంశాలన్నింటినీ సాధికారికంగా నిలబెట్టడానికి లోతైన అధ్యయనం, పరిశీలన జరగాల్సి ఉన్నది.

తెనుగు, తెలుగుగా మారి

దేశ సాంస్కృతిక వికాసంలో ముదిరాజ్‌ జాతి నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకం. తెలుగు ప్రజలందరూ 'తెలుగు సంవత్సరాది' పేరుతో నిర్వహించుకునే 'ఉగాది' తెనుగు జాతి పండుగగానే ప్రసిద్ధి గాంచింది. తెలుగు ప్రాంతాలలో 'ముదిరాజు'లకు స్థిరపడిన అనేక పేర్లలో ముత్తరాసి, తెనుగోళ్లు, తెలుగు ప్రజలు అత్యంత ప్రాచీనమైనవి. ముదిరాజులు తమ సాంస్కృతిక సంప్రదాయాలలో భాగంగా నిర్వహించుకునే పర్వదినాలలో 'తెనుగు ఉగాది' కూడా ఒకటి. దక్షిణ భారతంలోని అనేక రాజ్యాలను పాలించిన కాలంలో ఆచరించిన ఉగాది పండుగ రాజరిక వంశాలకు సంబంధించిన సాంప్రాదాయంగా కొనసాగడంతో, ఆయా ప్రాంతాల ప్రజలు రాజరికపు సాంప్రదాయాలను అనుకరించి ఈ పండుగను విశ్వవ్యాపితం చేసినట్లు చెబుతారు.

కడప జిల్లా కల్లమల్ల ప్రాంతంలో లభించిన మొట్టమొదటి తెలుగు శిలా శాసనాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రేనాటి చోళరాజు ధనంజయ ముత్తరాయ (ముదిరాజ్‌) క్రీ.శ. 575లో వేయించాడు. దీంతో 'తెనుగు' ప్రజలు మాట్లాడే భాషనే కాలక్రమంలో 'తెలుగు' భాషగా వాడుకలోకి వచ్చిందని చరిత్రకారులు విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాలలోనూ, తమిళనాడు, కర్నాటక సరిహద్దు ప్రాంతాలలోనూ అత్యధిక సంఖ్యలో విస్తరించుకున్న తెనుగు, ముత్తరాసులు మాట్లాడిన భాషనే 'తెలుగు' భాషగా పరిణామం చెందిందని మరొక విశ్వాసం ప్రచారంలో ఉన్నది. తెలుగు మాట్లాడే తెనుగు ప్రజలు అధికంగా జీవించే ప్రాంతమే 'తెలంగాణ'గా అవతరించినట్లుగా కూడా విశ్వసిస్తారు.

తమకంటూ ఓ వృత్తి లేక

ఈ చారిత్రక పరిణామక్రమంలో ముత్తరాసి, ముత్రాచ, తెనుగు, తెలుగు, బంటు, ముత్తరాయ, ముత్తరాయర్‌, మొదలియార్‌, కోలి, కబ్బలిగ, అరయ, ధీవర, మగవీరలాంటి సుమారు 37 పేర్లతో వివిధ రాష్ట్రాలలో ఉనికిలో ఉన్న ముదిరాజులు వర్తమాన సమాజంలో పరిపాలకుల స్థానం నుంచి దీన స్థానానికి కుదించుకుపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అసెంబ్లీ వేదికగా ప్రకటించినట్లుగా ముదిరాజులకు ఎద్దులేదు, ఎవుసం లేదు, ప్రత్యేకించి ఒక కులవృత్తి లేదు.

బతుకుదెరువు అసలే లేదు. కుటుంబ పోషణకోసం ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ పేదరికంలో బతుకుతున్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ముదిరాజులలోనే అత్యధిక పేదరికం తాండవిస్తున్నది. దాని వెంటనే నిరక్ష్యరాస్యత ఉంది. మత్తుపానీయాల బానిసత్వం ఉంది. ఆత్మహత్యలు, ఆకలిచావులు, స్కూల్‌ డ్రాపవుట్లు, నేరప్రవృత్తి, పోలీసుకేసులలో అగ్రస్థానం ఉంది. ఎక్కువ మంది మత్స్యకార వృత్తి, వ్యవసాయం, వ్యవసాయాధారిత పనులు, ఇతర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం మత్స్యరంగం అభివృద్దికి ఇతోధికంగా దోహదపడుతున్నది. ఫలితంగా ముదిరాజుల జీవనశైలిలో కొంత మేరకు మార్పులు వస్తున్నవి. మత్స్య సహకార సంఘాలలో ముదిరాజుల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో మాత్రమే ముదిరాజులకు 'వృత్తి మత్స్యకారులు'గా అధికారిక గుర్తింపు ఇచ్చారు. ముదిరాజులకు రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన రిజర్వేషన్‌ లభించడం లేదనే నిరాశ ఉంది. రాజకీయంగా తెలంగాణతోపాటు దక్షిణాదిరాష్ట్రాలన్నింటిలోనూ అధికార పీఠానికి అందనంత దూరంలోనే ఉన్నారు.

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌, నెల్లి లక్ష్మీనారాయణలాంటి ఎందరో రాజకీయ, సామాజిక ప్రముఖులు తెలుగు సమాజాలకు సేవలందించినప్పటికీ వారికి తగిన గుర్తింపు, ప్రాచుర్యం లభించలేదు. ఈ నేపథ్యంలో ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి స్వశక్తితో ఎదిగిన రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలలో స్థిరపడిన మేధావులు, ఆలోచనాపరులు, ప్రభుత్వ పెద్దలు ఈ వెనకబడి ఉన్న ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని సభ్య సమాజంలో సమానప్రాతినిధ్యం కల్పించే విధంగా చూడాలని, తమకు గౌరవప్రద భవిష్యత్తు లభించాలని ముదిరాజ్‌ సమాజం ఆశిస్తున్నది.

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-10-07.
  2. Mudiraj – a multi-faceted personality - The Hindu August 12, 2012