గుజరాతీపేట, ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం పట్టణంలో నాగావళి నది  తూర్పుతీరాన ఉన్న ప్రాంతం.  ఇది శ్రీకాకుళం పట్టణంలో, మునిసిపల్ కార్పొరేషన్ లో భాగంగా ఉంది. పట్టణ జనాభాలో మూడవవంతు ఇక్కడే ఉంది.  ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఫాజుల్ బేగ్ పేట, హయాతీ నగర్, పురుషోత్తమ నగర్ కాలనీ ఉన్నాయి. నాగావళి నది తూర్పు తీరం నుండి జాతీయ రహదారి 16 వరకు విస్తరించిన ప్రాంతాన్ని గుజరాతీ పేటగా వ్యవహరిస్తారు.

గుజరాతీపేటలో గలనారయణ తిరుమల ఆలయం

పేరు చరిత్ర

సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ప్రస్తుత గుజరాత్ రాష్ట్రం నుండి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు తరలివచ్చాయి.  వారు గుజరాత్ నుండి రావడం వలన వారు నివసించే ప్రాంతం గుజరాతీ పేటగా స్థిరపడింది. వారు ఇక్కడే స్థిరపడి వ్యవసాయం, ప్రభుత్వోద్యోగాలలో, పురోహిత వృత్తి లో ప్రవేశించారు.  ఈ ప్రాంతంలో సుభద్ర, బలరామ సహిత జగన్నాధ స్వామి ఆలయాన్ని, శివాలయాలు నిర్మించారు. పలు ఆలయాలకు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక గ్రామంగా ఉన్న గుజరాతీ పేట 1911లో మునిసిపల్ పాలన క్రిందకు వచ్చింది.

విద్యా సంస్థలు

గుజరాతీ పేటలో మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రెండు ప్రాధమిక పాఠశాలలు,  ఒక ఉన్నత పాఠశాల ఉన్నాయి. ప్రైవేటు రంగంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేవి, తరువాత అవి మూతపడ్డాయి.

వైద్య సంస్థలు

మునిసిపల్ కార్పొరేషన్ పట్టణ ఆరోగ్య కేంద్రం పేరుతో ఒక వైద్యశాలను నిర్వహిస్తోంది.

దేవాలయాలు

నాగావళి నదీతీరాన రెండు శివాలయాలు, జగన్నాధ సుభద్ర సహిత బలరామ స్వామి దేవాలయం ఉన్నాయి. ప్రతీ ఏటా ఆషాడ మాసంలో జగన్నాధ రధయాత్ర జరుగుతూటుంది. తోటవీధి వద్ద రామాలయం, షిర్డీసాయి దేవాలయం, సత్యసాయి మందిరం ఉన్నాయి. తోటవీధి కూడలిలో గుజరాతీ బ్రాహ్మణులు నాటిన రావి చెట్టు సుమారు 100 సంవత్సరాల నాటిది. దీని మొదలు వద్ద గణపతి విగ్రహం నాగబంధం ప్రతిమలు ఉన్నాయి.

తపాలా కార్యాలయం

గుజరాతీ పేటలో ఉప తపాలా కార్యాలయంలో స్పీడ్ పోస్ట్, బ్యాంకింగ్ సదుపాయాలు ఉన్నాయి. పినకోడ్ 532005.

వంతెన ప్రాముఖ్యత

ఈ ప్రాంతంలో 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం నిర్మించిన వంతెనను 2013 లో కూల్చివేసి 2016 లో మళ్ళీ పునర్నిర్మించారు. ఈ వంతెన పాత బ్రిడ్జిగా, పురాతన కట్టడాలలో ఒకటిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.