గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ వ్యాధి

(గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్‌ వ్యాధి నుండి దారిమార్పు చెందింది)

గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్‌ వ్యాధి వలన మానవ ఛాతీలో మంట, తేన్పులు కలిగి విపరీతమైన ఇబ్బంది కలుగును. ఇందులో ఛాతీలో మంట, తేన్పులు, పడుకుంటే సమస్య మరింత ఎక్కువ. తినాలనిపించదు. తినకపోతే పొట్టలో మంట ఉంటుంది. గ్యాస్ట్రో ఇసియోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్‌తో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు ఇవి. ఆహార నాళానికి, జీర్ణాశయానికి మధ్యలో ఉన్న కవాటం దెబ్బతినడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. ఆహారం కిందకు వెళ్లాలి, యాసిడ్ పైకి రాకుండా ఉండాలి. కవాటం ఈ విధిని నిర్వర్తిస్తుంది. అయితే ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు యాసిడ్ పైకి రావడం జరుగుతుంది. దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ వ్యాధి
SpecialtyGastroenterology Edit this on Wikidata

ప్రధాన కారణాలు మార్చు

మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, కలరింగ్ ఏజెంట్స్ వాడిన పదార్థాలు తినడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి లోనుకావడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. హెలికో బ్యాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా కూడా ఇందుకు కొంత వరకూ కారణమవుతుంది.

 
ఆమ్ల తిరోగమనం వలన కలిగిన అన్నవాహికలో సంకోచం (Esophageal stricture)

మనం తిన్న ఆహారం ఒక సన్నటి ఆహారనాళం (ఫుడ్ పైప్) ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఈ ఆహారనాళం పైప్ సాధారణంగా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర అంగుళాల పొడవుంటుంది. ఇది కడుపు/ఆహారకోశం (స్టమక్) లోకి దారితీస్తుంది. ప్రతి ఒక్కరికీ ఆహారనాళం, ఆహార కోశం... ఈ రెండింటి కలయిక (జంక్షన్‌)లో ఆహారం పైకి వెళ్లకుండా ఒక వ్యవస్థ ఉంటుంది. కడుపులోకి ఆహారం వచ్చిన తర్వాత అక్కడి నుంచి జీర్ణమయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆమ్లము పైకి ఎగజిమ్ముతున్నా, ఆహారం జీర్ణం కావడానికి తగినంత ఆమ్లము అక్కడ లేకపోయినా, దాన్ని భర్తీ చేసేందుకు మరింత ఆమ్లము ఉత్పన్నం అవుతుంది. దాంతో అది కడుపు కండరాల మీద ప్రభావం చూపి, అక్కడ స్టమక్ అల్సర్ (కడుపులో పుండ్లు) వచ్చేలా చేస్తుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితికి దారి తీయకపోయినా, రోజువారీ పనులకు ఆటంకంగా పరిణమిస్తుంది.

ముఖ్య లక్షణాలు మార్చు

ఛాతీలో మంట, తేన్పులు. పడుకుని లేవగానే దగ్గు, నోరు చేదుగా అనిపించడం, ఆహారం నోట్లోకి వచ్చినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. పడుకున్నప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

చికిత్స తీసుకోవాలా? మార్చు

ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎక్కువగా అసౌకర్యానికి లోనవుతారు. అంతేకాకుండా ఛాతీలో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆహార నాళం యాసిడ్‌ను తట్టుకోలేదు. జీర్ణాశయంలో యాసిడ్‌ను తట్టుకునే విధంగా నిర్మాణం ఉంటుంది. కానీ ఆహార నాళంలో అలా ఉండదు. దీనివల్ల ఆహార నాళం దెబ్బతింటుంది. దీన్ని నివారించాలంటే చికిత్స తీసుకోవాలి.

వ్యాధి నిర్ధారణ మార్చు

పొట్టలో మంట ఏ వయసు వారిలోనైనా రావచ్చు. కానీ 40 ఏళ్లు పైబడి ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు, ఆకలి తగ్గడం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపి చేయాలి. ఎందుకంటే కణుతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలో ఒక కోర్సు మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపి చేయాల్సి ఉంటుంది. కొందరు ఎండోస్కోపి చేయించుకోవాలంటే భయపడతారు. అటువంటి వారికి మత్తు ఇచ్చి చేయడం జరుగుతుంది. ఇతర సమస్యలు ఉండి మత్తు ఇచ్చే అవకాశం కూడా లేనప్పుడు, ఎండోస్కోపి తట్టుకోలేకపోతున్నారు అనుకుంటే వర్చువల్ ఎండోస్కోపిని వైద్యులు సూచిస్తారు.

కొందరిలో ఛాతీ నొప్పిగా అనిపించి, ఆ నొప్పి ఛాతీ కింద ఉండే ఎముక కింద చిక్కుపడిపోయినట్లుగా వస్తుంటుంది. ఫలితంగా దాన్ని గుండెనొప్పితో ముడివేసి చాలామంది ఆందోళన పడుతుంటారు. ఈ నొప్పి గుండెను ఒత్తినట్లుగా అనిపిస్తుండటంతో గుండెపోటుగా పొరబడతారు. కాబట్టి ఈ రెండింటి లక్షణాలూ చూసి అది గుండెపోటు లేదా యాంజైనా కాదని నిర్ధారణ చేసుకోవడం ప్రధానం.

చికిత్సా పద్ధతులు మార్చు

వైద్యులు ముందుగా 6 వారాల పాటు మందులు సూచించడం జరుగుతుంది. అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే మరో 6 వారాల పాటు మందులు ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు ఈ చికిత్సతోనే తగ్గిపోతుంది. కొంతమందిలో మందులతో అసలు తగ్గదు. మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గుతుంది. మానేస్తే మళ్లీ మామూలే. అటువంటి వారికి సర్జరీ అవసరమవుతుంది. దీన్ని ఫండోప్లికేషన్ సర్జరీ అంటారు. గతంలో ఓపెన్ సర్జరీ చేసే వారు. కానీ ఇప్పుడు లాప్రోస్కోపిక్ విధానంలో చేస్తున్నారు. సర్జరీలో భాగంగా యాసిడ్ పైకి రాకుండా కవాటం సరిచేయడం జరుగుతుంది. పొట్టలో పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది. ఆహార నాళంలో నెగెటివ్ ప్రెజర్ ఉంటుంది. నెగెటివ్ ప్రెజర్ మూలంగా వాల్ దిగిపోతూ ఉంటుంది. దీన్ని ఆపరేషన్ ద్వారా టైటెన్ చేయడం ద్వారా సమస్య తగ్గిపోయేలా చేయవచ్చు.

ఈ ఆపరేషన్‌లో కృత్రిమంగా ఏదీ పెట్టడం జరగదు. హెర్నియా ఉన్న వారికి మెష్ పెట్టినట్లుగా ఇందులో పెట్టడం ఉండదు. పేగు కట్ చేయడం లాంటిది ఉండదు. కాబట్టి ఎటువంటి సమస్యలూ తలెత్తవు. ఇన్‌ఫెక్షన్ లాంటి సమస్యలు రావు. ఈ సర్జరీతో ఛాతీలో మంట, తేన్పులు పూర్తిగా తగ్గిపోతాయి. సాధారణ జీవితం గడపొచ్చు. మందుల వల్ల కూడా ఎటువంటి దుష్పభావాలు ఉండవు. అయితే చిన్న వయసులో ఈ సమస్య వచ్చినపుడు ఆపరేషన్ ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీర్ఘకాలం మందులు వాడటం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి వారికి ఆపరేషన్ బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్చు

  • సమయానికి భోజనం చేయాలి.
  • మసాలా పదార్థాలు మానేయాలి.
  • కూల్‌డ్రింక్స్ తాగకూడదు. నూనె పదార్థాలు తీసుకోకూడదు.
  • కలరింగ్ ఏజెంట్స్ ఉపయోగించినవి వాడకూడదు.
  • ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి.
  • గబాగబా తినకుండా నెమ్మదిగా తినాలి.
  • తిన్న వెంటనే పడుకోకూడదు.
  • భోజనం చేసిన తరువాత తప్పనిసరిగా అరగంట పాటు నడవడం చేయాలి.
  • కడుపు నిండా తినకుండా కొంచెం ఖాళీ ఉండేలా తినాలి.
  • పొగ త్రాగడం, మద్యపానము పూర్తిగా మానేయాలి.
  • మందులు వాడుకుంటూ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఛాతీలో మంట, తేన్పుల సమస్య సమూలంగా తొలగిపోతుంది.