వైవిధ్య భరితమైన పది కథలతో వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు వెలువరించిన సంకలనం చందనపు బొమ్మ. ఆంధ్రజ్యోతి పత్రికలో జనవరి 2009 నుంచి అక్టోబరు 2011 వరకూ ప్రచురింబడిన కథలను ఇందులో సంకలనం చేశారు, కడపకి చెందిన రాష్ట్ర కథానిలయం వారు. వీరి తొలి ప్రచురణ ఇది. ఇందులో పది కథలు ఉన్నాయి.

  1. ఎవరికి తెలియని కథలివిలే (ఆదివారం ఆంధ్రజ్యోతి 2009 జనవరి 4)
  2. ఏకాంతంతో చివరిదాకా (నవ్య వారపత్రిక 2009 ఏప్రిల్ 29)
  3. వర్డ్ కాన్సర్ (పొద్దు మే 2009, వార్త ఆదివారం 2009)
  4. ఈ కానుకనివ్వలేను (ఈమాట జూన్ 2009)
  5. 24 / 7 క్రైం ఇప్పుడిదే సుప్రీం (ఆదివారం ఆంధ్రజ్యోతి 2009 జూన్ 21)
  6. చందనం బొమ్మ (ఆదివారం ఆంధ్రజ్యోతి 2010 జనవరి 24) [1]
  7. కరిగిపోయిన సైకత శిల్పం (ప్రాణహిత జూన్ 2010) [2]
  8. భ్రమణకాంక్ష (పాలపిట్ట మే 2010)
  9. ఒక బంధం కావాలి (ఆదివారం ఆంధ్రజ్యోతి మార్చి 2011)
  10. లోపలి ఖాళీలు (ఆదివారం ఆంధ్రజ్యోతి, 2012 అక్టోబరు 7)
పుస్తక ముఖచిత్రం

ఇందులో మొదట ప్రస్తావించాల్సిన కథ 'వర్డ్ కేన్సర్.' పేరులాగే, కథ కూడా వైవిధ్య భరితంగా ఉంది. పుస్తకము టైటిల్ కథ 'చందనపు బొమ్మ'కథ ఆరవది. చందనపు బొమ్మతో ఆడుకునే ఓ చిన్నపిల్ల కథ. ఇది చైల్డ్ సైకాలజీ ఆధారంగా అల్లిన ఈ కథ. పుస్తకాలకి సంబంధించిన మరో కథ 'కరిగిపోయిన సైకత శిల్పం.' పుస్తకాలనీ, వాటిని చదివే వాళ్ళనీ కూడా ఎంతగానో ప్రేమించే ఓ పుస్తకాల షాపు యజమాని కథ ఇది. కథ చదువుతున్నంత సేపూ నాకు తెలిసిన పుస్తకాల షాపుల యజమానులు అందరూ వరుసగా గుర్తొచ్చారు. కథలో ప్రధాన పాత్ర 'ఆచార్య' లో వాళ్ళంతా ఎక్కడో అక్కడ కనిపించారు కూడా.

ప్రయాణాలు అంటే నాకు ఉన్న ఇష్టం ఉన్నవారికి 'భ్రమణ కాంక్ష' కథ బాగా నచ్చుతుంది. ప్రదేశాలని కాక, ప్రపంచాన్ని చూడాలని కోరుకునే నవనీత రెడ్డి వెంటాడతాడు పాఠకులని. అంతే కాదు, 'మనసుంటే మార్గం ఉంటుంది' అన్న మాటా గుర్తొస్తుంది. 'ఒక బంధం కావాలి' 'లోపలి ఖాళీలు' కథలు రెండూ మనస్తత్వాన్ని ఆధారం చేసుకున్నవి. మొదటిది మానసికంగా ఎదగని ఓ కుర్రవాడి కారణంగా అతని తండ్రి జీవితంలో వచ్చిన మార్పుని చిత్రిస్తే, రెండోది తలచుకుంటే దేనినైనా సాధించే పట్టుదల ఉన్న విద్యావంతుడికి తన భార్య విషయంలో ఎదురైన సందిగ్ధాన్ని చర్చించింది.

పది కథల్లోనూ ఆరు కథలు జర్నలిజం నేపథ్యంతో నడుస్తాయి. పాత్రికేయ కోణం నుంచి ప్రపంచాన్ని చూసే ప్రయత్నంగా చెప్పొచ్చు వీటిని. తొలికథ 'ఎవరికి తెలియని కథలివిలే' లో ప్రధాన కథతో పాటు, తన వృత్తిలో ఇబ్బందులనీ సందర్భానుసారం ప్రస్తావించారు రచయిత్రి. ఓ రచయితకీ, ఓ మహిళా జర్నలిస్ట్ కీ ఏర్పడ్డ స్నేహం 'ఏకాంతంతో చివరిదాకా' కథ. "అనేకమైన వరాలిమ్మని దేవుణ్ణి కోరుకుంటాం. కానీ దేవుడినే కొరుకోం. ఆయనే వచ్చి అకస్మాత్తుగా ఇలాంటి ఆలోచనుందని చెప్పినా తట్టుకోలేం," లాంటి వెంటాడే వాక్యాలు చాలానే ఉన్నాయి ఈ కథల్లో.

మూడు నాలుగేళ్ల క్రితం వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు ఆధారం చేసుకుని రాసిన 'ఈ కానుక నేనివ్వలేను.' మృత్యువు నేపథ్యంగా సాగే కథ అవ్వడంతో ఆకర్షించింది నన్ను. అయితే, కాలపరీక్షకి ఎంతవరకూ నిలబడుతుంది అన్నది చూడాలి. ఈకథలో సంభాషణలు ఉపన్యాస ధోరణిలో ఉండడం కొరుకుడు పడదు. అలాగే, మొత్తం సంకలనం చదివాక, '24/7 క్రైమ్ ఇప్పుడిదే సుప్రీం' కథని రచయిత్రి ఇంకా చాలా బాగా రాయగలరు.

సూచికలు మార్చు