తెలంగాణ ఆహార సంస్థ

తెలంగాణ ప్రభుత్వ మాతాశిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక విభాగం.

తెలంగాణ ఆహార సంస్థ (ఆంగ్లం: Telangana Foods) అనేది తెలంగాణ ప్రభుత్వ మాతాశిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక విభాగం.[1] పాఠశాలకు, ప్రీ-స్కూల్ పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకోసం పౌష్టికాహారాన్ని తయారుచేయడం, సరఫరా చేయడం వంటి కార్యకలాపాలకోసం ఈ సంస్థ ఏర్పాటుచేయబడింది. ఇది హైదరాబాదు, నాచారంలోని ఐడీఏలో ఉంది.

తెలంగాణ ఆహార సంస్థ
తెలంగాణ ఆహార సంస్థ లోగో
ప్రభుత్వ సంస్థ అవలోకనం
స్థాపనం 2 జూన్ 2014; 9 సంవత్సరాల క్రితం (2014-06-02)
అధికార పరిధి తెలంగాణ
ప్రధాన కార్యాలయం నాచారం, హైదరాబాదు
Minister responsible సత్యవతి రాథోడ్, మాతాశిశు సంక్షేమ శాఖ మంత్రి
ప్రభుత్వ సంస్థ కార్యనిర్వాహకుడు/ మేడే రాజీవ్ సాగర్, (చైర్మన్)
వెబ్‌సైటు
అధికారిక వెబ్సైటు

ఏర్పాటు మార్చు

1971లో డైరెక్టర్ ఆఫ్ కేర్ ఇన్ ఇండియా/కేర్ అడ్మినిస్ట్రేటర్ అందించిన ప్రతిపాదనల ఆధారంగా 1971-72లో ప్రాథమిక పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన కార్యక్రమం కింద రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలను తయారు చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ 1971 సెప్టెంబరు 4న జారీచేసిన జీవో ఎంఎస్ నెంబరు 1419 ద్వారా ఈ సంస్థ ఏర్పాటుచేయబడింది.[2] 1987 ఆగస్టు 29వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ పోషకాహార మండలి సమావేశంలో ఈ సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్థ గా మార్చబడింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జీవో ఎంఎస్ నెంబరు 2 ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఆహార సంస్థ నుండి విడదీయబడి "తెలంగాణ ఆహార సంస్థ" ఏర్పడింది.

లక్ష్యాలు మార్చు

  • నాణ్యమైన ఫోర్టి ఫైడ్ బియ్యం ఉత్పత్తి చేయడం
  • పేద మహిళలు, పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించడం
  • ఐసిడిఎస్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలును సులభతరం చేయడం
  • ఆహార తయారీలో వైవిధ్యం, వాణిజ్యీకరణ కార్యక్రమాలను విస్తరించడం
  • అంతర్జాతీయ ఏజెన్సీల సహాయంతో ముడిపదార్థాల ప్రిప్రాసెసింగ్ & ఫుడ్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సృష్టించడం
  • ఆహారం, పోషకాహార సమస్యలు అవసరాల అధ్యయనం కోసం సంస్థలను ప్రోత్సహించడం

ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ మార్చు

ఆధునిక సాంకేతికతతో 18,404 అడుగుల స్థలంలో 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ ను 2022 డిసెంబరు 19న తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించింది. 1975లో నిర్మించిన పాత ప్లాంట్ సరిపోకపోవడంతో రానున్న భవిష్యత్ దృష్ట్యా ఏర్పాటుచేసిన ఈ నూతన ప్లాంట్ ద్వారా గంటకు 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగుతుంది. ఈ నూతన ప్లాంట్ ద్వారా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు పోషకాహారం అందించవచ్చు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.[3]

ఇతర వివరాలు మార్చు

2022 నాటికి సంస్థ ఉత్పత్తి చేసే బాలామృతం, బాలామృతం+, స్నాక్స్ వల్ల తెలంగాణలోని 33 జిల్లాల్లోని 35,699 అంగన్వాడీ సెంటర్ల ద్వారా దాదాపు 15.5 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ లోని 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 16.12 లక్షల మంది పోష్టికాహారం అందుకుంటున్నారు.

పరిపాలన మార్చు

2022 జూన్ 30న తెలంగాణ ఆహార సంస్థ చైర్మన్‌గా మేడే రాజీవ్‌ సాగర్‌ నియమించబడ్డాడు.[4][5]

మూలాలు మార్చు

  1. "Telangana State Foods". www.tfoods.telangana.gov.in. Archived from the original on 2018-12-07. Retrieved 2022-09-21.
  2. "About (Telangana State Foods)". www.tfoods.telangana.gov.in. Archived from the original on 2022-09-21. Retrieved 2022-09-21.
  3. telugu, NT News (2022-12-16). "Telangana Foods | ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్‌ట్రూడ‌ర్ ప్లాంట్ ప్రారంభం." www.ntnews.com. Archived from the original on 2022-12-19. Retrieved 2022-12-21.
  4. "అధికార భాషా సంఘం ఛైర్‌పర్సన్‌గా మంత్రి శ్రీదేవి". EENADU. 2022-07-01. Archived from the original on 2022-07-10. Retrieved 2022-09-21.
  5. Namasthe Telangana (30 June 2022). "తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌". www.ntnews.com. Archived from the original on 2022-06-30. Retrieved 2022-09-21.

బయటి లంకెలు మార్చు