పేదరికం

(దారిద్ర్యం నుండి దారిమార్పు చెందింది)

పేదరికం (Poverty) ఒక సామాజిక, ఆర్థిక సమస్య. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. పేదరికంతో బాధపడుతున్న వారిని పేదలు అంటారు.పేదరికమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ చెప్పారు.వివిధ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు చేరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

The percentage of the world's population living in extreme poverty has halved since 1981. The graph shows estimates and projections from the World Bank 1981–2009.

దారిద్య్ర రేఖకు దిగువనుండేవారు మార్చు

  • ఓ వ్యక్తి తీసుకునే పౌష్టికాహారం (కేలోరీలు) ఆధారంగా గతంలో దారిద్య్రానికి నిర్వచనం ఇచ్చారు. దాని ప్రకారం 2000 మార్చి ఒకటి నాటికి దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న వారు 27.5 శాతం.బీపీఎల్‌ కుటుంబాలు 6.5 కోట్లు
  • టెండూల్కర్‌ నివేదిక ప్రకారమైతే..ఆహారంతో పాటు విద్య, ఆరోగ్యంపై చేసే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దేశ మొత్తం జనాభాలో 37.2 శాతం మంది నిరుపేదలు. బీపీఎల్‌ కుటుంబాలు 8.1 కోట్లు.
  • ఆహార భద్రతా చట్టం ప్రకారం బీపీఎల్‌ కుటుంబానికి ప్రతినెలా కేజీ రూ.3 వంతున 25 కేజీల ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు.
  • నెలకు రూ.10వేల కన్నా తక్కువ ఆదాయం ఉండి, పెద్దగా భూమికాని, సొంతానికి వాహనం కాని లేని గ్రామీణులు

బీపీఎల్‌ జాబితాలోకి రానివారు మార్చు

  • ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం ద్వారా నెలకు రూ.10వేలు సంపాదిస్తూ, ఎక్కువ భమి, పండ్లతోటలున్నవారు
  • పాల పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, చేపలసాగు వంటివి చేపట్టిన వారు (పరిశ్రమస్థాయి, ఆదాయాన్ని బట్టి)
  • ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు (వాటిమీద బతుకుతెరువు ఆధారపడి ఉండకపోతే)
  • ట్రాక్టర్లు, నాటు యంత్రాల వంటి వ్యవసాయ యంత్రాలున్నవారు, చేపల పడవలున్నవారు
  • విద్యుత్‌, మంచినీటి కనెక్షన్‌ ఉన్నవారు
  • బీమా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉన్నవారు

రకాలు మార్చు

స్వభావాన్ని బట్టి పేదరికాన్ని సాపేక్ష, నిరపేక్ష పేదరికం అని విభజించవచ్చు.

సాపేక్ష పేదరికం

జనాభాను వివిధ ఆదాయ వర్గాలుగా విభజించి అత్యధిక ఆదాయం పొందే 5% నుంచి 10% ప్రజల జీవనస్థాయితో అతి తక్కువ ఆదాయం పొందే అట్టడుగు 5% నుంచి 10% ప్రజల స్థాయిని పోల్చి పేదరికాన్ని నిర్ణయిస్తారు. సాపేక్ష పేదరికం ద్వారా ఆర్థిక అసమానతలను లెక్కించవచ్చు.

నిరపేక్ష పేదరికం

ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగం నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను నిరపేక్ష పేదవారు అంటారు.

కారణాలు మార్చు

  1. తక్కువ తలసరి ఆదాయం
  2. అల్పోద్యోగిత
  3. నిరుద్యోగిత
  4. ప్రచ్ఛన్న నిరుద్యోగిత
  5. అధిక జనాభా
  6. వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ
  7. ఆర్థిక అసమానతలు
  8. వనరుల అల్ప వినియోగం
  9. అల్ప వేతనాలు
  10. శ్రామిక వర్గానికి వనరులపై యాజమాన్యం లేకపోవడం.

నివారణ చర్యలు మార్చు

1950 నుంచి 1970 వరకు భారత ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రత్యక్ష చర్యలు చేపట్టలేదు.ఆర్థికాభివృద్ధిని సాధిస్తే పేదరికం దానంతట అదే తగ్గుతుందనే సిద్ధాంతాన్ని నమ్మింది. 4వ ప్రణాళికలో భాగంగా పేదరికాన్ని తగ్గించడానికి ప్రత్యక్ష చర్యలు మొదలయ్యాయి. పేదరికం తీవ్రతను అంచనా వేసి గరీబీ హఠావో అనే నినాదాన్ని ప్రభుత్వం చేపట్టింది.

1973 నుంచీ అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టింది. 1972-73 లో మహారాష్ట్రలో ఉపాధి హామీ పథకం, 1973 లో క్షామపీడిత అభివృద్ధి కార్యక్రమం, 1974-75 లో చిన్నకారు రైతుల అభివృద్ధి ఏజన్సీ, ఆయకట్టు అభివృద్ధి పథకం. 1975లో ప్రధాని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది. 1977-78 లో ఎడారుల అభివృద్ధి పథకం, పనికి ఆహార పథకం, అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టారు. 1979లో గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి చర్యలు పెట్టారు. 2015 నాటికి 78 కోట్లకు పైగా (782 మిలియన్లు) భారతీయులు రోజుకు రెండు డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తారని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సంయుక్త నివేదిక వెల్లడించింది.చైనా తన పేదిరిక రేటును 60% నుంచి 16% తగ్గించిందని నివేదిక ప్రశంసించింది.

ఇవి కూడా చదవండి మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పేదరికం&oldid=3397548" నుండి వెలికితీశారు