దేశోద్ధారక గ్రంథమాల

దేశోద్ధారక గ్రంథమాల ఒక పుస్తక ప్రచురణ సంస్థ. దీనిని తెలంగాణా ప్రజా ఉద్యమనాయకుడు, కార్యకర్త అయిన వట్టికోట ఆళ్వారుస్వామి ప్రారంభించారు[1]. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు పేరు మీద ఈ ప్రచురణ సంస్థను 1938లో సికింద్రాబాద్ లో స్థాపించారు. [2]

ప్రచురణలు మార్చు

ఈ గ్రంథమాల 1938 నుంచి 1941 సంవత్సరాల మధ్యకాలంలో 12 పుస్తకాల వరకు ప్రచురించింది. తరువాత ఆర్థిక ఇబ్బందుల వలన ఈ ప్రచురణ సంస్థ సవ్యంగా నడవలేదు. ఈ గ్రంథమాల తొలిపుస్తకంగా సురవరం ప్రతాపరెడ్డి రచించిన హైందవ ధర్మలీలను ప్రచురించాడు. ఈ గ్రంథానికి తన మిత్రుడు మల్లంపల్లి సోమశేఖర శర్మచే పీఠిక రాయించాడు.[1] కాళోజి నారాయణ రచించిన నా గొడవ మొదట ఈ గ్రంథమాల ప్రచురించింది. వానమామలై వరదాచారి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఖండవల్లి బాలేందు శేఖరం వంటివారి పుస్తకాలను ఈ సంస్థ ప్రచురించింది. ఎక్కువగా రాజకీయ సాహిత్య సాంస్కృతిక విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను, పాశ్చాత్య రచయత టాల్ స్టాయ్ రచనల అనువాదాలను ఈ సంస్థ ప్రచురించింది. విజ్ఞానానికి విలువకట్టని సమాజం పురోభివృద్ధి చెందదని అందుకు అనువైన గ్రంథాలని ప్రచురించి చౌకగా పుస్తకాలందించాలనే ఉద్దేశముతో ఈ ప్రచురణ సంస్థని ఆరంభించారు. ఈ గ్రంథమాల ప్రచురణ సంస్థ మొత్తం మీద 35 పుస్తకాలు ప్రచురించింది.

2014వ సంవత్సరం వట్టికోట శతజయంతి సందర్భంగా హైదరాబాద్ పుస్తక మహోత్సవ ప్రాంగణానికి ఆళ్వారుస్వామి పేరు పెట్టి ప్రచురణ రంగం స్మరించుకుంది.[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 నాగయ్య, కట్టా (October 2010). "తెలంగాణా గ్రంథాలయోద్యమ దీప్తి వట్టికోట ఆళ్వారు స్వామి". గ్రంధాలయ సర్వస్వము. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ. 71 (7): 7–8
  2. 2.0 2.1 శారద, రావి (October 2017). "దేశోద్దారక గ్రంథమాల". గ్రంధాలయ సర్వస్వము. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ. 78 (6): 17–18.