నాగావళి నుంచి మంజీర వరకు


నాగావళి నుండి మంజీర వరకు ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు ఆత్మకథ[1]

నాగావళి నుంచి మంజీర వరకు
ముఖచిత్రం
కృతికర్త: రావి కొండలరావు
అంకితం: బాపు రమణ
ముఖచిత్ర కళాకారుడు: పెమ్మరాజు రవికిషోర్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: ఆర్కే బుక్స్, హైదరాబాదు
విడుదల: ఫిబ్రవరి 2015

పుస్తక విశేషాలు

మార్చు

రావి కొండలరావు ఇప్పటికి చాలా పుస్తకాలే రాశారు. ఇది మరొకటి. కాని పెద్దవాళ్లలో ఉండే విశేషం ఏమంటే వాళ్ల దగ్గర ఎంత జీవితం ఉంటుందో అన్ని జ్ఞాపకాలుంటాయి. పదహారేళ్ల వయసులో మద్రాసు పారిపోయిన వ్యక్తి దాదాపు 60-70 ఏళ్లు ఆ రంగంతో పెనవేసుకుపోతే జ్ఞాపకాలకేం కొదువ? అయితే ఈ పుస్తకం కొంచెం ఆత్మకథ వరుసలో సాగింది. ‘నాగావళి నుంచి మంజీర వరకు’ అనడంలో ఆ వరుస కనిపిస్తుంది. కళింగాంధ్ర నాగావళి తీరం నుంచి తెలంగాణ మంజీర తీరం వరకూ తన ప్రస్థానంలో తారసపడిన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. చేయి తిరిగిన కలం కనుక చకచకా నడిపించుకొని పోతుంది.

దీనిని బాపు రమణల ప్రోత్సాహంతో దర్శకత్వశాఖ నుండి నటుడిగా మారడం, సినీ అవకాశాల కోసం నాటక ప్రదర్శనల్లో పాల్గొనడం, విజయచిత్ర సహాయ సంపాదకుడిగా ప్రస్థానం, నటి రాధాకుమారితో జీవన సాహచర్యం మొదలైన విశేషాలన్నీ క్లుప్తంగా రాశారు. పుస్తకంలో మెరుపులూ, చమక్కులూ కథనాన్ని ఆసక్తికరంగా తయారుచేశాయి. దాదాపు ప్రతి సందర్భంలోనూ నేలవిడిచి సాము చెయ్యని కొండలరావు నిరాడంబరత ఆయన సహజధోరణిగా కనబడుతుంది. తెలుగు సినీ మాయాలోకంలో ఓడలు బండ్లూ, బండ్లు ఓడలూ అయిన సంఘటనలను ప్రత్యక్షసాక్షిగా వివరించడం పాఠకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఛాయాచిత్రాలను సందర్భానుసారంగా అందించడం, విశేషాలను బాక్సులుగా ఇవ్వడం పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ.

ఈ పుస్తకం చదివితే అర్థమయ్యేదేమంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. వినయం ఉంటే అవకాశం లభిస్తుంది అని. ఈ రెంటినీ రెండు చేతులు చేసుకొని పెద్దల ప్రోత్సాహం, ఆశీర్వాదంతో జీవితాన్ని ఈదేశారు రావి కొండలరావు. రేలంగి, పింగళి, చక్రపాణి, పెండ్యాల, మల్లాది, బాపు, రమణ... ఎందరు పెద్దలవో జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయి. ఇంతకు మించిన అనుభవాలు ఉన్నవారు ఉండొచ్చు. వారు రాయరు. రాసే అదృష్టం రావి కొండలరావుకు దక్కింది. పాఠకులకు ఈ అనుభవఫలం సంప్రాప్తమయ్యింది.

మూలాలు

మార్చు
  1. "ఓడలు బళ్లు అవుతాయి." andhrajyothy.com. 2015-02-16.{{cite web}}: CS1 maint: url-status (link)