నాణెం

(నాణేలు నుండి దారిమార్పు చెందింది)

నాణెం అనగా ఏదైనా ఒక లోహంతో చేసిన గుండ్రటి లేదా బహుభుజి ఆకారంలో గల బిళ్ళ. వీటిని సమాజంలో ద్రవ్యంగానూ, ముద్రికలగానూ ఉపయోగించడం పరిపాటి.

సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మ చూడవచ్చును. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది.
850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై వరాహ బొమ్మ (విష్ణు అవతారం).

చరిత్ర మార్చు

భారతదేశంలో మార్చు

క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం[1]. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీ.పూ 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని పి ఎల్ గుప్తాతో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. సా.శ. ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే పాణిని తన అష్టాధ్యాయి గ్రంథంలో నాణేల ప్రస్తావన తెచ్చాడు. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వాడైన కౌటిల్యుడు అర్థశాస్త్రంలో దొంగనాణేలను గురించి, సీసం గనుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి దేశంలో పంచ్‌మార్క్‌డ్ నాణేలు నాల్గవ శతాబ్దానికే చెలామణీలో ఉన్నట్టే. లేదంటే కొంచెం ముందు నుంచి ఉండవచ్చు. ఇది అందరూ అంగీకరిస్తున్న చారిత్రక సత్యం.అయితే ఎవరు విడుదల చేశారో చెప్పడానికి ఆధారాలు లేవు. మన కృష్ణాజిల్లా సింగవరంలో లభ్యమైన వెండి నాణేల పరిస్థితి కూడా ఇదే.[2] నాణేలు చరిత్రకు అద్దంపట్టే సాక్ష్యాలు. పల్లవుల పరిపాలనా దక్షత, చోళుల వైభవం, నవాబుల విలాసం, కృష్ణదేవరాయల కీర్తి, ఆంగ్లేయుల రాజభక్తిని చాటేవి నాణేలే. స్వాతంత్య్రానంతరం కూడా వీటి ప్రాధాన్యం తగ్గలేదు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నేతలు, ఘటనలు, విప్లవాలను నాణేలుగా తీసుకువచ్చింది. స్మృతికీ, పంపిణీకి వేర్వేరుగా ముద్రించడం ప్రారంభించింది.

కుషాణుల రాజు వాసుదేవుడు ముద్రించిన నాణెం మార్చు

సా.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో తజికిస్తాన్ నుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరీవాహక ప్రాంతమంతా పాలింఛిన వారు కుషాణులు. ఈ సామ్రాజ్యం పాలకులు మొదట యూజీ అనే ఇండో-యూరోపియన్ తెగకు చెందిన పశ్చిమచైనా ప్రాంతంవారు.

కుషాణుల రాజు, కనిష్క వంశపు సామ్రాజ్యాధి పతులలో చివరి ప్రభువు ఆయిన వాసుదేవుడు (సా.శ. 202-233) ముద్రించిన నాణెం.నాణేనికి ఒక వైపున తన బొమ్మను శూలం ధరించిన రూపులో వేయించాడు. మరో వైపున "ఓషొ" అనే దేవత బొమ్మను వేయించాడు. ఇతని పేరును బట్టియే అతడు పూర్తిగా భారతీకరణకు లోనైనట్టు గమనించగలము.

నాణేల్లో నిలిచిన మహనీయులు మార్చు

  • మహాత్మాగాంధీ 1969లో జాతిపిత మహాత్మాగాంధీ శతజయంత్యుత్సవాల సందర్భంగా 20 పైసలు, 50 పైసలు, రూ.1, రూ.10 నాణేలు వెలువరించారు. రూ.10 నాణెం విడుదలజేయడం అదే ప్రథమం. అత్యధిక విలువున్న రూ.5, రూ.10 రూపాయలకూ నాణెం ముద్రించేందుకు వీలుగా సంబంధిత చట్టానికి (కాయిన్స్ యాక్ట్) ప్రత్యేక సవరణ కూడా తీసుకువచ్చారు.
  • జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్రానంతరం తొలిసారి 1964లో కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక నాణెం ముద్రించింది. జవహర్‌లాల్ నెహ్రూ మరణం తర్వాత ఆయన స్మృత్యర్థం దీన్ని ముద్రించారు. 50 పైసలు, రూ.1 నాణెంపై ఆయన ముఖచిత్రం వేశారు.
  • తిరువళ్లువర్

తమిళవేదం 'తిరుక్కురళ్' ప్రదాత తిరువళ్ళువర్. సుమారు రెండువేల సంవత్సరాలుగా తమిళుల జీవితంలో కలగలిసిపోయింది కురళ్. ద్రవిడ పార్టీల నేతలు తిరువళ్ళువర్‌కు పెద్దపీటవేశారు. కరుణానిధి ముఖ్యమంత్రికాగానే బస్సుల్లో కురళ్ సూక్తులు రాయించారు. 1969లో రాష్ట్ర ప్రభుత్వం 'తిరువళ్ళువర్ డే' అనే సెలవుదినం ప్రకటించింది. 1995లో జరిగిన తంజావూరు ప్రపంచ తమిళ సభల్లో తిరువళ్ళువర్ ముద్రతో రూ.5 నాణేన్ని కేంద్ర ప్రభుత్వం వెలువరించింది.

దక్షిణాది గాంధీగా పేరుపొందిన కామరాజర్ పాలన నిరుపేదలకు ఓ స్వర్ణయుగంగా నేటికీ నిలిచిపోయింది. తమిళనాట పారిశ్రామికాభివృద్ధికి బీజం వేసింది, మధ్యాహ్న భోజన పథకం తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న ఘనత ఆయనదే. ఐఐటీ వంటి సంస్థలు మద్రాసులో అడుగుపెట్టడం వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. 1976లో ఆయనకు అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' లభించింది. 2004 అక్టోబరు 27న ప్రధాని మన్మోహన్ సింగ్ కామరాజు ముఖంతో రూ.5 సేకరణ నాణెం, రూ.100 కరెన్సీ విడుదలజేశారు.

అన్నార్తుల బాధలను తన తమిళ గళంతో వినిపించారు అన్నాదురై. తన కలంలో ఒలికించారు. పేదల బాధలు కడతేరాలంటే ఉద్యమ స్ఫూర్తి ఎన్నికల్లోకి ప్రవేశించాలని భావించి డీఎంకే స్థాపించారు. ఆయన మృతిచెందిన ఏడాది తర్వాత రూ.0.15 పైసల తపాలా బిళ్ల విడుదలజేశారు. అన్నా శతజయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా రూ.5 నాణేన్ని విడుదలజేశారు.

ఇతర దేశాల్లో మార్చు

 
ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం
 
మౌర్యుల కాలం నాటి నాణేలపై ఏనుగు, సూర్యుని బొమ్మ.

భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలుగ్రీస్, చైనా, రోమ్, మొదలైనవి. గ్రీకులు, చైనీయులు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దంలో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రోమన్లు, పర్షియన్లు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో నాణేలను చెలామణీలోకి తెచ్చారని కూడా నిర్దిష్టమైన ఆధారాలు ఉణ్ణాయి. అయితే భారతదేశ నాణేల చరిత్రకు ఇలాంటి విస్పష్టమైన ఆధారలేమీ లేవు. ఇక్కడ నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయనే సంగతి ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది.

నాణేల మీద పుంఖానువుంఖాలుగా ముద్రలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేర్వేరు రాజులవని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే నాణేం మీద గుర్తు మారినంత మాత్రాన పాలకుడు మారిపోయాడని చెప్పలేమని చరిత్రకారులు చెబుతున్నారు. జనపదాలలో స్థానిక పాలకుల నాణేలతో పాటు, సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కూడా బయల్పడినాయి. ఆంధ్రజనపదమే ఇందుకు గొప్ప ఉదాహరణ. అమరావతిలో దొరికిన 7668 నాణేలలో కనిపించిన రకాలు దేశంలో ఇంకెక్కడా కనిపించలేదు. ఈ వెండి పంచ్‌మార్క్‌డ్ నాణేలలో 235 రకాలను కనుగొన్నారు. ఇందులో 48 రకాలు మరెక్కడా బయల్పడలేదు. పి ఎల్ గుప్తాయే వీటి గురించి పరిశోధించారు. పరిష్కారమైన సమస్యల కంటే పరిష్కారం కాని ప్రశ్నలే ఇందులో ఎక్కువ. మరో లోపం - నాణేలను ఇంతకాలం భూగర్భంలో దాచిపెట్టిన కుండలు కాలాన్ని చెప్పగలవు. కానీ ఆ ప్రయత్నం కూడా చాలాసార్లు విఫలమైంది. ఆ కుండలు మిగలడం లేదు. ఇందుకు బీహార్‌లో పైలా అనే చోట దొరికిన నిధి మాత్రమే మినహాయింపు. అక్కడ దొరికిన నాణేల కాలాన్ని శాస్త్రీయ పద్థతిలో నిర్థారించగలిగారు. కాని ఎక్కువ చోట్ల అది సాధ్యం కావడం లేదు. దాంతో శాస్త్రీయ పద్ధతులతో అవకాశాన్ని అలా జారవిడుచుకోవలసి వస్తున్నది. నాణేలలో కార్బన్ ఉంటుందా, కార్బన్ పరీక్ష జరిపి కాలాన్ని నిర్ధారించవచ్చా? అంటే ఈ అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి.

ఎందుకంటే ఒకసారి కార్బన్ పరీక్ష్ జరపాలంటే ఒక మిల్లీగ్రాము పదార్ధమైనా కావాలి. అంటే కొన్ని నాణేలనైనా త్యాగం చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి ఎవరూ సాహసించడం లేదు. నాణేల కాలం తెలియవచ్చేమో కాని నాణేలు మాత్రం కరిగిపోతాయి. కాబట్టే భారతదేశంలో నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయో ఇప్పటికీ చిక్కువీడని ప్రశ్నేగానే ఉండిపోయింది.

భారతదేశంలో గతంలోని , చలామణిలో ఉన్న నాణేలు మార్చు

రూ.10 నాణేల చెల్లుబాటు మార్చు

దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఆర్‌బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి 2022 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభలో వెల్లడించారు.[3]

హాబీ మార్చు

వివిధ కాలాలకు చెందిన వివిధ రకాలైన నాణేలను సేకరించడం కొంతమందికి అభిరుచి. పైగా ఇది పెట్టుబడి సాధనం కూడా.[4]

మూలాలు మార్చు

  1. Coins of Ancient India, A. Cunningham, 1891, Asian Educational Services, New Delhi, 2000; ISBN 81-206-0606-X
  2. http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/naaNela_charitra.htm
  3. "10 rupee coin: రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయి". EENADU. Retrieved 2022-02-10.
  4. "పాత నాణెం.. బంగారం!". Sakshi. 2021-11-01. Retrieved 2022-02-10.
"https://te.wikipedia.org/w/index.php?title=నాణెం&oldid=4077046" నుండి వెలికితీశారు