పంచమహా యజ్ఞములు

మానవుని జీవితంలో ఉండే  బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే నాలుగు ఆశ్రమములు కలవు. ఈ నాలుగింటిలో ముఖ్యమయినది, మిగిలిన మూడు ఆశ్రమములకు ఆధారమయినది గృహస్థ ఆశ్రమం. అయితే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞములు చేస్తేనే వారికి పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది.ఈ యజ్ఞములు ఐదు రకములు. అవి బ్రహ్మ యజ్ఞము, దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, నృయజ్ఞము.

యజ్ఞం

వివరణ సవరించు

పంచ మహాయజ్ఞములు అనగా హిందూ ధర్మశాస్త్రాలననుసరించి గృహస్థు ఆచరించవలసిన ఐదు యజ్ఞములు.[1]

  1. బ్రహ్మ యజ్ఞము : ఈ యజ్ఞము ద్వారా గృహస్తుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్తుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. బ్రహ్మ యజ్ఞమనగా వేదాధ్యయనము. రామాయణ, భాగవతాద్యుద్గ్రంథములను పఠించడం.
  2. దేవ యజ్ఞము : ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్తులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది.  దేవ యజ్ఞమనగా ఆజ్యము, లాజలు (పేలాలు) వంటితో హోమం జరిపించుట
  3. పితృ యజ్ఞము : ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు.  ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి  యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు. పితృ యజ్ఞమనగా శ్రాద్ధము, తర్పణములు మొదలైన కార్యక్రమాలు జరిపి పూర్వీకులను సంతృప్తి పరుచుట.
  4. భూత యజ్ఞము : తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి. భూత యజ్ఞమనగా సకల భూతములకు బలిదానములు ఇచ్చుట
  5. నృయజ్ఞము : ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి.  ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు. నృయజ్ఞమనగా అతిథి పూజాదులు నిర్వర్తించడం.


మూలాలు సవరించు

  1. మొవ్వ, శ్రీనివాస పెరుమాళ్ళు. ఆచార్య పురుషుల చరిత్ర. తిరుమల తిరుపతి దేవస్థానములు. pp. 20–21. Archived from the original on 2019-01-11. Retrieved 2018-12-24.