పాండురాజు

మహాభారతంలో పాత్ర

పాండురాజు వ్యాసుని మూలముగా విచిత్రవీర్యునికి, అతని రెండవ భార్య అంబాలికకు కలిగిన సంతానము.

పుట్టుక మార్చు

విచిత్రవీర్యుని మరణం తరువాత అతని తల్లి సత్యవతి తన మొదటి సంతానం అయిన ఋషి వేద వ్యాసుని పిలిచింది. వ్యాసుడు తన తల్లి అభీష్తం మేరకు విచిత్రవీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగించుటకు ఒప్పుకొనెను. విచిత్రవీర్యుని మొదటి భార్య అంబికకు వ్యాసుని చూచి కళ్లు మూసుకొనుటచే పుట్టు గుడ్డి అయిన ధృతరాష్ట్రుడు జన్మించెను. సత్యవతి విచిత్రవీర్యుని రెండవ భార్య అంబాలికకు కళ్లు మూసుకొనవలదని చెప్పెను. అంబాలిక వ్యాసుని చూచి భయంతో కంపించుట వల్ల కళ లేని తెల్లని పుత్రుడు పాండు జన్మించెను.

జీవితం మార్చు

పాండురాజు గొప్ప విలుకాడు. ఇతను దృతరాష్ట్రుని కొరకు సైన్యానికి అధిపతియై రాజ్యాన్ని పాలించుచుండెను. పాండురాజు కాశి, అంగ, వంగ, కళింగ, మగధ మొదలగు రాజ్యాలను జయించెను. ఆ విధంగా అందరు రాజులపై తమ ఆధిపత్యాన్ని చెలాయించెను.

పాండురాజు కుంతి భోజుని కుమార్తె కుంతిని, మాద్ర దేశపు రాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకొనెను. ఒకనాడు అడవిలో వేటాడుతూ లేడి రూపంలో సంభోగించుచున్న ఒక ఋషిని తన బాణంతో కొట్టెను. ఆ ఋషి పాండురాజుని తన భార్యతో సంభోగించ ప్రయత్నించిన మరణించెదవని శపించెను. దానితో విరక్తి కలిగిన పాండురాజు రాజ్యాన్ని విడచి తన భార్యలతో కలిసి అడవిలో నివసించుచుండెను.

కుంతి తనకు దూర్వాసుని వలన కలిగిన వరమును ఉపయోగించి యముని వలన యధిష్టురుడు, వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు లను పుత్రులుగా పొందెను. కుంతి తనకు వరము వలన తెలిసిన మంత్రమును మాద్రికి ఉపదేశించెను. మాద్రి ఆ మంత్రమును ఉపయోగించి అశ్విని దేవతల వలన నకులుడు, సహదేవుడు అను కవలలను పుత్రులుగా పొందెను.

ఆ విధంగా కుంతికి పాండురాజుతో వివాహముకు మునుపు సూర్యుని వలన కర్ణుడు జన్మించెను.

మరణం మార్చు

ఒకరోజు కుంతి, కుమారులు లేని సమయమున పాండురాజు మాద్రిని చూసి ఆకర్షితుడై తాకెను. ఆ విధంగా తనకుగల శాపం మూలంగా మరణించెను. మాద్రి పాండురాజు చితిపై కూర్చుని సతీసహగమనం చేసెను. కుంతి పాండవులని రక్షించుటకు బ్రతికి ఉండెను.

మూలాలు మార్చు