బెంగాల్ వాలంటీర్లు

బెంగాల్ వాలంటీర్లు ఇది భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక రహస్య విప్లవ దళం. 1928లో ప్రారంభమైనప్పటి నుండి భారతదేశ స్వాతంత్ర్యం వచ్చే వరకు బెంగాల్ వాలంటీర్స్ కార్ప్స్ స్వాతంత్ర్యోద్యమంలో విధులు నిర్వర్తించింది.[1] -

ప్రారంభం మార్చు

1928లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కోల్‌కతా సెషన్‌లో సుభాష్ చంద్రబోస్ వాలంటీర్ల బృందాన్ని నిర్వహించారు. ఈ బృందానికి బెంగాల్ వాలంటీర్స్ కార్ప్స్ అని పేరు పెట్టారు. దీనికి మేజర్ సత్య గుప్తా నాయకత్వం వహించారు. సుభాష్ చంద్రబోస్ స్వయంగా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా వ్యవహరించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కోల్‌కతా సెషన్‌ ముగిసిన తర్వాత కూడా బెంగాల్ వాలంటీర్లు తమ కార్యకలాపాలను కొనసాగించారు. అనతికాలంలోనే క్రియాశీల విప్లవ సంఘంగా మారిపోయింది.

ప్రముఖ సభ్యులు, కార్యకలాపాలు మార్చు

1930ల ప్రారంభంలో వివిధ జైళ్లలో భారతీయులపై పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా బెంగాల్ వాలంటీర్లు 'ఆపరేషన్ ఫ్రీడమ్' ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లోమన్‌ను బెంగాల్ వాలంటీర్స్ కార్ప్స్ చంపడానికి ప్రణాళిక వేసింది. ఢాకాలోని మెడికల్ స్కూల్ హాస్పిటల్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఓ సీనియర్ పోలీసు అధికారిని పరామర్శించడానికి లోమన్‌ చేరుకున్నాడు. ఈ సందర్భంలో 29 ఆగస్టు 1930న, మెడికల్ స్కూల్ విద్యార్థి బినయ్ బసు, సాంప్రదాయ బెంగాలీ దుస్తులు ధరించి, భద్రతను ఉల్లంఘించి, దగ్గరి నుండి కాల్పులు జరిపాడు. లోమన్ అక్కడక్కడే మరణించాడు. హాడ్సన్, పోలీసు సూపరింటెండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. బినయ్ బసు అక్కడ నుంచి తప్పించుకుని కోల్‌కతాకు పారిపోయాడు.

తదుపరి లక్ష్యం జైళ్లలోని ఖైదీలను క్రూరంగా అణచివేస్తున్న ఇన్స్పెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్.ఎస్ సింప్సన్. బెంగాల్ వాలంటీర్స్ అతడిని చంపడమే కాదు, కోల్‌కతాలోని డల్‌హౌసీ స్క్వేర్‌లోని రైటర్స్ బిల్డింగ్ - సెక్రటేరియట్ బిల్డింగ్‌పై దాడి చేయడం ద్వారా బ్రిటిష్ అధికారిక వర్గాలలో భీభత్సం సృష్టించాలని కూడా నిర్ణయించుకున్నారు. 8 డిసెంబర్ 1930న బినయ్ బసు.. దినేష్ గుప్తా, బాదల్ గుప్తాలతో కలసి యూరోపియన్ దుస్తులలో రైటర్స్ భవనంలోకి ప్రవేశించి సింప్సన్‌ను కాల్చి చంపారు. వెంటనే బ్రిటిష్ పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఆ ముగ్గురు యువ విప్లవకారులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ట్విన్నమ్, ప్రెంటిస్, నెల్సన్‌తో సహా మరికొందరు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఎట్టకేలకు పోలీసులు వారిని అధిగమించారు. అయితే, ఆ ముగ్గురికి బ్రిటీష్  అధికారులకు లొంగిపోవడం ఇష్టంలేదు. బాదల్ గుప్తా పొటాషియం సైనైడ్ తీసుకున్నాడు, బినయ్ బసు, దినేష్ గుప్తా తమ సొంత రివాల్వర్‌లతో కాల్చుకున్నారు. బాదల్ అక్కడికక్కడే మరణించాడు. బినయ్‌ను ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను తన గాయాన్ని పదేపదే వేలితో పొడుచుకుని ఇన్ఫెక్షన్ చేరడంతో 13 డిసెంబర్ 1930న మరణించాడు. దినేష్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా దోషిగా నిర్ధారించబడ్డాడు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు, హత్యలకు గాను ఉరిశిక్ష విధించడంతో మరణించాడు. ఇలా బెంగాల్ వాలంటీర్ల సభ్యులు బ్రిటిషు పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు చురుకుగా పాల్గొన్నారు.

మూలాలు మార్చు

  1. "Bengal Volunteers , Indian Revolutionary Organisation". IndiaNetzone.com. Retrieved 2021-09-26.