మథుర

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం
జిల్లా (లు) మథుర జిల్లా
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 281 XXX
• +91(565)
• UP-85
వెబ్‌సైటు: mathura.nic.in/

మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ఆగ్రాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీకి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీనకాలంలో ఇది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. పాత కాలంలో ఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం. ఈ నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది. శ్రీకృష్ణుని మేనమామచే పాలించబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని.

మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ప్రాచీన రెండు నగరాలలో ఒకటి. రెండవ నగరం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గాంధారం. రెండు నగరాలలో ఒకటిగానే సా.శ. మొదటి శతాబ్దంలో బుద్ధిని శిలలు చెక్కడం ఆరంభించినట్లు అంచనా. గాంధారం తయారైన శిలలు ఇండో గ్రీకు సిల్ప శైలిలోనూ మధురలో తయారైన సిలలు హిందూ దేవతల శిల్ప శైలిలోనూ ఉన్నాయి.

షెర్లాక్ హోమ్స్ రచించిన ది సైన్ ఆఫ్ ఫోర్ నవలలో మథురా నగర వర్ణన ఉంది.

చరిత్ర మార్చు

మథురకు పురాణ కాలంనుండి చరిత్ర ఉంది. మథురా నగరం రామాయణ మహాకావ్యంలో వర్ణించబడింది. ఇక్ష్వాకు రాజకుమారుడూ, దశరథ చక్రవర్తి కుమారుడూ, రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుని సంహరించినట్లు పురాణ కథనం. తరువాత ఆ దట్టమైన అరణ్యప్రదేశం మధువనంగానూ, మథుపురంగానూ, మథురగానూ నామాంతరం చెందినట్లు పురాణ కథనం. నిశిత పరిశోధనలు లవణాసురుడు శివభక్తుడూ శివునినుండి త్రిశూలాన్ని వరంగా పొందిన మధువు సంతతివాడనీ ఆకారణంగా ఈ నగరానికి మథుర అనే పేరు వచ్చినట్లు చెప్తున్నాయి. యాదవరాజైన మథు పేరుమీద ఈ నగరానికి ఈ పేరు వచ్చినట్లూ పురాణాల కథనం. ఇలా ఈ నగర పేరుకి సంబంధించి పలు కారణాలు పురాణాలలో ప్రస్తావించబడినాయి.

సా.శ.పూ 6 వశతాబ్దంలో శూరసేనుని సామ్రాజ్యానికి మథుర రాజధానిగా ఉండేది. సా.శ.పూ 4 నుండి 2 వ శతాబ్దం వరకు ఈ నగరం మౌర్యుల పాలనలో ఉంది. సా.శ.పూ 2వ శతాబ్దంలో శుంగ సామ్రాజ్యంలో ఈ నగరం భాగమైంది. సా.శ.పూ 180నుండి 100 మధ్య ఈ నగరం ఇండో-గ్రీక్ స్వాధీనంలో ఉన్నట్లు అంచనా. ఆర్కియాలజిస్టులు ఆధారాలను అనుసరించి రచయిత బౌకర్ రచనల ఆధారంగా సా.శ.పూ 100 నుండి ఇక్కడ అధికంగా జైన మతస్థులు నివసించినట్లు విశ్వసిస్తున్నారు. మథుర కళా శైలి, సంస్కృతి కుషాణుల పరిపాలనలో బౌద్ధమతంతో ప్రభావితమైయ్యాయి. మథుర వారి రాజధానులలో ఒకటి. రెండవది పెషావర్ (పురుషపుర్). వాసుదేవ్ మినహాయించి కుషాలుల రాజులు కడ్ఫిసెస్, హువిష్క, వాసుదేవ్. కుషాణులందరూ బౌద్ధ మతావలంబీకులు. సా.శ.పూ 3 వశతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు మెగస్తనీస్ రచనలలో మథురానగర ప్రస్తావన ఉంది. ఆయన మథురా నగరాన్ని మెథొరాగా పేర్కొన్నాడు.

సా.శ.పూ 1నుండి 3 వ శతాబ్దం వరకు మథుర కుషాణుల సామ్రాజ్య రాజధానులలో ఒకటిగా ఉంది. మథుర మ్యూజియం (పురాతన వస్తు ప్రదర్శనశాల) లో ఆసియాలోనే అధికంగా ఎర్రరాతి శిల్పాలు ఉన్నాయి. వీటిలో అధికంగా బుద్ధిని శిలారూపాలు చోటు చేసుకున్నాయి.

గజనీ మహమ్మద్ మథురా నగరాన్ని స్వాధీనపరచుకున్న తరువాత నగరంలోని అనేక ఆలయాలు పడగొట్టబడ్డాయి. 1018లో ఈ నగరంలోని ఆలయాలు సికిందర్ పరిపాలనలో మరికొంత విధ్వంసాన్ని చవిచూసాయి. ఔరంగజేబు పరిపాలనలో కేశవ్‌దేవ్ ఆలయంలోని కొంతభాగం విధ్వంసం అయింది. ఔరంగజేబు చక్రవర్తి అదే ప్రదేశంలో జామీ మసీద్ (శుక్రవార మసీదు) నిర్మించాడు. ఆలయంలోని అనేక రాళ్ళను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు అంచనా. ముఘల్ చక్రవర్తుల నుండి భరత్‌పూర్ రాజుల వశమై చివరకు మరాఠీయుల స్వంతమైంది. ప్రస్తుత కృష్ణుని ఆలయం 1815 లో గోకుల్దాస్ పరీఖ్ చే నిర్మించబడింది. దీనిని ఇప్పుడు ద్వారకేశ్ ఆలయంగా పిలుస్తున్నారు.

సాహిత్యంలో మధుర మార్చు

మధుడు అనే రాక్షసుడు మధురను పరిపాలించాడు. అతను గొప్ప శివభక్తుడు, శివుణ్ణి ప్రార్థించి భయంకరమైన అజేయమైన త్రిశూలాన్ని పొందాడు. మధువుకు రావణుడు స్వయానా బావమరిది అవుతాడు. ఈ ప్రాంతానికి అతని వల్లనే మధువనము, మధుపురి, మధుర, మథుర అనే పేర్లు వచ్చాయి. మధుని మరణానంతరం శూలం పారంపర్యంగా లవణుడు పొందాడు. దానితో మునులను, ప్రజలను హింసించడం ప్రారంభించగా, ప్రజలు చ్యవనమహర్షికి, ఆయన రామచంద్రునికి మొరపెట్టుకున్నారు. రాముడు అప్పటికే రావణాసుర సంహారం, వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్నాడు. రాముడు లవణాసురునిపై యుద్ధానికి తమ్ముడు శత్రుఘ్నుని పంపుతాడు. శూలం లేనప్పుడు లవణాసురుని చంపి మధురను శత్రుఘ్నుడు వశం చేసుకున్నాడు. శత్రుఘ్నుని అనంతరం ఆయన కొడుకు శూరసేనుడు, పరంపరాగతంగా వారి వారసులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు.[1] శత్రుఘ్నుని కొడుకు శూరసేనుని పేరుమీదుగానే ఈ ప్రాంతానికి శూరసేన దేశమనే పేరు వచ్చిందని డా.వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్యశాస్త్రి భావించారు.[2]

పురాణాల్లో మధుర మార్చు

పురాణాల ప్రకారం చంద్రవంశానికి చెందిన రాజు పురూరవుడు, అప్సరస ఊర్వశిల పుత్రుడైన ఆయువు యమునాతీరంలో మథురానగరాన్ని నిర్మించాడని కథ ఉంది.[2]

భారత భాగవతాల్లో మధుర మార్చు

మహాభారత, భాగవతాల్లో శూరసేన దేశం ప్రసక్తి పలుమార్లు కనిపిస్తుంది. ఆ శూరసేన దేశానికి మథుర రాజధాని. మహాభారతగాథకు కేంద్రబిందువైన కురుభూములకు ఈ శూరసేన దేశం దక్షిణంగా ఉంటుంది. శత్రుఘ్నుని వంశీకుల తర్వాత యదువంశీకుల అధీనంలోకి వచ్చింది. మధురను నిర్మించినట్టుగా పురాణాల్లో చెప్పబడిన ఆయువు కుమారుడు నహుషుడు. ఆయన కొడుకు యయాతికి, ఆయన భార్య దేవయానికి జన్మించిన వాడు యదువు. ఆ యదువు వారసులైన యదువంశీకుల అధీనంలోకి భారత భాగవతాల కాలంలో మధుర అధీనంలోకి వచ్చింది. యయాతి కొడుకు యదువు, అతని కుమారుడు క్రోష్ఠుడు. వారికి 42 తరాల తర్వాత వసుదేవుడు జన్మించాడు. అతని కుమారుడు శ్రీకృష్ణుడు. ఆయన ఉగ్రసేనుడి కుమారుడు, తనకు మేనమామ అయిన కంసుని సంహరించాడు. కృష్ణుని అన్న బలరాముడు మధుర పరిపాలకుడయ్యాడు. కృష్ణుడు పశ్చిమదిక్కుకు వెళ్ళి ద్వారకను నిర్మించేంతవరకూ యదువంశీకులకు మధురే కేంద్రంగా ఉండేది. జరాసంధుని దాడుల్లో దెబ్బతిన్న మధురను తిరిగి కృష్ణుని మునిమనుమడు వజ్రనాభుని కాలంలో పునర్నించబడింది.[2]

భౌగోళికం మార్చు

మథురా నగరం దేశ రాజధాని ఢిల్లీకి దక్షిణంలో 145 దూరంలోనూ, ఆగ్రాకు ఉత్తరంలో 50 కిలోమీటర్లదూరంలోనూ ఉంది. తూర్పున ఆలీఘర్ పడమట రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భరత్‌పూర్ ఉంది. ఢిల్లీ, ఆగ్రా నేషనల్ హైవే (ఎన్‌హెచ్-2, నేషనల్ హైవే -2) మార్గంలో ప్రయాణించి ఇక్కడకు చేరవచ్చు. ఇది రైల్వే జంక్షన్. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చెన్నై రైళ్ళు మథుర జంక్షన్ నుండి మార్గం మార్చుకుంటాయి. నగర వైశాల్యం 3329.4 చదరపు కిలోమీటర్లు.

పర్యాటక రంగం మార్చు

మథురలో పర్యాటకరంగం ఇంకా అభివృద్ధి దశలో ఉంది. అధికంగా హిందూ మతసంబంధిత ప్రదేశాలను సందర్శించడానికి ఇక్కడకు సందర్శకులు వస్తుంటారు.

మథురలో ప్రధాన దర్శనీయ ప్రదేశాలు మార్చు

 
గురుదేవ్ ఆలయం
  1. కృష్ణజన్మభూమి
  2. జైగురుదేవ్‌ ఆలయం
  3. ద్వారకాదీష్ ఆలయం
  4. ఖన్స్ ఖిలా
  5. విశ్రామ్ ఘాట్ (యమునాతీరంలోని స్నానఘట్టం)

విశ్రామ్‌ఘాట్ మథురలో ప్రధాన స్నానఘట్టం. కంస వధ తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని పురాణ కథనం.

మథుర పరిసర ప్రాంతాలలో దర్శనీయ ప్రదేశాలు మార్చు

  1. బర్సన.
  2. నందగోన్.
  3. గోకుల్.
  4. బృందావనం.
  5. గోవిందన్.
  6. రాధాకుండ్.
  7. మంట్.
  8. భరత్పూర్ (రాజస్థాన్)
  9. డీగ్
  10. పక్షుల శరణాలయం

విద్య మార్చు

మధురలో ఉన్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ పసు వద్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో మొదటిది దేశంలో నాల్గవది. ఈ విశ్వవిద్యాలయం మథుర-ఆగ్రా రోడ్డులో మథుర రైల్వే స్టేషనుకు 5 కిలోమీటర్ల దూరంలోనూ బస్ స్టాండుకు 4 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ప్రధాన విశ్వవిద్యాలయం భూభాగం మథురలో 782.32 ఎకరాలు, ప్రధాన విశవిద్యాలయ భవనానికి 20 కిలోమీటర్ల దూరంలో మధురీకుండ్‌లో 1400 ఏకరాలు వీస్తీర్ణంలో ఉంది.

పరిశ్రమలు మార్చు

ప్రస్తుతం మథుర ప్రధాన రైలు మార్గంలోనూ, బస్ మార్గంలోనూ ఉన్నందువలన ఇక్కడ భారత ప్రభుత్వానికి స్వంతమైన ఇండియన్ రిఫైనరీ పరిశ్రమ ఉంది.ఇది ఆసియాలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ. ఇక్కడ వెండి పాలిష్ చేసే పరిశ్రమలు, బట్టలు ప్రింటింగ్ చేసే పరిశ్రమలు, బట్టల మీద డిజైన్ అద్దకం పరిశ్రమలు, నీటి పంపులు తయారీ ప్రసిద్ధం.
మథుర, బృందావనం నగరాలు ప్రముఖ జంట నగరాలలో ఒకటి. చిన్న నగరమైన బృందావనంలో

జనసంఖ్య మార్చు

2001 జనాభా లెక్కలననుసరించి మథుర జనసంఖ్య 298,827. వీరిలో పురుషులు 53%, స్త్రీలు 47%.సరాసరి అక్షరాస్యత 61%. ఇది దేశీయ సరాసరి అక్షరాస్యత అయిన 59.5% కంటే అధికం. పురుషుల అక్షరాస్యత 67%, స్త్రీల అక్షరాస్యత 57%.6 సంవత్సరాలకన్నా తక్కువ వయసున్న పిల్లలు 14%.

మూలాలు మార్చు

  1. అయోధ్యాకాండము:రామాయణం:వాల్మీకి
  2. 2.0 2.1 2.2 మధుర - శ్రీకృష్ణ జన్మస్థానము:వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్యశర్మ:సుపథ ద్వైమాసిక పత్రిక:జూన్ 2011:12

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మథుర&oldid=4092234" నుండి వెలికితీశారు