మోపూరు వేణుగోపాలయ్య

మోపూరు వేణుగోపాలయ్య తెలుగు రచయిత. అతను నెల్లూరు వి.ఆర్. కళాశాల తెలుగు శాఖలో ఉపన్యాసకుడుగా పనిచేసాడు.

జీవిత విశేషాలు మార్చు

మోపూరు వేణుగోపాలయ్య 1941 జనవరి 10న వెంకటశేషమ్మ, శ్రీహరి దంపతులకు జన్మించాడు. నెల్లూరు వి.ఆర్.కళాశాలలో తెలుగు బి.ఎ., చదివి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఎ,. మొదటి శ్రేణిలో పాసై, నెల్లూరు వి.ఆర్. కళాశాల తెలుగు శాఖలో ఉపన్యాసకుడుగా 37 ఏళ్ళు పనిచేసి పదవీవిరమణ చేశాడు.

వేణుగోపాలయ్య నెల్లూరు మూలాపేట సరస్వతీసమాజంలో 20 సంవత్సరాలు పురాణ ప్రవచనం చేశాడు. భారత భాగవతాలు, ఎర్రన హరివంశం, పింగళి-కాటూరి సౌందరనందనము, సీతారామాంజనేయ సంవాదం, తదితర సాహిత్య, ఆధ్యాత్మిక విషయాలమీద ప్రవచనం చేశాడు. తన నిత్యజీవనంలో భక్తి, ఆధ్యాత్మికత భాగాలు.

1981 లో వేణుగోపాలయ్య తిక్కన భగవద్గీత పద్యాలకు అర్థవివణ, వ్యాఖ్యానం రాసి పుస్తకరూపంలో ప్రచురించి సాహితీప్రియులకు అందించాడు. పోతన విరచిత భాగవతంలో రుక్మిణీ పరిణయం పద్యాలను పుస్తకంగా ముద్రించి విద్యార్థులకు పంచి, వారిలో పద్యపఠనంలో ఆసక్తికి ఉద్యమస్థాయిలో కృషిచేశాడు.

ఆయన నెల్లూరు వర్ధమాన సమాజం కార్యవర్గ సభ్యడుగా 30 సంవత్సరాలు బాధ్యత నిర్వహించాడు. వర్ధమాన సమాజ వేదికమీద, ఇతర చోట్ల అనేక వేదికలమీద సాహిత్య ఉపన్యాసాలు చేశాడు. నిరంతరం సాహిత్య అధ్యయనంలో ఉంటూ, ఏం.ఏ., తెలుగు పరీక్ష ప్రైవేటుగా రాసే విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పి సహాయంచేశాడు. ఏ సమాజంవారు తనకు సన్మానం చేసి గౌరవించినా, ఆ సన్మానధనాన్ని ఆ సమాజానికే తిరిగి విరాళంగా ఇచ్చేవాడు.

సాహితీవేత్తగా, ఆయనను గురుప్రపూర్ణ, పురాణం ప్రవచన సుధాకర, వంటి గౌరవ సంబోధనలతో నెల్లూరీయులు గౌరవించారు.[1]

ఆయన బంధుమిత్రుల్లో అందరికి తలలో నాలుకలాగా వ్యవహరించాడు. బంధుమిత్రులు అయన సలహా మీద నడచుకొనేవారు. వేణుగోపాలయ్య వివాదరహితుడు, సజ్జనుడు అని పేరు. ఆయన 2021 లో కోవిడ్. వ్యాధితో మరణించాడు.[2]

మూలాలు మార్చు

  1. గురువుల సలహాలు నేటికీ పాటిస్తున్నా. సాక్షి పత్రికలో వెంకయ్యనాయుడు వ్యాసం. [1]
  2. ఇద్దరు పండితుల మృతి, ఆంధ్రజ్యోతి వార్త. [2]

వనరులు మార్చు

  • 1.తిక్కన భగవద్గీత పద్యాలకు అర్థవివణ, వ్యాఖ్యానం,1990,
  • 2. 'ప్రవచన సుధాకరుని' వేణు నాదం (venunadam), శ్రీ మోపూరు వేణుగోపాలయ్య స్మారక సాహితీ సంచిక, ముద్రణ:raianbow printpack, Ameerpet, Hyderabad. 2023.