ఆర్.కె.లక్ష్మణ్

వ్యంగ్య చిత్రకారుడు
(రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ నుండి దారిమార్పు చెందింది)

ఆర్.కె.లక్ష్మణ్ గా ప్రసిద్ధులైన రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్ (అక్టోబర్ 23 1924 - జనవరి 26 2015) భారతదేశంలో ఎంతో పేరు తెచ్చుకున్న వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. ముంబాయి నుండి ప్రచురించబడుతున్న ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India) లో ప్రతిరోజూ వ్యంగ్య చిత్రాలు వేస్తూ ఉండేవాడు. కొన్ని దశాబ్దాలనుండి ఒకే వార్తా పత్రికలో పనిచేస్తూ, తన కార్టూన్లకు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ఇతను ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను వేస్తూ ఉండేవాడు. ఇతను సృష్టించిన సామాన్య వ్యక్తి (Common Man) పాత్ర కార్టూన్ల చరిత్రలో అత్యంత పేరు తెచ్చుకున్న పాత్ర. ఇతడు 1983వ సంవత్సరంలో, ఒక కార్యక్రమానికి బెంగుళూరు వెళ్ళినప్పుడు ఒక పత్రికా విలేఖరి "ఇప్పటికీ మీరు కార్టూన్లు వెయ్యటంలో ఆనందం పొందుతున్నారా" అని అడిగినప్పుడు, "ఇదేం ప్రశ్న!? తప్పకుండా ఆనందిస్తున్నాను, నాకు ఇది పుట్టుకతో వచ్చిన కళ " అని సమాధానమిచ్చాడు. ఇతడు రాజకీయ కార్టూన్లు వేసి భారత దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా ఆటపట్టించి, వారిమీద సద్విమర్శలు చేసి రాజకీయ రంగాన్ని సరైన పంధాలో నడిపించటానికి తనవంతు కృషి చేశాడు. ఎంత ఆట పట్టించినా, లక్ష్మన్ అంటే, రాజకీయ నాయకులందరికీ గౌరవం అంతకుమించి ఎనలేని ప్రేమ.[1] 2003వ సంవత్సరంలో తీవ్ర అస్వస్థులై ఆసుపత్రిపాలైనప్పుడు, దేశంలోని హేమాహేమీలందరూ వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆదుర్దాతో వాకబు చేశాడు. అప్పటి, ఉపరాష్ట్రపతి భైరవ్ సింగ్ షేకావత్, ఆసుపత్రికి వెళ్ళి ఇతడిని పరామర్శించారు.

ఆర్ కె లక్ష్మణ్
ఆర్.కె.లక్ష్మణ్
జననం (1924-10-23) 1924 అక్టోబరు 23 (వయసు 99)
మరణంజనవరి 26, 2015
వృత్తివ్యంగ్య చిత్రకారుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సామాన్య వ్యక్తి (Common Man) కార్టూన్
జీవిత భాగస్వామి
పురస్కారాలుపద్మభూషణ్,
పద్మ విభూషణ్,
రామన్ మెగసెసే
సంతకం

బాల్యం మార్చు

ఆర్కే లక్ష్మణ్ మైసూర్ నగరంలో ఒక తమిళ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యయుడు. లక్ష్మణ్ ఆరుగురు సంతానంలో చిన్నవాడు. ఇతని అన్నలలో ఒకడైన ఆర్.కె. నారాయణ్ (R.K.Narayan) మాల్గుడి డేస్ కథలు రచించిన ప్రముఖ ఆంగ్ల రచయిత. చిన్నతనంలో లక్ష్మణ్ బొమ్మల పుస్తకాలు ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. ఆంగ్ల పత్రికలైన స్ట్రాండ్ (Strand), పంచ్ (Punch), బైస్టాండర్ (Bystander), వైడ్-వరల్డ్ (Wide World), టిట్ బిట్స్ (Tid Bits) వంటి బొమ్మల కార్టూన్ పుస్తకాలను, తాను చదవటం నేర్వకముందే చూసేవాడు. అలా బొమ్మల పుస్తకాలు చూస్తూ, మెల్లిగా గీతలు గీస్తూ బొమ్మలు వెయ్యటం మొదలుపెట్టాడు. నేల మీద, గోడల మీద, తలుపుల మీద, ఎక్కడ పడితే అక్కడ రకరకాల బొమ్మలు వేసేవాడు. తన ఉపాధ్యాయుల వ్యంగ్య చిత్రాలుకూడ వేసాడు. ఇతడు వేసిన బోధి వృక్షం ఆకు బొమ్మను వీరి టీచర్లు కూడా మెచ్చుకున్నప్పుడు తానొక చిత్రకారుడిగా తయారయ్యే అవకాశం ఉన్నదని భావించాడు.

ఉన్నత పాఠశాల తరువాత, లక్ష్మణ్ బొంబాయి (ఇప్పటి ముంబాయి) లోని జె.జె ఇన్సిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ (J J Institute of Applied Art) కు అందులో చేరి బొమ్మలు వేయటం నేరుకోవటానికి, తన దరఖాస్తు పంపుకున్నాడు. కాని, ఆ పాఠశాల ప్రధాన అధికారి, ఇతని బొమ్మలు చూసి, అటువంటి బొమ్మలు వేసేవాడు తమ స్కూలులో విద్యార్థిగా ఉండ తగడు అని చేర్చుకోలేదట.[ఆధారం చూపాలి] చిత్రంగా, ప్రస్తుతం ఇతడు పనిచేసే టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయమునకు పక్కనే ఈ పాఠశాల ఉంది. ఏ పాఠశాలలో బొమ్మలు వేయటం నేర్చుకోవటానికి ప్రవేశం లభించలేదో, అదే స్కూలు పక్కన ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కొన్ని దశాబ్దాల పాటు వారి కార్టూనిస్ట్‌గా ఉండి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవటం ఇతని అకుంఠిత దీక్షకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చివరకు ఇతని మైసూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. చదివి పట్ట భద్రుడయినాడు. తన చదువు కొనసాగిస్తూనే బొమ్మలు ప్రీలాన్స్ [తెలుగు పదము కావాలి] (స్వతంత్ర) చిత్రకారునిగా కొనసాగాడు. ఆ కాలంలోనె "స్వరాజ్య" అన్న పత్రికలో కార్టూన్లు వేశాడు. అలాగే, నారద అనే కార్టూన్ సినిమాకు కూడా బొమ్మలు వేశాడు.

సామాన్య మానవుని సృష్టి మార్చు

 
A tribute to the late R. K. Laxman by cartoonist Shekhar Gurera
 
ముంబాయిలోని వర్లీ సముద్ర తీరంలో ప్రతిష్ఠించబడిన సామాన్య మానవుని విగ్రహం
 
ఆర్.కె. లక్ష్మణ్ కార్టూనులలో తరచు దర్శనమిచ్చే "సామాన్య మానవుడు". మాట్లాడడు. చూస్తుంటాడు.

భారతదేశ కార్టూన్ రంగ చరిత్రలో అనేకమయిన పాత్రలు సృష్టించబడినాయి. కాని, లక్ష్మణ్ సృష్టించిన సామాన్య మానవుడు (Common Man) అనితర సాధ్యమైన ప్రాచుర్యం పొందినది. లక్ష్మణ్ వేసిన దాదాపు అన్ని రాజకీయ వ్యంగ్య చిత్రాలలోను ఈ సామాన్య మానవుడు దర్శనమిస్తాడు. బట్టతల, కళ్ళజోడు, గళ్ళకోటుతో ఈ వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయం నుండి, తాలూకా కార్యాలయం వరకూ అన్ని చోట్ల దర్శనమిస్తూ, అక్కడ జరుగుతున్న విచిత్ర విషయాలకు సాక్షిగా నిలుస్తూ, చక్కటి హావ భావ ప్రకటన మాత్రమే చేస్తూ, ఎన్నడూ ఒక్క మాటకూడ మాట్లాడడు. ఈ సామాన్య వ్యక్తి కార్టూన్ పాత్ర ఎంత ప్రసిద్ధి చెందిందంటే, ముంబాయిలో వర్లీ సముద్ర తీరంలో, సామాన్య వ్యక్తికి ఒక లోహ విగ్రహం ప్రతిష్ఠించారు. భారతదేశంలో ఒక కార్టూన్ పాత్రకు ఒక విగ్రహం ఉండటం ఇదొక్కచోటే!

వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. రాజకీయ నాయకులను కార్టూన్ల ద్వారా లక్ష్మణ్ ఆట పట్టించినంతగా ఒక్క శంకర్ పిళ్ళై (శంకర్స్ వీక్లీ) తప్ప ఇంకెవరూ ఆటపట్టించి ఉండరు. దీనికి ఆధారం వీరు వేసిన వేలవేల కార్టూన్లే. లక్ష్మణ్ కు అరోగ్యం పాడయినప్పుడు, వీరిని పరామర్శించిన రాజకీయ నాయకులు, వీరి అరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసిన రాజకీయనాయకులు అనేకం. అప్పటి ఉప రాష్ట్రపతి స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు