వల్లూరి కామేశ్వరరావు

వల్లూరి కామేశ్వరరావు (1914 జూలై 15 - 2018 నవంబరు 27) భారతీయ సివిల్ సర్వీస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి. ఆయన మరణించే సమయానికి భారతీయ సివిల్ సర్వీస్‌ అధికారుల్లో జీవించి ఉన్న అత్యంత పెద్దవయసు వ్యక్తి.[1] అతను బ్రిటిష్ రాజ్ సివిల్ సర్వీస్‌లో కలెక్టర్, మేజిస్ట్రేట్‌గా పనిచేశాడు. స్వాతంత్ర్యం తరువాత కామేశ్వరరావు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖలో చేరాడు. కొత్తగా స్థాపించబడిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోకి బదిలీ అయ్యాడు. 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని స్థాపించిన తర్వాత ఆయన రాష్ట్రానికి బదిలీ అయ్యాడు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత ఆ రాష్ట్ర మొదటి పబ్లిక్ వర్క్స్ సెక్రటరీ అయ్యాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి అక్కడ ప్రణాళికా సంఘంలో పనిచేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాన కార్యదర్శిగా తిరిగి వచ్చాడు. 1981 నుండి 82 వరకు భారత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.

వల్లూరి కామేశ్వరరావు
వ్యక్తిగత వివరాలు
జననం(1914-07-15)1914 జూలై 15
గోదావరి జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం
మరణం2018 నవంబరు 27(2018-11-27) (వయసు 104)
హైదరాబాద్, తెలంగాణ
కళాశాలలయోలా కాలేజి, చెన్నై (మద్రాసు యూనివర్సిటీ)
సిడ్నీ సుసెక్స్ కాలేజి, కేంబ్రిడ్జి

ప్రారంభ జీవితం, వృత్తి

మార్చు

రావు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా - అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ లోని గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు.[1] అతనికి ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఆయన పెద్ద సోదరుడు వల్లూరి పార్థసారథి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి. 1932 లో 18 ఏళ్ల వయసులో నిడమర్తి ప్రభావతితో అతని పెళ్ళి జరిగింది. రావు కుమారుడు వల్లూరి నారాయణ్ రిటైర్డ్ IAS అధికారి. ఆయన వ్యయ సంస్కరణల సంఘం సభ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశాడు. రాజోలులో ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత, కామేశ్వరరావు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని సిడ్నీ సస్సెక్స్ కళాశాల నుండి గణితశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని తీసుకున్నాడు. [2] తండ్రి ఒత్తిడిపై, లండన్‌లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై, తన రెండవ ప్రయత్నంలో విజయం సాధించాడు. అతను 1937 సెప్టెంబరు 29న ICS (ప్రోబేషన్‌పై)కి నియమితుడయ్యాడు.[2] 1938 సెప్టెంబరు 9న (గెజిటెడ్ 1938 సెప్టెంబరు 1) అతని నియామకాన్ని ప్రభుత్వం ధృవీకరించింది.[2]

1938 అక్టోబరులో భారతదేశానికి చేరుకున్న రావు, మొదట బెంగాల్ ప్రెసిడెన్సీలో (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఉంది) మిడ్నాపూర్‌లో అసిస్టెంట్ కలెక్టర్, మేజిస్ట్రేట్‌గా నియమితుడయ్యాడు.[1] 1941 మేలో జాయింట్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందాడు. ఆగస్టులో ఆర్థిక శాఖకు అండర్ సెక్రటరీ అయ్యాడు.[2] 1943 బెంగాల్ కరువును చూశాడు. 1944 మేలో డిప్యూటీ కంట్రోలర్‌గా (ప్రొక్యూర్‌మెంట్, కొనుగోలు) నియమితుడయ్యాడు. ఆ తర్వాత సప్లై డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు.[2] విస్తృతమైన మతపరమైన అల్లర్లకు దారితీసిన 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం రోజున అతను బెంగాల్‌లో ఉన్నాడు.[1] భారత స్వాతంత్ర్యం సమయంలో జాయింట్ మేజిస్ట్రేట్, కలెక్టర్‌గా ఉన్నారు. [2]

స్వాతంత్ర్యం తర్వాత కెరీర్

మార్చు

స్వాతంత్ర్యం, దేశ విభజన జరిగిన ఒక నెల తరువాత, 1947 సెప్టెంబరు 27న, రావు మద్రాసు ప్రభుత్వ ఆర్థిక శాఖకు డిప్యూటీ సెక్రటరీగా బదిలీ అయ్యాడు. పాత ICS నుండి కొత్త ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌గా మార్చక ముందు అది అతని చివరి పోస్టింగు. అతను 1948 ఫిబ్రవరి 28న రెవెన్యూ శాఖకు బదిలీ అయ్యాడు.[3] 1950 ఏప్రిల్ 29న విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా నియమితుడయ్యాడు. 1953 ఏప్రిల్ 15న డిప్యూటీ సెక్రటరీ (పబ్లిక్ డిపార్ట్‌మెంట్)గా, 1953 ఆగస్టు 12న డిప్యూటీ సెక్రటరీ (ఆంధ్ర వ్యవహారాలు)గా తదుపరి నియామకాలు అందుకున్నాడు. 1956లో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, రావు 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్ర IAS అధికారుల కేడర్‌కు బదిలీ అయ్యాడు. అదే తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. 1956 నవంబరు 1న కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మొదటి కార్యదర్శి అయ్యాడు.[3] రావు తరువాత కేంద్ర ప్రభుత్వ సేవలో ప్రవేశించి, భారత ప్రణాళికా సంఘంలో పనిచేశాడు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రంలో అత్యున్నత స్థాయి సివిల్ సర్వెంట్ అయ్యాడు.[4]

పదవీ విరమణ, మరణం

మార్చు

అతని పదవీ విరమణ తరువాత అతను 1974 నుండి 1977 వరకు ఆంధ్ర ప్రదేశ్ విజిలెన్స్ కమీషనర్‌గా పనిచేశాడు.[4] ఆపై 191982 నుండి 81 వరకు భారత రాష్ట్రపతి ఎన్. సంజీవ రెడ్డికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[1] 2016 డిసెంబరు 13 న మాజీ ICS సహోద్యోగి CS రామచంద్రన్‌పై ఒక పుస్తకాన్ని విడుదల చేయడానికి హైదరాబాద్‌ వెళ్ళాడు.[5] 2018 నవంబరులో తన 104 వ ఏట మరణించే వరకు హైదరాబాద్‌లో నివసించాడు.[6]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Change is inevitable: former ICS officer". The Hindu. 14 July 2014. Retrieved 13 May 2018.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 The India Office and Burma Office List: 1947. Harrison & Sons, Ltd. 1947. p. 366.
  3. 3.0 3.1 History of Services: Indian Administrative Service and Indian Police Service (as of 1 January 1957). Government of India Press. 1957. p. 151.
  4. 4.0 4.1 "The following officers held the post of vigilance Commissioners for the periods mentioned against each". Andhra Pradesh Vigilance Commissioner. Retrieved 16 May 2018.
  5. "Tribute to Ramachandran, an ICS officer par excellence". The New Indian Express. 13 December 2016. Retrieved 13 May 2018.
  6. Obituary: Valluri Kameswara Rao, ICS