సతీసహగమనం

భర్త చనిపోయిన స్త్రీలు, భర్త యొక్క చితి మంటలలో తమంతట తామే దూరి సజీవంగా తెగలబెట్టుకొనే ఆచారము.
(సతీ సహగమనం నుండి దారిమార్పు చెందింది)

సతీసహగమనం లేదా "సతీ" (దేవనాగరి: सती) భర్త చనిపోయిన స్త్రీలు, భర్త యొక్క చితి మంటలలో తమంతట తామే దూరి సజీవంగా తెగలబెట్టుకొనే ఆచారము.

1851లో ప్రచురితమైన "పిక్టోరియల్ హిస్టరీ ఆఫ్ చైనా అండ్ ఇండియా" పుస్తకములో ఒక సతీసహగమన దృశ్యము

ఇది భారతదేశంలో ఒక చారిత్రాత్మక పద్ధతి, దీనిలో ఒక వితంతువు తన మరణించిన భర్త యొక్క అంత్యక్రియల చితిపై కూర్చొని తనను తాను త్యాగం చేసుకుంటుంది. ఇది ఒక మహాజాతరలా జరిగేది. మేళతాలాలతో ఊరేగింపుగా ఊరు ఊరంతా తరలి పోయేవారు. చనిపోయిన భర్తకు చితి పేర్చి చితిపైన పెద్ద మంచె వేసి దానిపై స్త్రీని కూర్చోబెట్టి, చితిపై తన భర్త శవానికి నిప్పు అంటించగానే మంచె యొక్క నాలుగు కర్రలను నలుగురు తొలిగించేవారు. అలా మంచెపైన కూర్చున్న స్త్రీ, కాలుతున్న భర్త చితిపై పడిపోయేది.

చరిత్ర

మార్చు

సతి అంటే భార్య. సహగమనం అంటే కలసి పోవటం. చనిపోయిన భర్తతో పాటు భార్య కూడ చనిపోవటాన్ని సతీ సహగమనము అంటారు. ఇలా చనిపోయిన పతితో పాటు భార్య బలవంతముగా మరణించటమనేది పురాణాలలో కనిపించదు. శివపురాణములో సతీదేవి వృత్తాంతములో గాని, రామాయణంలో సీతాదేవి అగ్నిప్రవేశంలో గాని చనిపోయిన భర్తతో అనుగమించటమనే అంశం వర్తించదు. బహుశః మంగోలుల దాడుల కాలంలో స్త్రీలకు కలుగబోయే బానిసత్వం (లైంగిక బానిసత్వం) నుంచి తప్పించటానికి స్వచ్చందంగానో, బలవంతంగానో ఈ దురాచారం మొదలయిందని చరిత్రకారుల విశ్లేషణ.

దేశవ్యాప్తంగా క్షత్రియ కులాల్లో సతీ సహగమనం ఉండేది. తెలుగు ప్రాంతాలలో కమ్మవారి రాజకుటుంబాలలో సతీసహగమన ఆచారం పూర్వాకాలం నుండి కొనసాగింది. సూర్యదేవర విక్రమసింహ నాయుడు యుద్దములో చనిపొవడముతో అతడి దర్మపత్ని మల్లికాంబ అతడితో పాటు అగ్నిలో ఆహుతి అయినది. వేమూరి గురవయ్య నాయుడు చనిపోవడముతో అతడి ధర్మపత్ని వెంగమాంబ అతడి చితిపై ఉండి ఆత్మర్పణం గావించుకున్నది. వాసిరెడ్డి జగ్గభూపాలుడు చనిపోవడముతో అతడి దర్మపత్ని అచ్చమాంబ అతడి చితిపై ఉండి ఆత్మర్పణం గావించుకున్నది. సతీసహగమన ఆచారం కమ్మవారితో పాటు ఈ రాజపుత్రులులలో కూడా కొనసాగింది. రాజులకాలంలో సతీసహగమనం దక్షిణాదిన ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయ, ముసునూరి చక్రవర్తుల కాలంలో అలాగే కళింగ విజయనగర సామ్రాజ్యంలోను కూడా ఈ పద్ధతి అమలులో వుండేది. ఆనాడు అనగా సుమారు 500 సంవత్సరాల క్రితం హంపి విజయనగరాన్ని సందర్శించిన ఒక పోర్చుగీసు యాత్రికుడు సతీ సహగమన వ్యవహారాన్ని స్వయంగా చూసి వ్రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఈ క్రింది విధంగా ఉంది.

ఈ రాజ్యంలోని ప్రజలందరు విగ్రహా రాధకులే. స్త్రీలు చనిపోయిన తమ భర్తతో బాటు చితిలో దూకి మరణించటం వీరి ఆచారం. దీన్ని వీరు గౌరవ ప్రదమైన చర్యగా భావిస్తారు. భర్త చనిపోయి నప్పుడు.... భార్య బంధు వర్గంతో కలిసి రోదిస్తుంది. కాని ఆ రోధన ఒక పరిమితిని దాటితే ఆ స్త్రీ తన భర్తతో బాటు సహగమనానికి సిద్దంగా లేదని భావిస్తారు. ఆమె ఏడుపు మానగానే సహగమనానికి పురికొల్పుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారానికి, సాంప్రదాయానికి భంగం కలిగించవద్దని బోధిస్తారు. ఆ తర్వాత ఆ మరణించిన వ్వక్తిని కర్రలతో చేసిన వేదిక పై పడుకోబెట్టి పూలతో అలంకరిస్తారు. అతని భార్యను ఒక చిన్న గుర్రంపై కూర్చోబెట్టి శవం వెంబడి పంపుతారు. అప్పుడామె తనకున్న ఆభరణాలనన్నింటినీ ధరించి వుంటుంది. అన్ని రకాల పూలను కూడా ధరించి వుంటుంది. చేతిలో అద్దం కూడా ధరించి వుంటుంది. శవం వెంబడి అనేక సంగీత వాయిద్యాలు, బాజా బజంత్రీలు రాగా వెనుక బంధుజన సముదాయం నడుస్తుంటుంది. వీరందరూ చాల సంతోషంగా వుంటారు. ఒక వ్వక్తి ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆస్త్రీ వైపు చూసి ఇలా పాట పాడుతాడు. 'నీవు నీ భర్తను చేరడానికి వెళుతున్నావు.....' దానికి ఆ స్త్రీ సమాదానంగా "అవును నేను నా భర్త వద్దకు వెళుతున్నాను...." అని పాట ద్వారా తెలుపుతుంది.

—పోర్చుగీసు యాత్రికుడు

భర్త శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ అదివరకే సిద్దంచేసిన వెధిక (చితి) పై పెడ్తారు., మరణించిన వ్వక్తి యొక్క దగ్గరి బందువు ఒకరు తన తల మీద ఒక నీటితో నిందిన కుండను ఎత్తుకొని చేతిలో ఒక కాగడా ధరించి ఆ వేదిక చితి తుట్టు మూడు సార్లు తిరుగుతాడు. ప్రతి చుట్టుకు ఆ కుండకు ఒక రంధ్రం చేస్తారు. చివరగా ఆ కుండను అక్కడ పడేసి ఆ కాగడాను శవాని పడుకోబెట్టిన కట్టెల వేదికపైకి విసురుతాడు. అప్పుడు అక్కడ వున్నవారు శవానికి నిప్పు పెడతారు. శవం కాలాక అతని భార్య పూజారులతో కలిసి అక్కడకొస్తుంది. వారు ఆమె పాదాలను కడిగి వారి అచారాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. అప్పుడు ఆమె తన చేతులతో తన మీదున్న ఆభరాణాలను తీసి తన బందువులైన స్థ్రీలకు పంచి ఇస్తుంది. అమెకు కొడుకులున్నచో వారిని తనకు ముఖమైన బందువులకు అప్పజెప్తుంది. ఆమె శరీరం పైనున్న వన్ని తీసేశాక అమెకు ఒక సాధారణ పశుపు బట్టను కట్టబెట్టతారు. ఆమె బందువులు ఆమె చేతిని పట్టుకోగా ఆమె మరో చేతిలో ఒక కొమ్మను పట్టుకొని వుంటుంది. ఆమెను మూడు సార్లు ఆ చితి చుట్టు తిప్పుతారు. అప్పుడు ఒక చాపను ఆమెకు ముందు అడ్డంగా పట్టుకుని చితి మంటలు కనబడకుండా చేస్తారు. అప్పుడు ఒక బట్ట, బియ్యం, దువ్వెన అద్దం తమలపాకులు, వంటి వాటిని ఆ మంటలో పడేస్తారు. ఇవన్నీ తన భర్త తరుపున వస్తువులని వారి నమ్మకం. చివరగా ఆమె అక్కడున్న వారందరి వద్ద శలవు తీసుకొని నెత్తిన నూనెతో నిండిన కుండతో తనంత తాను ధైర్యంగామండుచున్న అగ్ని కీలలోనికి ప్రవేశిస్తుంది. వెనువెంటనే, అప్పటికే చేతులలో కర్రలతో సిద్దంగా వున్న ఆమె బందువులు అందరూ ఆ కర్రలతో అమెను కప్పేస్తారు. ఆ తర్వాత బిగ్గరగా తమ విచారన్ని వ్వక్త పరుస్తారు. ఈ విధానము చాల ధైర్యంతో కూడుకున్నదే గాక నాకు చాల ఆచ్చ్యారాన్ని కలిగించింది. ఈ పద్ధతి ఇక్కడి అధికారులకే గాక రాజుకు కూడా వర్తిస్తుంది. ఒక వేళ ఎవరికైనా చాల మంది భార్యలు వుంటే అతని మరణానంతరం వారందరూ ఇలా అగ్ని ప్రవేశం చేయు వలసిందే. తెలుగు వారికి మాత్రం ఈ అచారంలో కొంత మార్పు ఉంది. వారు శవాన్ని భూమిలో పూడ్చి పెడతారు గనుక .... భర్త శవాన్ని పూడ్చి పెట్టే గోతిలోనె భార్య కొరకు ఇంకో స్థానం సిద్దం చేసారు. భర్త శవానికి ప్రక్కన భార్యను పడుకోబెట్టి ఇద్దరిని పూడ్చి పెడ్తారు. అప్పుడు భార్య కూడా మరణిస్తుంది.

నిషేధం

మార్చు

సతీ సహగమన ఆచారాన్ని మొదటిసారిగా 1515 లో గోవాలో పోర్చుగీసు వారు నిషేధించారు. తరువాత డచ్ వారు, ఫ్రెంచివారు, చించురావారు, పాండిచ్చెరి వారు నిషేధించారు. 1798 లో బ్రిటీషు వారు కలకత్తాలో సతీసహగమనాన్ని నిషేధించారు. బెంగాల్ ప్రెసిడెన్సివారు 1817 లో నిర్వహించిన సర్వేలో బెంగాల్ రాష్ట్రంలో 700 విధవరాళ్ళు సజీవంగా సతీసహగమనానికి బలయ్యారు. 1812 నుండి ప్రముఖ సంఘ సంస్కర్త విలియం కేరి, రాజా రామ్మోహన్ రాయ్ లు సతీసహగమన వ్యతిరేక చర్యలు చేపట్టారు. వారి కృషి ఫలితంగా 1829 డిసెంబరు 4 న బెంగాల్ ప్రెసిడెన్సీలో సహగమనాన్ని నిషేధిస్తూ, అది పాటించిన వారికి శిక్ష విధించేలా నాటి గవర్నరు బెంటింక్ ఆదేశాలు జారీ చేసాడు. [1] 1830 ఫిబ్రవరి 2 న ఈ చట్టాన్ని మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో కూడా అమలు చేసారు. [2]

ఈ చట్టాన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టుకు వెళ్ళారు. ఆ కేసు చివరికి లండను లోని ప్రీవీ కౌన్సిలు దాకా వెళ్ళింది. అక్కడ ఆ పిటిషన్ను కొట్టివేసి, నిషేధాన్ని సమర్థించారు. [3]

ఆ తరువాత భారతదేశం లోని సంస్థానాలు కూడా సతీ సహగమనాన్ని నిషేధించాయి. 1940 లో బరోడా సంస్థానం నిషేధించింది. 1941 లో కొల్హాపూర్ నిషేధించింది. 1846 లో జైపూర్ సంస్థానం నిషేధించడంతో అది మిగతా రాజపుత్ర సంస్థానాల్లో ఒక ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఆ తరువాత 4 నెలల్లోనే మొత్తం రాజపుటానా లోని మొత్తం 18 సంస్థానాల్లో పదకొండింటిలో సతీసహగమనాన్ని నిషేధించారు. [4] ఆ తరువాత 1847 లో హైదరాబాదు, [5][6] గ్వాలియర్, జమ్మూకాశ్మీరుల్లో నిషేధించారు. [7] ముస్లిము సంస్థానాలైన అవధ్, భోపాల్ లలో 1849 నాటికి ఈ ఆచారంపై నిషేధం ఉంది. [8] 1852 లో కచ్, జోధ్‌పూర్ లలో నిషేధించారు. [9]

1861 లో మేవార్ సంస్థానంలో కూడా నిషేధం విధించడంతో భారతదేశమంతటా సతీసహగమనాన్ని నిషేధించినట్లైంది.

ట్రావన్కూర్ సంస్థానంలో సతీ సహగమన ఆచారం ఉండేది కాదు. ఈ ఆచారాన్ని అనుమతించాలా అని సంస్థానం లోని బ్రిటిషు రెసిడెంటు రాణి గౌరి పార్వతీ బాయిని 1818 లో అడగ్గా ఆమె ఆ ఆచారం తమ సంస్థానంలో ఎన్నడూ లేదని, ఇప్పుడు అనుమతించవద్దనీ చెప్పింది. [10]

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 40 కేసులు సహగమన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 1987 లో రాజస్థాన్ ప్రభుత్వం సహగమన నిరోధక చట్టాన్ని జారీ చేసింది. దీని ప్రకారం సతి సహగమనాన్ని ప్రోత్సహించడం క్షమించరాని నేరం.

మూలాలు

మార్చు
  1. Sharma pp. 7–8.
  2. Rai, Raghunath. History. p. 137. ISBN 9788187139690.[permanent dead link]
  3. Kulkarni, A.R.; Feldhaus, Anne (1996). "Sati in the Maratha Country". Images of Women in Maharashtrian Literature and Religion. Albany, NY: SUNY Press. p. 192. ISBN 978-0791428382.
  4. A much quoted table given at page 270 in Wilson, Horca H. (1851). William Gifford (ed.). "Widow Burning-Major Ludlow". The Quarterly Review. 89: 257–276.
  5. "Man of many talents".
  6. "Picturing the 'Beloved'".
  7. On Hyderabad and Gwalior Trotter, James (1866). The History of the British Empire in India. Vol. 1. London: Wm. H. Allen & Company. p. 97., Jammu and Kashmir "Bengal and Agra, Miscellaneous". The Indian News and Chronicle of Eastern Affaires. 132. London: Alexander E. Murray: 76. 22 February 1848.
  8. William Sleeman travelling in Awadh in 1849 says sati is prohibited there. Sleeman, William H. (1858). A Journey Through the Kingdom of Oude in 1849–1850: With Private Correspondence Relative to the Annexation of Oude to British India. Vol. 2. London: Richard Bentley. p. 250. Bhopal is reported in 1849 to engage actively in suppression of the rite, "Notes and suggestions on Indian Affairs, chapter VI". The Dublin University Magazine. 34, 204. Dublin: James McGlashan: 712. December 1849.
  9. Finishing writing in April 1853, John William Kaye says Jodhpur is the most recent important state to have banned the rite. Kaye, John W. (1853). The Administration of the East India Company: A History of Indian Progress. London: R. Bentley. p. 543.
  10. "Tinnevelly". Church of England Magazine. 7, 198. London: James Burns: 383. 14 December 1839.