సమాంతర సినిమా అన్నది భారతీయ సినిమాకు చెందిన ఒక సినీ ఉద్యమం. 1950ల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బెంగాలీ సినీ పరిశ్రమలో ప్రారంభమైన ఈ సమాంతర సినీ ఉ్యమం భారతదేశ వ్యాప్తంగా ప్రభావం చూపింది. ప్రధానంగా హిందీ కమర్షియల్ సినిమాలు (ప్రస్తుతం బాలీవుడ్ గా పేరొందింది) ప్రధానంగా ప్రాతినిధ్యం వహించే భారతీయ కమర్షియల్ సినిమాలకు ప్రత్యామ్నాయంగా లేక సమాంతరంగా వాస్తవిక కళాత్మక ధోరణులతో వచ్చిన సినిమాలు సమాంతర సినిమాలుగా పేరొందాయి.
ఇటాలియన్ నవ్యవాస్తవికత ధోరణుల నుంచి స్ఫూర్తి పొందిన సమాంతర సినిమా ధోరణులు సరిగా ఫ్రెంచ్, జపనీస్ నవతరంగం ఉద్యమాలకు కొద్దిగా ముందు ప్రారంభమై 1960ల్లో ప్రారంభమైన భారతీయ నవతరంగానికి నేపథ్యంగా, చోదకశక్తిగా నిలిచాయి. ఉద్యమం మొదట్లో బెంగాలీ సినిమాలో ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సినీ రూపకర్తలు సత్యజిత్ రే, మృణాళ్ సేన్, రిత్విక్ ఘటక్, తపన్ సిన్హా, తదితరులు ఈ ఉద్యమం నుంచి వచ్చారు. ఆపైన బంగ్లాదేశ్, భారతదేశంలోని ఇతర సినీ పరిశ్రమల్లోనూ ప్రాచుర్యం పొందింది. సమాంతర సినిమాలు గంభీరమైన ఇతివృత్తాలు, వాస్తవికత, సహజత్వాలకు పేరొందాయి. ఇవి సాధారణమైన ప్రధాన స్రవంతి కమర్షియల్ భారతీయ సినిమాల్లోని డాన్స్, పాటలు, అసహజమైన సన్నివేశాల ధోరణులను తిరస్కరించాయి. ఆనాటి సాంఘిక రాజకీయ వాతావరణాన్ని గమనిస్తూ సినిమాల ద్వారా వ్యాఖ్యానించడం కూడా సమాంతర సినిమా రూపకర్తలు విరివిగా చేశారు.

చరిత్ర మార్చు

మూలాలు మార్చు

భారతీయ సినిమాలో వాస్తవికతకు మూలాలు 1920లు, 30ల నుంచి ఉన్నాయి. అలాంటి ధోరణులకు ఉదాహరణగా బాబూరావ్ పెయింటర్ తీసిన 1925 నాటి నిశ్శబ్ద సినీ క్లాసిక్ సవ్కారీ పాష్ (ఆంగ్లంలో పేరు ఇండియన్ షైలాక్)ను చెప్పుకోవచ్చు. సినిమా ఇతివృత్తం ఓ పేద రైతు (వి. శాంతారాం) దురాశాపరుడైన వడ్డీవ్యాపారి మోసానికి భూమి కోల్పోయి, తప్పనిసరి స్థితిలో పట్నానికి వలసవెళ్ళి మిల్లు కార్మికుడు కావడం.[1] వాస్తవిక చిత్రాలకు నాందిగా ప్రశంసలు పొందింది. 1937లో శాంతారాం తీసిన దునియా నే మానే భారత సమాజంలో మహిళ ఎదుర్కొంటున్న దుర్భర స్థితిని విమర్శిస్తూ వాస్తవిక చిత్రీకరణతో సాగింది.[2]

మూలాలు మార్చు

  1. "Savkari Pash (The Indian Shylock), 1925, 80 mins". Film Heritage Foundation. Retrieved 2015-06-07.
  2. Lalit Mohan Joshi (17 July 2007). "India's Art House Cinema". British Film Institute. Archived from the original on 22 నవంబరు 2009. Retrieved 2 June 2009.