సోమప్ప దేవాలయం, సోమవరం

సోమప్ప దేవాలయం సూర్యాపేట జిల్లానేరేడుచర్ల మండలం , సోమవరం, బూర్గుల తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఈ శివాలయాన్ని సుమారు 2 వేల సంవత్సరాల క్రిందట నిర్మించారు. ఈ ప్రదేశంలో భృగు మహర్షి తపస్సు చేశాడని చెబుతుంటారు. భృగుమహర్షి తపస్సు చేసిన ప్రదేశం కావడంతో ఇక్కడ కొలువుదీరిన స్వామిని భృగుమాలికేశ్వర స్వామి అని కూడా అంటారు. ఈ సోమప్ప దేవాలయం మూసీ నది ఒడ్డున ఉంది.. మూసినదిలో స్నానమాచరించడము ద్వారా సకల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. మూసీ నది అవతలి వైపున గంగామాత విగ్రహం కూడా ఉంది. పిల్లలు కలగనివారు ఈ అమ్మవారి దగ్గర ఉంచిన ఫలమును భక్తితో స్వీకరించి ఆరగిస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారని భక్తుల గట్టి విశ్వాసం.

సోమప్ప దేవాలయం

ఆలయ చరిత్ర మార్చు

ఒకనాడు మునులందరు కలిసి భూలోకంలో ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకొని, ఆ యజ్ఞానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరినో ఒకరిని పిలవాలనుకుంటారు. మునులంతా తమకు ఆరాధ్య దైవాలయిన త్రిమూర్తుల పేర్లను తలా ఒకరు సూచించారు. ఎవరిని ఈ యజ్ఞానికి పిలిస్తే బాగుంటుందో నిర్ణయించే బాధ్యతను బృగుమాలికా మునికి అప్పగించారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు సాధ్వికుడు అని తెలుసుకోవడానికి బృగుమాలికా ముని త్రిమూర్తుల దగ్గరికి బయలుదేరాడు. మొదటగా బ్రహ్మ వద్దకు వెళ్ళగా బ్రహ్మ బృగుమహర్షిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో, భూలోకంలో ఎట్టి పరిస్థితుల్లో నీకు పూజలు చేసేవారు ఉండరని, నీకు పూజలందుకునే యోగ్యం లేదని శపిస్తాడు. అక్కడినుండి శివుని వద్దకు వెళ్ళగా, పార్వతీదేవి నాట్యానికి మైమరచిన శివుడు మునిని పట్టించుకోకపోవడంతో నీ రూపంలో కాకుండా లింగ రూపంలో భూలోకంలో పూజలు అందుకుంటావని శపిస్తాడు. అటుతరువాత విష్ణు దగ్గరికి వెళుతాడు. మహర్షిని కన్నెత్తి కూడా చూడకుండా లక్ష్మీదేవితో ఆటలాడుతున్న విష్ణువు వక్షస్థలంపై తన్నడంతో వక్షస్థలంపై ఉన్న లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది. కోపం వచ్చినా ఆపుకున్న విష్ణువు ఏమి అనలేక మన్నించండి మహాముని అంటూ మీ పాదానికి దెబ్బ తగిలిందా అంటూ మహర్షి పాదాలను నొక్కుతుంటాడు. అరికాలిలో ఉన్న మహర్షి మూడో కన్నును చిదిమేయడంతో జ్ఞానోదయం అయిన మహర్షి తనా తప్పును తెలుసుకుంటాడు. తన ఆరాధ్య దైవమైన ప్రార్దించుకుంటూ యజ్ఞం చేస్తాడు. ముల్లోకాలను తిరుగుతూ వచ్చి కలియుగ ప్రారంభంలో ఒక రోజున మహర్షి ముచుకుందా నది (మూసీ నది) లో స్నానం చేసి వచ్చి జపం చేస్తుండగా అకస్మాత్తుగా జపమాల చేతినుంచి జారి నేలపై పడుతుంది. జపమాలను ఆకర్షించిన ప్రదేశాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా గుర్తించి, తమ ఆరాధ్య దైవమైన శివున్ని లింగరూపంలో ప్రతిష్టింపజేశాడు. అందువల్లే ఈ స్వామిని భృగుమాలికా సోమేశ్వరుడు అంటారు.

ప్రత్యేకత మార్చు

ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే శివరాత్రి ఉత్సవాలకు మూడు జిల్లాల నుండి భక్తులు వచ్చి, స్వామివారిని దర్శించుకుంటారు.[1][2]

మూలాలు మార్చు

  1. నవతెలంగాణ. "శివాలయాలు...జనసంద్రం". Retrieved 2 March 2017.[permanent dead link]
  2. నవతెలంగాణ, నల్లగొండ (8 March 2016). "అంతా శివనామ స్మరణ". NavaTelangana. Retrieved 8 January 2020.