సోమం పెద్ద యజ్ఞం. క్లిష్టమైన అనుష్ఠానాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. ఎన్నో వస్తువులునూ, ఋత్విక్కులు ఉంటేగానీ సాధ్యం కాని పని. కనుక, ఇది నిత్య కర్మాంతర్గతం కాదు. బ్రాహ్మణులు వంశంలో మూడు తరాలుగా ఎవ్వరున్నూ ఈ యజ్ఞం చెయ్యకపోతే నింద తగిలేది. దుర్బ్రాహ్మణులు అని పిలిచేవారట. ఈ అనుష్ఠానం చాలా ప్రాచీన మైనది. పార్సీలు కుడా చేసేవారు. సోముడు ఒకానొక దేవత, దేవతే కాదు, దేవతల్లో ఒక రాజుకూడా.దిగదిపతులైన దేవతలు నలుగులు, అందులో సోముడు ఉత్తరదిశకు రాజు. ఇంద్ర వరుణ యములు క్రమంగా పూర్వపశ్చిమ దక్షిణాలకు రక్షకులు. సోమదేవత అవస్థిత ద్యులోకంలో. సోమలత పృధివీలోకంలో ఆయన ప్రతినిధి.

సోమలత మార్చు

ఈసోమలత హిమాలయాలకు ఉత్తరంగా ఉన్న మూజవంత పర్వతంలో దొరికేది. ఈ పర్వతం ఎక్కడో ఇప్పుడు మనకు సరిగ్గా తెలీదు. అనంతర కాలంలో ఇదే కైలాస పర్వతంగా మారి ఉండవచ్చును. మూజవంతం రుద్రుడు వాసభూమి. ఈ రుద్రుడే మన మహాదేవుడు. సోమం ఆయన చిహ్నం. మహాదేవుడు సోమకలాధరుడు. అందువలన సోమ శబ్దానికి అర్ధం చంద్రుడు. సోమపానం వలన ఆనందమూ, బలము లభించేవి.పార్సీలు సోమాన్ని హౌమా అని అంటారు.మన సమాజమ్లో సోమయగం లోపించినా పార్సీలలో ఇప్పటికీ నిలచి ఉంది.కాని వాళ్ళు వాడె లతా రసం అంతగా పానయోగ్యం కాదు. దీనివల్ల దేవతలకుగాని మానవులకుగాని ఎలాంటి తృప్తి కలుగదు. వాస్తవానికి పూర్వకాలంలో యజ్ఞాలలో వాడే సోమలత ఏమిటో మనకు సరిగ్గా తెలియదు. వైదిక సమాజంలో ఈ యజ్ఞం వ్యాపకంలో ఉన్నప్పుడే సోమలత దుర్లభంగా ఉండేది. పర్వతాల్లోంచి దీన్ని తెచ్చి అమ్మటం కొందరికి వ్యాపారంగా నిలిచేది. ఈ లత దొరక్కపోవటమే ఈ యాగం నిలిచి పోవడానికి ఒక కారణము కావచ్చునేమో అని అనిపిస్తుంది.

సోమయాగ భేదాలు మార్చు

ఈ యాగంలో ప్రకారభేదాలు చాలా ఉన్నాయి.క్షత్రియులు మాహాడంబరంగా చేసే అశ్వమేధ యాగం, రాజసూయ యాగం కూడా సోమయాగ విశేషాలే.క్షత్రియ వైశ్యులు కాలక్రమంలో సోమపాన అధికారాన్ని పోగట్టుకున్నారు. వీరు ఈ యజ్ఞాన్ని చెయ్యవచ్చును. కాని సోమానికి బదులుగా అశ్వత్థ, ప్లక్ష వృక్షాల రసాన్ని క్షత్రియులును, వైశ్యులు పెరుగును తాగాలని నియమం.

సోమయాగం రకరకాలుగా ఉంటుంది. ఒకారోజే పట్టేది ఐకాసికం లేదా జ్యోతిష్టోమం, అంతకుమించి పట్టేది అహినం. దీనికి మించింది సత్రం. సంవత్సరకాలం అంతా చెయ్యతగిన సత్రయాగాలు కూడా ఉన్నాయి. ఇందులో మళ్ళీ అగ్నిష్ఠోమం, షోడశి, అతిరాత్రం అని పలు రకాలు ఉన్నాయి.

పద్ధతి మార్చు

శ్రౌత సూత్రాలనే స్మృతి గ్రంథాలలో ఇది చేయు పద్ధతి వివరించబడింది.ఐతిరేయ బ్రాహ్మణానికి సంబంధించిన అశ్వలాయన శ్రౌత సూత్రమున్ను, శతపధ బ్రాహ్మణానికి సబంధించిన కాత్యాయన్ శ్రౌతసూత్రమును అగ్నిష్ఠొమ స్వరూపాన్ని గ్రహించడానికి తోడ్పడతాయి.

గృహస్థుని అగ్నిశాలలో సోమయాగం చెయ్యడానికి చోటుచాలదు. గ్రామానికి బయట యజ్ఞ భూమిని నిర్దేశించేవారు. దీనిపేరు దేవయజన భూమి. అక్కడ రెండు వేదులు నిర్మింపబడేవి. ఐష్టికవేది, సౌమికవేది. ఐష్టికవేదికి పక్కగా యధాస్థానంలో ఆహవనీయాది అగ్నులు మూడు, బ్రహ్మాది ఋత్విక్కుల స్థానము కల్పింపబడేవి.

ఇష్టియాగానికి నలుగు ఋత్విక్కులు కావాలి. సోమయాగానికి 6 గురు కన్నా ఎక్కువ కావలెను. అందరి పేర్లూ తెలియనక్కర్లేదు. అద్వర్యుడూ-హోతా, బ్రహ్మ, అగ్నీత్తు వీళ్ళు ఉంటారు.ప్రతిప్రస్థాత, మైత్రావరుణులు అధ్వర్యుహోతులకు సహకారులుగా ఉండాలి. బ్రాహ్మణాఛ్హంసి ఆఛ్హావకులనే మరి ఇద్దరు హోతకు సహాయం చేస్తారు. సోమయాగంలో సామగానం కూడా ఉంటుంది. కనుక ఉద్గాత అనే ఋత్విక్కు అతనికి తోడ్పడడానికి గాను ప్రస్తోతాప్రతిహర్తులనే మరి ఇద్దరు కావాలి. మొత్తం వీళ్ళు 11 మంది కాగా, ఇంకో 5 గురితో ప్రయోజనము ఉంటుంది.ఈ 16 మంది గాక, చమసాధ్వర్యులనే మరో 10 మందితో పని ఉంటుంది.

అగ్ని స్థాపనానంతరము యజమాని దీక్షా కార్యక్రమము చేయాలి.సపత్నీకుడై యజమాని యజ్ఞసాల బయట కూర్చోవాలి. క్షురకర్మ అయిన తరువాత స్నానం, పొడిగుడ్డలు కట్టుకొని కుశల మీద నిలబడి ఒంటికి వెన్నరాయించుకోవాలి; కళ్ళకు కాటుక పెట్టుకోవాలి. కుశలతో వళ్ళు తుడుచుకొని శుద్ధిని పొందాలి. వేళ్ళు ముడుచుకొని పిడికిపట్టి యజ్ఞ గృహంలో ప్రవేశించాలి. యజ్ఞం ముగిచేవరకు బయటకురాకూడదు. ఇప్పుడో ఇష్టియాగాన్ని చెయ్యాలి. దీని పేరు దీక్షణీయ ఇష్టి. దీక్షానుకూలమైన ఇష్టి వలన ఈపేరు.దాని తరువాత యజమాని కృష్ణాజినాన్ని పరచి దీనిమీద కూచుంటాడు. తృణాధినిర్మితమైన మేఖల ధరిస్తాడు. ఉష్ణీషాన్ని ధరిస్తాడు. హరిణశృంగాన్ని బట్ట కొంగున ముడి కట్టుకొని, చేత్తో ఔదుంబరశాఖా దండాన్ని ధరిస్తాడు. ఇది యజమాని వేషం.యజమాని పత్ని ఉష్ణీషాకి బదులుగా ఆవిడ తలకు వలలాంటి దాన్ని తగిలిస్తారు. ఈవిధమైన వేశ్హానికి అంతరార్ధం ఉంది. దీక్షాకర్మ యజమానికి నూతనజన్మాన్ని ప్రసాదిస్తుంది. యజ్ఞాసాలే మాతృగర్భం. అక్కడ ఆయన యజ్ఞం ముగిసేంతవరకు గర్భవాసం చేస్తున్నాడు. యజ్ఞం ముగియగానే అక్కడనుంచి నూతన జన్మాన్ని పొంది విష్క్రమిస్తున్నాడు. ఆయన వేషభాషాదికానికి తాత్పర్యం ఏమిటో, ఐతిరేయ బ్రాహ్మణం వివరించి చెబుతుంది.

మిగతా కార్యక్రమాలు : దీక్షణీయ ఇష్టి : వ్రత పానం | ప్రాయణీయ ఇష్టి (రెండవరోజు) | సోమక్రయం | ఆతిధ్య ఇష్టి | ప్రవర్గ్యోపసత్తులు | అగ్నిస్థాపన | అగ్నిషోమప్రణయనం |అగ్నిషోమియ పశుయాగం | సవనం | జలానయనం |సోమాభిషపం |ఉపాంశుహోమం | స్తోత్రపాఠం | ద్విదైవత్య యాగం | శుక్రమాందీ గ్రహాలు | చమసాహుతి | ప్రాతఃసవనం |మాధ్యందిన సవనం | తృతీయ సవనం | అవబృధ స్నానం | ఉదనీయ ఇష్టి | సమాప్తి | అగ్నిష్ఠొమ కర్మసూచి | దక్షిణ.

అగ్నిష్ఠోమ యజ్ఞం చాలా ఖర్చుతో కూడినపని. అధమం ఒక వందైనా ఆవులని దక్షిణగా ఇవ్వాలి. ఋత్విక్కులవంతు - బ్రహ్మ, ఉద్గీత, హోత, అధ్వర్యుడు వీరికి తలకు 12 చొప్పున మొత్తం 48 ఆవులు కావాలి. మొగతా వారికి మిగిలినవి పంచాలి. గుర్రము, కొద్దిగా బంగారము, బట్టలు, పిండి, నువ్వులు దక్షిణగా ఇవ్వాలి.

సోమలతా స్వరూపం మార్చు

వేదము, అవస్తా వీటిని పరిశీలించిచూస్తే సొమలత ఔషధి తరహాకు చెందినదని తెలుస్తుంది. సోమరవ వర్ణం అరుణపింగళం. దాని రసం తియ్యగాఉంటుంది. మధుశబ్దం సోమానికి నామాంతరము. కొంచెం నిషా కలిగించి, ఎక్కువగా మాట్లాడించే గుణము, శరీరానికి బలాన్ని ఇస్తుంది. దేవతలు సోమపాన ప్రియులు. సోమరసం వ్యాధి నివారకం. ఒకప్పుడు దేవతలకి కూడా సోమరం దుర్లభంగా ఉండేది. దేవతలు దానికోసం తహతహలాడి ఉపాయ పూర్వకంగా దాన్ని తెచ్చుకున్నారు. ఈ కథలు వేదంలో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. స్వర్గంలో సర్వోఛ్హ్హస్థానంలో గుప్తంగా ఉన్నదాన్ని సుపర్ణుడు - శ్యేనపక్షి - దేవతలకోసం, ఇంద్రుడి నిమిత్తం, దీన్ని సంపాదిస్తాడు. గరుడుడు అమృతాన్ని తీసుకురావటం పురాణాల్లో కూడా కనిపిస్తుంది. అందుకే సోమరసాన్ని అమృతంతో పోలుస్తారు. సోమం నీటిలో, సముద్రంలో ఉన్న సంగతిని పురాణాలు పేర్కుంటాయి. సముద్ర మథనం అందరికీ తెలిసినదే.

గంధర్వుల వద్ద సోమరసం రహస్యంగా ఉండేదనే అంశం వెదంలో కనిపిస్తుంది. సుపర్ణిపక్షి దాన్ని తెచ్చింది. ఈ సుపర్ణి ఇంకో రెవ్వరో కాదు, స్వయంగాయత్రి. గంధర్వుల దగ్గర ఉన్న సోమాన్ని వంచించి వాగ్దేవి తీసికోరావటం సోవిక్రయకాలంలో అభినయించేవారని లోగడ. గాయత్రి శ్రేష్థచంధస్సు; వేదమంత్రమే వాక్కు. వేదసారమైన గాయత్రి మంత్రం శ్రేష్ఠ వాక్కు. కనుక వాగ్దేవే గాయత్రి. ఈవిడే దేవతలకు సోమాన్ని తెచ్చి పెట్టింది. అమృతత్వాన్ని ప్రసాదించింది. దేవతలు సోమయాగం చేసే వాళ్ళు. విశ్వకర్మ ప్రజాపతి సోమయాగంచేసే, సృష్టి ఆరంభంచాడు.

ఇతరదేశాల్లో సోమం మార్చు

ఆవేస్తాశాస్త్రం కూడా ఇంచుమించుగా ఆయా విషయాలన్నింటినీ వర్ణిస్తుంది. గ్రీకుపురాణాలు కూడా దేవరాజైన జ్యూయస్ నిమిత్తం ఈగిల్ పక్షి మధువును తెచ్చి పెట్టిన కథ చెబుతాయి.ఈ వృత్తాంతాన్నే జర్మన్ గ్రంథాలు దేవరాజే ఈగిల్ పక్షి అయి మధువును తెచ్చాడని చెబుతాయి. ఈ ఈగిలే శ్యేనం, సుపర్ణం. మధువే సోమం.

సోమ మహిమ మార్చు

ఋగ్వేద సంహిత దశమ మడలంలో ఒక ప్రసిద్ధ సూక్తం ఉంది. సూర్యకన్య సూర్యఋషి వర్ణనాంశం సూర్యావివాహమే. " పృధివి సత్యంద్వారా ధరింపబడి నిలిచి ఉంది, ద్యులోకం సూర్యుడిద్వారా నిలిచి ఉంది, ఆదిత్యులు ఋతాన్ని ఆశ్రయించుకొనే ద్యులోకం లో ఉన్నారు. సోముడు కూడా ఋతాన్నే ఆశృఅయించుకొని ఉన్నాడు.సోముడి బలంవల్లనే ఆదిత్యులు, పృధివి బలం చేకూర్చుకొంటున్నారు." నక్షత్రాల సమీపంలోనే సోముడు ఉన్నాడు అని ఒక వాక్యం.నక్షత్రాల దగ్గర ఉన్న చంద్రుడే సోముడు అనుకోవచ్చు. అయితే సోమలతకు చంద్రుడికీ సాదృశ్యం ఎక్కడ? ఊహిస్తే, సూర్యుడు అస్తమించాక ఆతేజస్సు కొంత చంద్రుడిలోనూ, కొంత ఔషధాల్లోన్నూ ప్రవేశింస్తుందని సంస్కృత సాహిత్యాల్లో పలుచోట్ల చెప్పబడింది. అందువల్లనే చంద్రుడును కొన్ని ఔషధులు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయట. ఈరీతికి చెందిన PHOSPHORESCENT ఔషధులు హిమాలయ పర్వతాల్లో ఉన్నవని కాళిదాసాది కవులు చెప్పారు.సోమలత కూడా ఔషధి అవటంవల్ల సంవత్సరంలో పుట్టి పెరిగి నశించి, మళ్ళా ఎవ్వరు శ్రద్ధ తీసుకోకపోయినా వర్షోపజీవిని అవటం వల్ల అంకురిస్తుంది. ఆకాశంలో చంద్రుడు లోపించుటలేదు. పృధివి మీద సోమలత నశించినా మళ్ళీ పుట్టుకువస్తోంది. ఈరెంటి స్వరూప మొక్కటే ఇద్దరు అమృత స్వరూపులే.

మూలము మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సోమయాగం&oldid=4011053" నుండి వెలికితీశారు