'కాణాదం పెద్దన' మహబూబ్ నగర్ జిల్లాలో విద్వద్గద్వాల గా విశిష్ట సాహిత్య పోషణా సంస్థానంగా పేరొందిన గద్వాల సంస్థానపు ప్రభువుల ఆస్థాన కవి. సాహిత్య పోషణలో గద్వాల రాయలుగా పేరు తెచ్చుకున్న చిన సోమభూపాలుడి ఆస్థాన అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. గద్వాల అల్లసాని పెద్దనగా భాసిల్లిన కవి. ఆశు, బంధ, గర్భ, చిత్ర వంటి కవిత్వంతో మెప్పించిన చతుర్విద కవితావిశారదుడు.

కాణాదం పెద్దన
జననంకాణాదం పెద్దన
సా.శ. 18 వ శతాబ్దం
ఇతర పేర్లుకాణాదం పెద్దన సోమయాజి
ప్రసిద్ధిగద్వాల సంస్థాన కవి

వంశం మార్చు

పెద్దన కాణాదం వంశం వాడు. నంద వరీక బ్రాహ్మణుడు. ఆత్రేయస గోత్రుడు. ఇతని పినతండ్రి తిమ్మనార్యుడు. భోజుని చంపూ రామాయణానికి వ్యాఖ్యానం రాసిన మల్లేశ్వర దీక్షితులు ఇతనికి విద్యాగురువు.[1]

గద్వాల సంస్థానానికి ఆగమనం మార్చు

పెద్దన పూర్వం సురపురం సంస్థానపు ఆస్థాన పండితులుగా ఉండి, ఆంధ్రమత్స్య పురాణాన్ని రచించిన చిన సోమభూపాలుడి పినతండ్రి ఐన రాజా రామరాయలు(సా.శ. 1768-83) కాలంలో గద్వాలసంస్థానానికి విచ్చేసి, తర్వాత చిన సోమభూపాలుడి(సా.శ. 1784-1815)అస్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడిగా ఘనతికెక్కాడు.

పెద్దన రచనలు మార్చు

  1. ముకుందవిలాసం
  2. ఆధ్యాత్మ రామాయణం
  3. యధాశ్లోక తాత్పర్య రామాయణం ( బాలకాండం)
  4. శేష శైలేశలీల

ముకుందవిలాసం మార్చు

'ముకుందవిలాసం ఒక ప్రసిద్ధిచెందిన తెలుగు ప్రబంధం. ముకుందుడు అనగా శ్రీకృష్ణుడు. కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణునికి జరిగిన వివాహం ఇందులోని ప్రధానమైన ఇతివృత్తం. అందువలన దీనికి భద్రాపరిణయం, భద్రాపరిణయోల్లాసం అని నామాంతరాలు ఉన్నాయి. ఇది మూడాశ్వాసాల ప్రబంధం. ఇది తొలిసారి సా.శ. 1886లో గద్వాల సాహిత్య విద్యా ముకురం ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. తరువాత తెలుగు విజ్ఞానపీఠం వారు ఈ ప్రబంధాన్ని 1985లో ముద్రించారు. చిన సోమభూపాలుడి కోరిక మేరకు ఈ గ్రంథాన్ని రచించి గద్వాల లోని కేశవస్వామికి అంకితం చేయబడింది. శ్లేష, శబ్దాలంకారాలు, బంధకవిత మొదలైన చిత్రకవితా విన్యాసాలు ఎన్నో ఈ కావ్యంలో కనిపిస్తాయి.

ఆధ్యాత్మ రామాయణం మార్చు

ఇది పెద్దన రెండవ రచన. ఈ గ్రంథం సా.శ.> 1873లో గద్వాల సాహిత్య ముకుర ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. ఈ గ్రంథానికి మూలం ఆగస్త్యుడు రచించిన ఆధ్యాత్మ రామాయణం. ఈ గ్రంథంలో పెద్దన గద్వాల ప్రభువుల ఇలవేల్పగు చెన్నకేశవస్వామిని కీర్తించాడు. ఈ స్వామికే ఈ గ్రంథం అంకితమిచ్చినట్లు తెలుస్తుంది. ఈ గ్రంథానికి, ఇతర రామాయణాలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. సీతారామ హనుమత్సంవాద రూపమైన రామ హృదయాన్ని పరమశివుడు పార్వతికి తెలుపుట ఇందలి విశేషం. రామ హృదయాన్ని కవి రామగీత తత్వంగా ఇందులో పేర్కొన్నాడు. ఈ గ్రంథమునందు శబ్ధాలంకారాలు కోకొల్లలు.

యధాశ్లోక తాత్పర్య రామాయణం ( బాలకాండం) మార్చు

గద్వాల సంస్థానంలో వాల్మీకి రామాయణాన్ని యధాశ్లోక తాత్పర్య రామాయణం పేరుతో ఆరుగురు కవులు అనువాదం చేశారు. ఇది గద్వాల సంస్థానం వారి చెన్నకేశవ ముద్రాణాలయంలో రెండు సంపుటులుగా వెలువడింది. దీనిలో పెద్దన కవి బాలకాండ ను అనువాదం చేశాడు. తన రచనలో పెద్దన కవి గద్వాల సంస్థాన ప్రభువుల పూర్వపు స్థానమైన పూడూర్ చెన్నకేశవస్వామిని స్తుతించాడు. పెద్దన కవి బాలకాండను మూడాశ్వాసాల కావ్యంగా మలిచాడు.

అల కణాదము పెద్దనాధ్వరి దనరించు

పటు చమత్కృతులతో బాలకాండ అని రామాయణాన్ని అనువాదం చేసిన గద్వాల కవుల గురించి చెప్పన పద్యంలో ఉంది.

పెద్దన రచనా రీతి మార్చు

పెద్దన తన రచనా రీతిని తానే తెలుపుతూ విమత ప్రబంధ రీతుల నొనరింపుచు, గీత యోగ్య స్ఫూర్తిని గల్గించునట్టి రచన గావించెద, ప్రసంగ సంగత శృంగార చమత్కార రసానుబంధంబుగా నొనరింపబూనుదు'[2]. అని చెప్పుకున్నాడు. రామరాజ భూషణుడు వసుచరిత్రలో చెప్పినట్లు గానయోగ్య కవిత చెప్పిన కవి.[3]

ఇతర కవులచే ప్రశంస మార్చు

పెద్దన రచనా నైపుణ్యం గురించి వెన్నెలకంటి వెంకటపతి అను కవి ఈ కింది విధంగా చెప్పాడు...

ఇద్దరు జోడు నన్నకవి ఎర్రన తిక్కన సోమయాజి దా

నుద్దెగు వారికిన్ ముగ్గురి కొక్కడే దీటగు నల్లసాని మా

పెద్దన వారితోదుతను పేరు వహించిన శ్రీకాణాదమున్

పెద్దన సోమయాజి నిను పెద్దన బొల్చు కవిత్వ సంపదన్.[4]

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 15వ పద్యం, అవతారిక, ముకుందవిలాసం, రచన- కాణాదం పెద్దన
  2. అవతారిక, ముకుందవిలాసం, రచన- కాణాదం పెద్దన, పుట= 4
  3. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-136
  4. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 11 వ సంపుటం, రచన: ఆరుద్ర, పుట-15