కిషన్ జీ అసలు పేరు మల్లోజుల కోటేశ్వరరావు. విప్లవభావాలకు ప్రభావితమైన ఆయన.. న్యాయ విద్యను పూర్తి చేయకుండానే ఉద్యమంలోకి వెళ్లిపోయారు. సుధీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పని చేశారు.

కిషన్ జీ
కిషన్ జీ
జననం26 నవంబరు 1954
కరీంనగర్
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుకిషన్ జీ, బిమల్, జయంత్, కోటన్న, మురళి, ప్రదీప్, ప్రహ్లాద్, రాంఝీ, శ్రీధర్, విమల్
పౌరసత్వంభారత్
సీపీఐ(మావోయిస్టు)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కిషన్ జీ

బాల్యం మార్చు

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కిషన్ జీ స్వగ్రామం.స్వాతంత్ర్య సమరయోధులైన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు 1954 ఆగస్టు 14 న కిషన్ జీ రెండో సంతానంగా జన్మించారు.[1] కిషన్ జీ అసలు పేరు మల్లోజుల కోటేశ్వరరావు.

విధ్యాభ్యాసం మార్చు

పదో తరగతి వరకు పెద్దపల్లిలోనే చదివారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేశారు.కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత న్యాయవిద్యాభ్యాసంలో చేరినా..దాన్ని పూర్తి చేయలేదు.

ఉద్యమ ప్రవేశం మార్చు

ఎమర్జెన్సీ రోజుల్లో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసిన ఆయన అప్పటి పీపుల్స్‌వార్‌కు విద్యార్థి విభాగమైన రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. డిగ్రీ పూర్తైన తర్వాత..శ్రీకాకుళం నక్సల్బరీ పోరాటం ప్రభావంతో ఉద్యమంలోకి ప్రవేశించారు. శ్రీకాకుళం ఉద్యమం దెబ్బతిన్న తరువాత ఆంధ్రప్రదేశ్ లో నక్సల్బరీ రాజకీయాలని ప్రారంభించిన కొండపల్లి సీతారామయ్య యువసైన్యాన్ని తయారు చేశారు. అందులో… గణపతితో పాటు, కిషన్ జీ కూడా ముందు వరుసలో ఉన్నారు. శ్రీశ్రీ, చలసాని ప్రసాద్, వరవరరావు, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిల ఆయనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. 1977 ప్రాంతంలో సిపిఐ ఎంఎల్ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శిగా ప్రహ్లాద పేరుతో కిషన్ జీ పనిచేశారు. 1977 జగిత్యాల జైత్రయాత్రలో బహిరంగ సభలో ప్రసంగించారు. కిషన్ జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్ కూడా ఉద్యమంలో ఉన్నారు. వేణుగోపాల్ సోను అలియాస్ భూపతి పేరిట మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగాను, దండకారణ్య ఇన్‌చార్జ్‌గానూ కొనసాగారు.[2]

కేంద్ర నాయకత్వ బాధ్యతలు మార్చు

బెంగాల్‌లో 1974లో చారు మజుందార్ మృతి తరువాత పశ్చిమ బెంగాల్‌లో సీపీఐఎంల్ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలోనే ఉద్యమం దెబ్బతింది. అయితే ఆంధ్రప్రదేశ్, బీహార్, నేటి జార్ఖండ్, చత్తీస్ గఢ్ లలో మావోయిస్టు ఉద్యమం సాయుధ పోరాట రూపం తీసుకుంది. 1980ల తరువాత ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉద్యమం వ్యాప్తికి పనిచేసిన కిషన్ జీ… తరువాత దండకారణ్యంలో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకు వెళ్లారు. 1986-92 మధ్య నాటి పీపుల్స్‌వార్ పార్టీలో మొదటి తరం నేతలైన కొండపల్లి సీతారామయ్య వంటి వారితో విభేదిస్తూ… గణపతి, పులి అంజన్న, చెరుకూరి రాజ్ కుమార్ ఆలియాస్ ఆజాద్‌లతో పాటు పీపుల్స్ వార్ ను దేశవ్యాప్తంగా విస్తృతం చేసేందుకు విశేష కృషి చేశారు.[3]

జంగల్ మహల్ ఉద్యమం మార్చు

1990 మొదట్లో పశ్చిమ బెంగాల్ లోని వివిధ నక్సల్ గ్రూపుల్లోని కేడర్… వారి విభాగాలను విభేదిస్తూ పీపుల్స్ వార్ లో చేరారు. దాంతో నక్సల్బరీ తరువాత బెంగాల్ లో అంతమైన నక్సలైట్ ఉద్యమం మళ్లీ చిగురించింది. నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకోవాలన్న మావోయిస్టు వ్యూహరచనలో భాగంగా కిషన్‌జీ 21 ఏళ్లుగా పశ్చిమబెంగాల్‌లో పార్టీ నిర్మాణాన్ని విస్తరింపజేశారు. జంగల్ మహల్ ఉద్యమంతో లక్షలాది మంది ఆదివాసీలను భూమిపై హక్కుల కోసం ఏకం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, దంతెవాడ, జగ్దల్‌పూర్, బీజపూర్, ప్రాంతాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్, ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కిషన్‌జీ వ్యూహ రచనే కీలకంగా పనిచేసింది… జార్ఖండ్, బీహార్‌లో పార్టీకి సంబంధించిన క్యాడర్‌ను బలోపేతం చేయటంలో ఆయన ఎత్తుగడలు ఉపకరించాయి. 2005లో పీపుల్స్‌వార్‌ను మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ లో విలీనం చేయటంలోనూ కిషన్‌జీ ప్రధాన భూమిక పోషించారు. శత్రు నిర్మూలన పేరిట దేశంలో జరిగిన పలు దాడులకు సూత్రధారిగా వ్యవహరించారు. 1997లో పశ్చిమ బెంగాల్ లోని జంగల్ మహల్ ప్రాంతంలో మొదటి సాయుధ దళాన్ని పీపుల్స్‌వార్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి పశ్చిమబెంగాల్‌లో కిషన్‌జీ నాయకత్వంలోని పీపుల్స్ వార్ పార్టీ… వామపక్ష ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారింది. బెంగాల్ లో కేవలం సాయుధ పోరాటం రూపమే కాకుండా సాధారణ, మధ్య తరగతి ప్రజానీకాన్ని కూడా నాటి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిషన్ జీ కూడగట్టారు. సింగూరు, నందిగ్రాం లాంటి ఉద్యమాల్లోనూ ప్రజలను సమీకరించడానికి కిషన్ జీ వ్యూహాలు కారణమయ్యాయి. లాల్‌గఢ్ హింస దేశ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించి పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని లాల్‌గఢ్‌లో పోలీసు, అధికార యంత్రాంగాన్ని తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని విముక్తి ప్రాంతంగా ప్రకటించిన దానిలో మల్లోజుల కీలక పాత్ర పోషించారు. విప్లవపంథాపై ఆయనకు ఎనలేని విశ్వాసం ఉండేది.. ఎక్కడికైనా చొచ్చుకవెళ్లగలిగే చొరవ ఎంతటి పెద్ద టార్గెట్‌నైనా సునాయాసంగా పూర్తిచేయగలిగే సామర్ధ్యం కిషన్ జీ సొంతం.. మావోయిస్టు ఉద్యమానికి టెక్నాలజీని కూడా జోడించింది ఆయనే అని చెబుతుంటారు. శాటిలైట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగంలోను మల్లోజులది అందవేసిన చెయ్యి. శాటిలైట్‌ ఫోన్లద్వారానే మీడియాకు ఫోన్‌ ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలున్నాయి.[4] ఒకచేత్తో గన్ను, మరోచేత్తో ల్యాప్‌టాప్‌తో తిరిగేవారని ఆయన్ను చూసినవారు చెబుతుంటారు.[5]

పోలిసుల చేతిలో మార్చు

మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్ జీ ని చంపింది తమ ప్రభుత్వమే అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, ఆపార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బైట పెట్టారు. కిషన్ జీ మరణానికి తమకు ఎలాంటి సంభంధంలేదన్న మమతా బెనర్జీ..పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా బెల్పహారీలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అభిషేక్ కిషన్ జీ ని చంపడం తమ విజయమన్నారు. 24 నవంబర్ 2011 న మల్లోజుల కోటేశ్వర్ రావు పోలిసుల చేతిలో మరణించారు.[6] అయితే మల్లోజులను పోలీసులే పట్టుకొని తీవ్ర చిత్రహింసలు పెట్టి చంపారని అప్పట్లో ప్రజా సంఘాలు ఆరోపణలు చేశాయి. కానీ ఈ ఆరోపణలను కొట్టి పడేసిన మమతాబెనర్జీ ఆయన ఎన్ కౌంటర్ లోనే చనిపోయారనే వాదనను వినిపించారు.ప్రభుత్వమే కిషన్ జీ ని హత్య చేసినట్టు తేలిందని సీపీఎమ్ అభిప్రాయ పడింది.[7]

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కిషన్‌జీ&oldid=3903735" నుండి వెలికితీశారు