బ్రతికి ఉండగా కళాకారులన తృణీకరించి వారు దుర్భర పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటే పట్టించుకోకుండా వారి సృజనాత్మాకత ద్వారా లబ్ధి పొందాలని చూసే వారెందరో.. ఈ ఇతివృతంతో భమిడిపాటి రాధాకృష్ణ రచించిన సాంఘిక నాటకం కీర్తిశేషులు. ఈ ఇతివృతం దాదాపు ప్యాసా (తెలుగులో మల్లెపూవు చిత్రాన్ని పోలి ఉంటుంది.

ముఖ్యపాత్రలు మార్చు

మురారి, వాణీనాధం, జానకి, గంపశంకరయ్య, డాక్టర్ గంగాజలం, మున్సిపల్ ఛైర్మన్

నాటక కథ మార్చు

వాణీనాధం కవి. అతని భార్య జానకి. అతని ప్రతిభను సొమ్ము చేసుకోలేని బ్రతకనేర్వని వాడు. మురారి అతని అన్న. హాస్పిటల్ నుండి డిశ్చార్జి కాబడి ఇంటికి వస్తాడు. వాణీనాధం ఇంటి యజమాని గంపశంకరయ్య. అద్దె బాకీ ఉంటాడు వాణీనాధం. ఇంటి అద్దె వసూలు చేసే నెపం మీద వస్తూ వాణీనాధం రచనలను చవకగా ప్రచురణకర్తలకు అమ్మించి దానిపై కమిషన్, వాణీనాధానికి సన్మానం చేయించే నెపం మీద చందాలు వసూలు చేసి కొంత దిగమింగుదామని అతని ఆలోచన. గంపశంకరయ్యకు కొరకరాని కొయ్య మురారి. వాణీనాధం అమాయకుడు. మురారి లోకం పోకడ ఆకలింపు చేసుకున్న వాడు. మొరమొచ్చు కబుర్లకు పడిపోతాడు. తమ్ముడికి తన అనుభవం చెబుతాడు. మురారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూండగా నాటకం వేస్తాడు. అతని నటనను ప్రేక్షకులు ప్రశంసిస్తారు. ఆ ప్రశంసలకు పొంగిపోయిన మురారి నాటకం మోజులో పడి చదువును నిర్లక్షం చేస్తాడు. చదువు అర్ధాంతరంగా ఆగి, నాటకం తిండి పెట్టక పోడంతో రెండికి చెడతాడు. మురారి మాటలను పెడచెవిని పెడతాడు వాణీనాధం.ఈ లోగా జానకి తండ్రి వచ్చి అల్లుడు అప్రయోజకుడని బాధ పడతాడు. కూతురిని తనతో తీసుకు వెళతాడు. వాణీనాధానికి కళ్లు తెరవని జ్వరం వస్తుంది. తమ్ముడికి లోకం పోకడ చెప్పడానికి ఇదే అదను అనుకుంటాడు మురారి. వాణీనాధాన్ని చూడడానికి వచ్చిన డాక్టర్ గంగాజలానికి తన మొడికల్ రిపోర్ట్ చూపుతాడు. కవిగారు తాగుబోతని రెండు రోజులకంటే బ్రతకడని చెబుతాడు. తాగుబోతనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని మురారి బ్రతిమాలతాడు. గంగాజలం అందరికీ కవిగారు రెండురోజులే బ్రతుకుతాడని అందరికీ చెబుతాడు. దానితో కవిగారికి ఏ విధంగా ఘనంగా వీడ్కోలు చెప్పాలా అనే యోచనలో పడతారు. ఆ విధంగా తృణమో, పణమో వెనుక వేసుకోవాలన్నది వారి ఆలోచన. కవిగారికి శిలా విగ్రహం చెక్కి మంత్రిగారి ద్వారా ప్రతిష్ఠాపన చేయాలని నిర్ణయిస్తాడు. ఇద్దరు కౌన్సిలర్లని కవి గారి ఇంటి వద్ద ఉంచి ఏదైనా ఐతే ఆ సంగతి తనకు తెలియ చేయమని వెళతాడు. వాణీనాధానికి వచ్చినది మామూలు జ్వరం కావడంతో రెండు రోజుల్లో తగ్గి, లేచి నడవగలుగుతాడు. దీనితో నివ్వెర పోయిన కౌన్సిలర్లు ఈ మాటను ఛైర్మన్ తో చెబుతారు. హుటాహుటిన వచ్చిన ఛైర్మన్ తదితరులు వాణీనాధాన్ని చచ్చిపోమంటారు. నివ్వెరపోతాడు వాణీనాధం. చావడానికి వాణీనాధం అంగీకరించకపోవడంతో అతడిని చంపబోతారు. మురారి అడ్డుబడతాడు. మురారి మాటలతో అందరూ వాణీనాధాన్ని విగ్రహం పక్కన ఉంచి సన్మానం చేస్తామని వాణీనాధాన్ని మోసుకుంటూ వెళతారు. మురారి మరణంతోనాటకం ముగుస్తుంది.

సహజత్వం, పాత్ర చిత్రీకరణ మార్చు

ఈ నాటకంలో పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. ఇందులో మురారి పాత్ర చాలా ప్రఖ్యాతి పొందింది. వాణీనాధం అమాయకత్వం, గంప శంకరయ్య లౌక్యం, మురారి గంపశంకరయ్య ల మధ్య సంభాషణా చాతుర్యం అన్నీ గొప్పగా ఉంటాయి. చాలా మంది కళా కారులు బీదరికంతో అలమటించే వారే. వారి ప్రతిభను వాడుకొని తమ పబ్బం గడుపుకోడం చాలా సామాన్యమైన విషయం. సమకాలీన జీవితంలో వారిలో ప్రతిభకు తగిన గుర్తింపు పొందలేక పోయిన వారెందరో..ఈ కఠోర సత్యానికి దర్పణం ఈ నాటకం.

విశేషాలు మార్చు

ఈ నాటకం తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందిన నాటకం. మురారి పాత్రధారణతో రావుగోపాలరావు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకన్నారు. రావుగోపాలరావు కోసమే మురారి పాత్రను భమిడిపాటి రాధాకృష్ణ సృష్టించేరా అన్నంతగా ఆ పాత్రలో ఇమిడి పోయేరు.