కోట గుళ్ళు
కోట గుళ్ళు తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనపూర్ మండల కేంద్రమైన ఘణపూర్ లో ఉన్న గుళ్ళు.[1] కాకతీయ కాలంలో నిర్మించబడిన ఆలయ సముదాయంలో వివిధ పరిమాణాల్లో ఉన్న 22 గుళ్ళను కోట గుళ్ళు అంటారు. ఇవి కాకతీయుల కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి.
కోట గుళ్ళు | |
---|---|
ఘణపూర్ గుడులు | |
![]() ఘణపుర్ గ్రామంలోని కోట గుళ్ళు | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 18°11′02″N 79°31′19″E / 18.1840°N 79.5220°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జయశంకర్ భూపాలపల్లి జిల్లా |
స్థలం | ఘణపూర్ |
సంస్కృతి | |
దైవం | శివుడు |
వాస్తుశైలి | |
దేవాలయాల సంఖ్య | 20 |
చరిత్ర సవరించు
సా.శ. 1199-1260 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు సా.శ. 1213లో ఈ కోట గుళ్ళను నిర్మించాడు. గణపురం గ్రామానికి ఈశాన్య దిక్కున ఉన్న మట్టికోటలో ఈ గుళ్ళు ఉండటంవల్ల కోట గుళ్ళు అనే పేరు వచ్చింది.[2]
రామప్ప దేవాలయం నిర్మించిన కాకతీయ సైన్యాధక్షుడు రేచర్ల రుద్రరెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతిరెడ్డి ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది.[3]
నిర్మాణం సవరించు
కాకతీయులు శైవ మతాభిమానులు అయినప్పటికీ కేశవ భేదాన్ని చూపించకుండా ఈ ఆలయాలను నిర్మించారు. కోట గుళ్ళ సముదాయం చుట్టూ రాతిగోడలతో ప్రాకారం నిర్మించబడింది. ఈ గుళ్ళలో గణపేశ్వరాలయం అనే శివాలయం ప్రధానమైనది, ఆకర్షణీయమైనది. ఇందులో సర్పధారియై ఢమరుకాన్ని వాయిస్తున్న పరమశివుని నిలువెత్తు విగ్రహం చెక్కబడి ఉండడంతోపాటు సభామండపాలు ప్రధానాకర్షణగా నిర్మించబడ్డాయి. అంతేకాకుండా ఓరుగల్లుపై దాడిచేసిన దేవగిరి మహారాజును కాకతీయ అష్టమ చక్రవర్తి రాణి రుద్రమదేవి 15రోజుల యుద్ధంలో ఓడించినందుకు గుర్తుగా గజకేసరిలో సగం మనిషి, సగం సింహం రూపం ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు, గుఱ్ఱం తల - సింహం నడుముతో ఏనుగుమీద స్వారీ చేస్తున్నట్లు యుద్ధ విజయ చిహ్నాలు చెక్కబడ్డాయి.[3] ప్రధానాలయానికి ఉత్తరం దిక్కున ప్రధానాలయం నమూనాలో మరో శివాలయం నిర్మించబడింది.
దీర్ఘాకృతి శివలింగ నక్షత్రకారం పానఘట్టంపై కొలువై ఉన్నట్లు కనపడడంతోపాటు ఆలయ గుర్భగుడి ముఖద్వారంపైన చండిక, త్రిముఖ బ్రహ్మ, పంచముఖ గరుత్మంతుడు, నందీశ్వరుడు, గిరిజా కళ్యాణం, మహావిష్ణువు ఉట్టిపడేట్లు చిత్రీకరించారు. దీని కింద లక్ష్మిదేవి తామర పువ్వు పై కూర్చోగా రెండువైపులా ఏనుగులు తొండాలతో సంయుక్తంగా కలశం పట్టుకుని ఉన్న ఈ విగ్రహం కళానైపుణ్యంతో కాంతులీనుతుంటుంది. చుట్టూవున్న 19 చిన్న ఆలయాలన్నీ గర్భ గృహం, అంతరాలయం కలిగివున్నాయి.[2]
నాట్యమండపం సవరించు
ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున దాదాపు 60 స్తంభాలుగల మండపం నిర్మించబడింది. దీనిని స్తంభాల గుడి అని పిలుస్తారు. డంగుసున్నం, కరక్కాయ మిశ్రమంతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ కిన్నెర, కింపురుష, మందాకిని శిల్పాలు.. ఆలయ గోడలమీద జంతుజీవాలు, రాతి స్తంభం, చతురస్రం, దీర్ఘచతురాస్ర, వృత్తాకార శిల్పాలున్నాయి. ఈ మండపంలో ప్రతిరోజూ ఒక నర్తకి, 16మంది వాయిద్య కళాకారులచే నాట్య ప్రదర్శనలు జరిగేవి.[4]
ఆలయ ధ్వంసం సవరించు
సా.శ. 1323లో ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత ఈ కోట గుళ్ళ సమాదాయంపై అనేక దాడులు జరిగాయి. సా.శ. 15 శతాబ్దం చివరిలోనూ,16 వ శతాబ్ద ప్రారంభ కాలంలోనూ కులీకుతబ్ ఉల్ముల్క్ అనే మహ్మదీయ రాజు చేతిలో ఆలయం ఘోరంగా ధ్వంసమయింది.[2]
ఉత్సవాలు - వేడుకలు సవరించు
మహాశివరాత్రి, కార్తీకమాసంలో ఇక్కడున్న గణపేశ్వరాలయానికి భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు.
గుర్తింపు సవరించు
ఈ ఆలయ సముదాయంలోని గణపేశ్వరాలయాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ సైతం గుర్తించి, డబ్ల్యుటీవో హెరిటేజ్ కేంద్రాల గుర్తింపులో భాగంగా ముద్రించిన ప్రపంచ పర్యాటక కేంద్రాల పుస్తకంలో గణపేశ్వరాలయం గురించి ముద్రించింది.[5]
చిత్రమాలిక సవరించు
గణపురం కోట గుళ్ళ శిధిలాలు | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
మూలాలు సవరించు
- ↑ నమస్తే తెలంగాణ, .యశంకర్ భూపాలపల్లి జిల్లా (1 September 2019). "గణపేశ్వరాలయం అద్భుతం: ఆర్డీవో". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
- ↑ 2.0 2.1 2.2 నవ తెలంగాణ, వరంగల్లు (19 May 2019). "కాకతీయుల కళావైభవం కోటగుళ్లు". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
- ↑ 3.0 3.1 కాకతీయుల కళావైభవం గణపురం కోటగుళ్ళు, నమస్తే తెలంగాణ,బతుకమ్మ (ఆదివారం సంచిక), 24 నవంబరు 2019, పుట. 5.
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (24 November 2019). కాకతీయుల కళావైభవం గణపురం కోటగుళ్ళు. p. 5. Retrieved 24 January 2020.[permanent dead link]
- ↑ నవ తెలంగాణ, వరంగల్లు (19 May 2019). "కాకతీయుల కళావైభవం కోటగుళ్లు". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.