నిమ్మలూరి భాస్కరరావు

మాజీ మావోయిస్టు నిమ్మలూరి భాస్కరరావు స్వస్థలం నరసరావుపేట. భాస్కరరావు తండ్రి నిమ్మలూరి నారాయణమూర్తి నరసరావుపేట రాజావారికోట మేనేజరుగా 40 ఏళ్లపాటు పనిచేశారు. నరసరావుపేట తాలూకాలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా కొంతకాలం పనిచేశారు. 1977 నుంచి పీపుల్స్‌వార్ నేతలు కేజీ సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్యతో కలిసి పనిచేశారు. 1970వ దశకంలో లిన్‌పియావో పేరుతో దళాన్ని ఏర్పాటుచేశారు. 1991లో భాస్కరరావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిచర్యగా వార్ నేతలు అప్పటి కేంద్ర మంత్రి పి.శివశంకర్ కుమారుడు, అప్పటి మలక్‌పేట శాసన సభ్యులు పి.సుధీర్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి భాస్కరరావును విడిపించుకున్నారు. 1973, డిసెంబరు 30వ తేదీన జిల్లెళ్ళమూడి అమ్మ వారి సంస్థానంపై అర్ధరాత్రి పొగబాంబు విసిరి దాడిచేశారు. ఐ పీ ఎస్‌ వ్యాస్‌, చెరుకుపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి తదితర కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఎదుట భాస్కరరావు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అతని తలపై ఉన్న రూ. 8 లక్షల రివార్డును ఆయనకే అందజేశారు. తర్వాత గుంటూరు జిల్లా నర్సరావుపేటలో హలోబ్రదర్స్ పేరుతో వస్తద్రుకాణం నిర్వహించారు. 2005 నుంచి విజయవాడలోని కృష్ణలంక శంకరమఠం వీధిలో కుమారుడి వద్ద ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ‘అజ్ఞాత సూరీడు ’ పేరుతో కవితలు రాశారు.2.6.2011 న కన్ను మూశారు. ఆయన రాసిన కవిత్వం మొత్తంగా సేకరించి ఈ మద్యనే జీవితం ఒక్కటే...యుద్ధాలే అనేకం పేరుతో సమగ్ర కవితా సంకలనం విడుదలైంది.