విజయవాడ

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని నగరం

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో జనాభా పరంగా రెండవ పెద్ద నగరం. ఇది ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉంది, దీనికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది కలిగి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గాలకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామం, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు, బ్లేజువాడ అన్నాడట.[ఆధారం చూపాలి]

విజయవాడ
విజయవాడ నగర వీక్షణం, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ , వి.యం .సి స్థూపం - పైన ఉన్న చిత్రాలు కుడి నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి.
విజయవాడ నగర వీక్షణం, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ , వి.యం .సి స్థూపం - పైన ఉన్న చిత్రాలు కుడి నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి.
Nickname: 
విక్టరీ ప్లేస్ - విజయ వాటిక
విజయవాడ is located in Andhra Pradesh
విజయవాడ
విజయవాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో విజయవాడ ప్రాంతం
Coordinates: 16°31′09″N 80°37′50″E / 16.5193°N 80.6305°E / 16.5193; 80.6305
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లా(లు)ఎన్టీఆర్
Named forవిజయం
Government
 • Typeస్థానిక స్వపరిపాలన
 • Bodyవిజయవాడ నగర పాలక సంస్థ
Area
 • నగరం61.88 km2 (23.89 sq mi)
 • Metro110.44 km2 (42.64 sq mi)
 • Rank2వ <large>(in state)
Elevation23 మీ (75 అ.)
Population
 (2011)[3]
 • నగరం10,48,240
 • Rankభారతదేశంలో 27వ
ఆంధ్రప్రదేశ్ లో 2వ
 • Density16,939/km2 (43,870/sq mi)
 • Metro14,91,202
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+05:30 (IST)
PIN
520 XXX
టెలిఫోన్ కోడ్+91–866
Vehicle registrationAP–16 (AP 17, AP 18 and AP 19 reserved)

స్థల పురాణం మార్చు

మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేదవ్యాసుని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సుచేయగా, శివుడు పరీక్షించడానికి నిర్ణయించాడు. ఆ పరీక్ష మేరకు, మాయా మృగాన్ని ఒకదాన్ని సృష్టించి అర్జునుడు, తాను ఒకేసారి దాన్ని బాణాలతో కొట్టేలా చేస్తాడు. ఆ వేట నాదంటే నాథని తగవు ప్రారంభమై అది యుద్ధంలోకి దిగుతుంది. చివరకు శివుడు తనతో సమానంగా యుద్ధం చేసిన అర్జునుడి వీరత్వానికి, ఘోరమైన తపస్సుకు మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు.[4]

అర్జునుడు తపస్సుచేసిన ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడలో నేడు కనకదుర్గ ఆలయం కొలువైన చోటనే స్థలపురాణం ప్రాచుర్యంలో ఉంది. 11వ శతాబ్దిలోనూ, బహుశా 12వ శతాబ్దిలోనూ వేసిన రెండు శాసనాలు విజయవాడకు ఈ స్థలపురాణాన్ని ఆపాదిస్తున్నాయి. కవిత్రయం వారు తమ ఆంధ్ర మహా భారత ప్రస్తావనలో ఇదేమీ చెప్పకపోవడంతో పాటు ఇతర పురాణాధారాల్లోనూ దీనికి మూలాలు లభించవు. ఇలా సాహిత్యాధారాలు లోపించి కేవలం రెండు శాసనాల ఆధారంగా చలామణి అవుతున్న ఈ కథ ప్రజల నమ్మకాల్లో మాత్రం స్థానం బాగా సంపాదించుకుంది.[5]

పేరు వెనుక కథలు మార్చు

విజయవాడ అన్న పేరు ఇటీవల ప్రాచుర్యం చెందగా పూర్వం నుంచీ బెజవాడ అన్న పేరు ఉంది. ఇక్కడి శాసనాల్లో ప్రాచీనమైన యుద్ధమల్లుని శాసనం, కొండవీడులోని మరో శాసనం ఈ ప్రాంతాన్ని బెజవాడగానే పేర్కొన్నాయి.[6] ఈ రెండు పేర్లలో ఏది ఎలా వచ్చిందన్నదానిపై పలు కథలు, సిద్ధాంతాలు ఉన్నాయి.

అర్జునుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శివునికై తపస్సుచేసి, కిరాతరూపంలోని శివునితో పోరాడాడని చెప్పే స్థలపురాణం ఉంది. దీనితో విజయుడన్న అర్జునుడి పేరుమీదుగానే విజయవాడ వచ్చిందని చెప్తారు.[5] అర్జునుడి పాశుపతాస్త్ర సంపాదన ఇక్కడే జరిగిందనే స్థలపురాణం వివరించే ఓ శాసనంలో ఈ ప్రాంతాన్ని వెచ్చవాడ అని వ్యవహరించారు. జల మార్గంలోనూ, భూమార్గంలోనూ కూడా కీలకమైన కూడలిగా నిలిచిన విజయవాడ ప్రాచీన కాలం నుంచీ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఈ కారణంగా వెచ్చాలు అధికంగా లభించే ప్రాంతం కావడంతో వెచ్చవాడ అయిందని జాన్సన్ చోరగుడి అభిప్రాయపడ్డాడు.[7]

బెజవాడ అన్న పేరు బ్లేజ్ వాడ నుంచి వచ్చిందనీ, విపరీతమైన ఎండలు ఉండడంతో దీన్ని బ్రిటీష్ వారు బ్లేజ్ వాడ అని పిలవగా, పిలవగా జనవ్యవహారంలో బెజవాడ అయిందనీ కొందరు చెబుతారు. అయితే ఇది జన నిరుక్తే. బ్రిటీష్ వారి రాకకు వేల సంవత్సరాల క్రితమే దీనికి బెజవాడ అన్న పేరు శాసనాల్లో కనిపిస్తూ ఉంది. నిజానికి విద్యావేత్త, రాజకీయవేత్త కట్టమంచి రామలింగారెడ్డి ఒకమారు బెజవాడను బ్లేజ్ వాడ అని మార్చి చమత్కరించగా, ఆ చమత్కారం జన నోళ్ళలో నాని ఈ కథగా తయారైంది.

చరిత్ర మార్చు

సా.శ. 3-7 శతాబ్దాలు మార్చు

 
మొగల్రాజపురం గుహలు

విజయవాడ విష్ణుకుండినుల్లో కొందరి రాజధానిగా ఉండేది. సా.శ.565 ప్రాంతంలో విష్ణుకుండిన వంశ రాజైన మాధవ వర్మ విజయవాడ కేంద్రంగా పరిపాలించాడు. అతని కుమారుడు నగరంలో రథం నడుపుతూ బాటపక్కన చింతచిగురు అమ్మే ముసలమ్మ కుమారుడిపై రథాన్ని ఎక్కించాడు. ఆ పిల్లాడు చనిపోయాడు. మహారాజు పుత్రవాత్సల్యాన్ని పక్కనపెట్టి శిక్షగా అదే రథం మీద ఎక్కించి రాకుమారుడిని చంపాలని ఆజ్ఞాపించాడు. మల్లీశ్వరాలయంలో బయటపడ్డ విష్ణువర్ధనుని శాసనం, మరోచోట లభించిన కల్యమబోయ శాసనం, విజయనగరం జమీందారుల వంశ చరిత్ర, మరికొన్ని చాటువులు ఈ సంఘటనను పేర్కొంటున్నాయి.[8][9]

అక్కన్న, మాదన్న గుహలు, మొగల్రాజపురం గుహలు 3, 4 శతాబ్దాలకు చెందినవి. ఇవి బౌద్ధారామాలనీ, తర్వాతి కాలంలో శైవులకు ఆలవాలమై శైవ దేవతా ప్రతిమలు అక్కడ ఏర్పడ్డాయని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరు ఆ వాదాన్ని తిరస్కరిస్తూ ఇవి హిందూ సంబంధ ఆరాధనా స్థలాలేనని వాదిస్తున్నారు. వీటిని విజయవాడను పరిపాలించిన శాలంకాయనులు కానీ, కృష్ణకు దక్షిణాన పాలించిన పల్లవులు కానీ నిర్మించారని భావిస్తున్నారు.[10] సా.శ. 739లో చైనీస్ యాత్రికుడు యుఁఆన్‌ చ్వాంగ్‌ బెజవాడను సందర్శించాడు. ఈ నగరం తెనకచక రాజ్యంలో భాగంగా ఉండేదని రాసుకున్నాడు. ఈ తెనకచక అంటే ధాన్యకటకానికి రూపాంతరం. యుఁఆన్ చ్వాంగ్ ఇక్కడ బెజవాడ, సీతానగరం, ఉండవల్లి కొండల మీద గుహల్లో ఎందరో బౌద్ధ భిక్షువులు ఉండేవారని, సాయంత్రం అయితే అక్కడ వెలిగించిన దీపాల వెలుగులో బెజవాడ ప్రాంతమంతా కన్నుల పండువగా ఉండేదని రాసుకున్నాడు. ఇంద్రకీలాద్రి కొండమీద బౌద్ధ భిక్షువులు నివసించేందుకు కొండను తొలిపించి పలు చావడులు, వసారాలు నిర్మించి ఉన్నాయని రాశాడు.[11] ఇక్కడి బౌద్ధ తంత్రజ్ఞుల నుంచి మాయలు, మహత్తులు ప్రసాదిస్తాయని నమ్మే ధారణ మంత్రాలను అతను నేర్చుకున్నాడు.[12] నదీతీరాన సకల వ్యాధులను హరింపజేసే వనౌషధాల పర్వతం ఉండేదనీ, దానిని వైద్యులు వినియోగించుకునేవారనీ, ఇక్కడ పర్వత సానువుల్లో సంచరించే సాధువులకు బంగారం తయారుచేసే హేమవిద్య ఉండేదనీ రాశాడు.[13]

సా.శ. 8-10 శతాబ్దాలు మార్చు

వేంగి చాళుక్యుల కాలంలో విజయవాడ రాజకీయంగానూ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇదే సమయంలో విజయవాడ మీద రాష్ట్రకూటులు పలు దండయాత్రలు చేశారు. నగరం యుద్ధాల్లో చిక్కుబడిపోయి ఉండేది. పలుమార్లు చేతులు మారింది. సా.శ.927లో వేంగి చాళుక్య రాజు రెండవ యుద్ధమల్లుడు రాష్ట్రకూటులతో ఒప్పందం చేసుకుని వారి సహాయంతో విజయవాడను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత చోళులకు, చాళుక్యులకు మధ్య యుద్ధాలతో విజయవాడ రణరంగంగా మారింది. 70 సంవత్సరాల పాటు సాగిన పోరాటాలు, యుద్ధాల్లో విజయవాడ అరాచకంగా ఉండేది. పౌరులకు శాంతి భద్రతలు కరువై జీవితం దుర్భరమైంది. సా.శ.999లో చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు చాళుక్యులతో జరిగిన యుద్ధంలో నిర్ణయాత్మకంగా జయించి, విజయవాడను ఆక్రమించాడు. రాజరాజ చోళుడు మొదటి శక్తివర్మను విజయవాడలో తనకు సామంత రాజుగా నియమించాకా ఈ రాజకీయ అనిశ్చితి, అరాచక పరిస్థితులు తొలగిపోయాయి. వేంగి చాళుక్యులు ఆ ఓటమితో తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు.[10]

సా.శ.11-18 శతాబ్దాలు మార్చు

11వ శతాబ్ది నుంచి విజయవాడ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయింది. అయితే వాణిజ్య కేంద్రంగా మాత్రం అభివృద్ధి చెందింది. పురాతత్వ శాస్త్రవేత్త సీవెన్ ప్రకారం విజయవాడ ప్రాంతంలో క్రీ.పూ.11 శతాబ్ది నాటివే 47 శాసనాలు లభించాయి. ఇవి కాక పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల ప్రకారం చూసినా వెయ్యేళ్ళ క్రితమే ఇక్కడ విశాలమైన నగరం ఉండేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచీ కృష్ణా నది మీదుగా సముద్ర మార్గంలోకి సాగే జలమార్గంలోనూ, కళింగం (ఒడిశా), మధ్యదేశం (మధ్యప్రదేశ్), మహారాష్ట్ర, కర్ణాటక, దక్షిణ ప్రాంతాల నుంచి వచ్చే భూమార్గాల్లోనూ కూడలిగా ఉండేది. ఈ కారణంగా బెజవాడ కీలకమైన వ్యాపార కూడలిగా అభివృద్ధి చెందింది.[7] ఆంధ్రదేశంలోని ప్రధానమైన నగరాలు, రేవు పట్టణాలను కలుపుతూ ఉండే రాచబాటలను కలుపుతూ, కీలకమైన వాణిజ్య కేంద్రాలుగా వెలిగిన పట్టణాల్లో బెజవాడ కూడా ఉండేది.[14]

వ్యాపారపరంగా విజయవాడకు ఎంత ప్రఖ్యాతి ఉన్నా 11 శతాబ్ది నుంచి ఏ సామ్రాజ్యానికీ రాజధానిగా ఉండేది కాదు. కాకతీయులు, రెడ్డి రాజులు, గజపతులు వంటి పలువురు శక్తిమంతులైన రాజ్యాలు, సామ్రాజ్యాలు విజయవాడను ఒక వ్యాపార కేంద్రంగానే పరిగణించేవారు. రాజకీయంగా ప్రాముఖ్యత ఉండేది కాదు.[10] పలువురు సామంత రాజుల పరిపాలనలో నగరం ఉండేది. 15వ శతాబ్దిలో ఆంధ్ర క్షత్రియులులో వశిష్ట గోత్రానికి చెందిన పూసపాటి రాజ వంశస్థులు విజయవాడ నగరాన్ని పాలించారు.[15]

గజపతులపై తీరాంధ్ర ప్రాంతం మీదుగా దండయాత్రకు తరలివెళ్లినప్పుడు శ్రీ కృష్ణదేవ రాయలు విజయవాడలో విడిది చేశాడు. సమీపంలోని శ్రీకాకుళ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువును సందర్శించి, ఆంధ్ర విష్ణువు ఆనతి మేరకు ఆముక్తమాల్యద కావ్యాన్ని ప్రారంభించినట్టుగా అవతారికలో రాసుకున్నాడు.[16]

సా.శ. 1800 - 2000 మార్చు

విజయవాడ 16వ శతాబ్ది తర్వాత పూర్తిగా తన ప్రాధాన్యత కోల్పోయింది. 2 శతాబ్దాల పాటు తన పూర్వ వైభవం పోగొట్టుకుని కొద్దిపాటి ప్రాంతానికి పరిమితమైపోయింది. ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో 1832లో సంభవించిన తీవ్రమైన కరువు తర్వాత ఆర్థర్ కాటన్ 1839లో కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించి నదీ జలాలతో సేద్యాన్ని అభివృద్ధి చేయాలని నివేదిక తయారుచేశాడు. ఈ నివేదిక 1850లో లండన్లోని కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల ఆమోదంతో పాటుగా అనువైన స్థలాన్ని ఎంపికచేయమన్న ఆదేశం వెలువడింది. కాటన్ నేటి పలనాటి ప్రాంతంలోని గనికొండ ప్రాంతంలో, ముక్త్యాలలో, ఇబ్రహీంపట్నంలోనూ పరిశీలించి, వాటన్నిటినీ పక్కనపెట్టి తుదకు విజయవాడను బ్యారేజికి అనువైన స్థలంగా ఎంపిక చేశాడు. 19వ దశకం మధ్యలో జరిగిన ఈ పరిణామం తిరిగి విజయవాడకు ప్రాధాన్యత తెచ్చిపెట్టడానికి ఒక ముఖ్యకారణమైంది.[17]

1940ల వరకూ విజయవాడ వన్ టౌన్ ప్రాంతమంతా చిన్న చిన్న అడవులు, వాగులు, కొండలతో జనావాసాలకు వీల్లేకుండా ఉండేది.1949 తర్వాత వన్ టౌన్ జనసాంద్రత హఠాత్తుగా పెరిగిపోయింది. 1947 తర్వాత తెలంగాణలో జరుగుతున్న సాయుధ పోరాటం, రజాకార్ల అకృత్యాల నేపథ్యంలో ఎందరో తెలంగాణ ప్రాంతం నుంచి తరలివచ్చి విజయవాడలో స్థిరపడ్డారు. ఆ దశలో కమ్యూనిస్టు నాయకుల ప్రాబల్యంలో కొండలు తొలచి, అడవులు కొట్టి మరీ వన్ టౌన్లో జనావాసాలు ఏర్పాటుచేసుకున్నారు.[18]

1953లో మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతాలు విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసేప్పుడు తాత్కాలిక రాజధానిగా విజయవాడను నిర్ణయించాలని ప్రతిపాదన వచ్చింది. ప్రధానంగా విజయవాడపై రాజకీయంగా పట్టుసాధిస్తున్న కమ్యూనిస్టులు విజయవాడను కానీ, విజయవాడ-గుంటూరు కానీ రాజధాని చేయాలని ప్రతిపాదించగా ఒక్క ఓటు తేడాతో ప్రతిపాదన వీగిపోయింది.[19] ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా కర్నూలు మూడేళ్ళు, ఆపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాదు 1956 నుంచి 58 ఏళ్ళు కొనసాగాయి. 19, 20వ శతాబ్దాల్లో కృష్ణా జిల్లా కేంద్రంగా కూడా వందల ఏళ్ళుగా ఓడ రేవు పట్టణంగా కీలక స్థానంలో ఉన్న మచిలీపట్నమే ఉండేది కానీ విజయవాడ కాలేదు. విజయవాడ మాత్రం రాజధానిగానో, జిల్లా కేంద్రంగానో లేకున్నా వ్యాపార, సాంస్కృతి, రాజకీయ, మీడియా కేంద్రంగా అభివృద్ధి చెందింది.

21వ శతాబ్ది మార్చు

2000 నాటికే కోస్తాలో పలు రంగాలకు కేంద్రంగా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి కోస్తా-రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ మిగలడంతో విజయవాడ గుంటూరులకు దగ్గరగావున్న అమరావతి రాజధాని అయింది.

భౌగోళికం మార్చు

విజయవాడ నగర దృశ్యం

 

 
విజయవాడ పట్టణం

భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.

నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.

కొండపల్లి అడవులు మార్చు

విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.[20]

జనాభా గణాంకాలు మార్చు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
1871 8,206—    
1881 9,366+14.1%
1891 20,224+115.9%
1901 24,224+19.8%
191132,867+35.7%
192144,159+34.4%
193160,427+36.8%
194186,184+42.6%
19511,61,198+87.0%
19612,34,360+45.4%
19713,44,607+47.0%
19815,43,008+57.6%
19918,45,756+55.8%
200110,39,518+22.9%
201114,91,202+43.5%
1871 నుంచి, విజయవాడ పట్టణ పరిధికి చెందిన జనాభా వివరాలు ఈ విధముగా ఉంది

Sources: Rao, Kondapalli Ranga; 1. Rao, M. S. A. (1984). Cities and Slums: A study of a Squatters' Settlement in the City of Vijayawada. Concept Publishing Company. p. 12.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)

2. Provisional Population Totals, Census of India 2011 City Name:VIJAYAWADA

జనాభాపరంగా ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ రెండవ పెద్ద నగరం. చదరపు కిలో మీటరుకు 31,200 జనసాంద్రతతో ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత గల నగరాలలో మూడవది.[21] 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా 1,021,806. దీనిలో పురుషుల సంఖ్య 524,918 స్త్రీల సంఖ్య 523,322, లింగనిష్పత్తి 997స్త్రీలు 1000 పురుషులకు ఇది జాతీయ సగటు 940 కంటే ఎక్కువ.[3][22] సగటు అక్షరాస్యత 82.59% (పురుషులు 86.25%; స్త్రీలు 78.94%) తో మొత్తం 789,038 అక్షరాస్యులున్నారు. ఇది జాతియ సగటు 73.00% కంటే ఎక్కువ.[3][23]

మతం, భాష మార్చు

విజయవాడ లో మతం (2011)
హిందువులు
  
85.16%
ముస్లింలు
  
9.12%
కైస్తవులు
  
3.64%
ఇతరులు
  
1.59%

నగరంలో వాడబడే ప్రధాన భాష తెలుగు.[24]

2011 జనగణన ప్రకారం నగరం (పరిసరాలలో నగరం పెరిగిన ప్రాంతాలతో కలిపి) జనాభా 11,43,232 కాగా, తెలుగు భాషీయులు 10,22,376, ఉర్దూ భాషీయులు 90,876. అత్యల్పంగా హిందీ, తమిళ, ఒడిషా, గుజరాతీ, మరాఠీ భాషీయులు కూడా ఉన్నారు.[25]

అదే జనగణన ప్రకారం హిందువులు 9,73,612 (85.16%), ముస్లింలు 1,04,206 (9.12%), క్రైస్తవులు41,557 (3.64%), జైనులు 5,722 (0.50%), మతం వివరాలు తెలపని వారు 18,135 (1.59%).[26]

ఆర్ధికం మార్చు

కీలకమైన భౌగోళిక స్థానంలో నెలకొనివుండడంతో విజయవాడ పలు వ్యాపారాలకు కేంద్రమైంది. నీటి పారుదల సౌకర్యాలు పెరిగి వ్యవసాయ ప్రధాన జిల్లాలుగా రూపుదిద్దుకున్న కోస్తాంధ్ర జిల్లాలకు రవాణాపరంగా కేంద్రమైన విజయవాడ సహజంగానే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అయింది.

చెరకు, వరి, మామిడి పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవసరాలను తీర్చే వర్తకం, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), కాళేశ్వరరావు మార్కెట్‌ లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్‌రోడ్‌లు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్‌లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి

తెలుగు సినిమా నిర్మాణం మొదట మద్రాసులో, తర్వాత హైదరాబాద్ లో కేంద్రీకృతమై ఉన్నా, తొలి నుంచీ పంపిణీ వ్యవస్థకు విజయవాడ కేంద్రంగా నిలిచింది. రెండు దశాబ్దాల పాటు ఇబ్బడిముబ్బడిగా తెలుగు సినిమా పంపిణీ వ్యాపారం జరిగింది. నవయుగ పిక్చర్స్, పూర్ణా పిక్చర్స్, అన్నపూర్ణా ఫిలింస్, లక్ష్మీ ఫిలింస్, లక్ష్మీ చిత్ర, రాజశ్రీ, విజయా వంటి పంపిణీ సంస్థలన్నీ ఇక్కడ నెలకొన్నాయి.

విజయవాడ నగరం తెలుగు ముద్రణ, ప్రచురణ రంగాలకు ముఖ్యకేంద్రం. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో (ముఖ్యంగా నాలుగు జిల్లాలకు) హోల్‌సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. వస్త్రాలు, ఇనుప సామానులు, పప్పుధాన్యాలు, ఎరువులు, మందులు వంటివి ఇక్కడినుండి సరఫరా చేయబడుతాయి.

పరిపాలన మార్చు

 
విజయవాడ నగరపాలక సంస్థ 50 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కేసీపీ వారి స్తూపం, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బస్ స్టాండ్ రైల్వే స్టేషను లకు మధ్యన

స్థానిక పౌర పరిపాలన మార్చు

విజయవాడ నగర పౌర పరిపానా బాధ్యతలు విజయవాడ నగర పాలక సంస్థవి. భారతదేశంలోకెల్లా ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ సాధించిన స్థానిక సంస్థల్లో ఇది మొట్టమొదటిది.[27] 1888 ఏప్రిల్ 1న పురపాలక సంఘం ఏర్పడగా, 1960లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా లభించింది. 1981లో నగర పాలక సంస్థ ఏర్పడింది. 2012 నాటికి నగరపాలక సంస్థ 61.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది.[28] 2017లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని గ్రేటర్ విజయవాడ (మెట్రో) ఏర్పాటుచేసింది.[29] దాని పరిధి 160 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది.[30]

మెట్రోనగరంలో విజయవాడ నగరపాలకసంస్థతో పాటు కలిసిపోయిన అంబాపురం, బుద్దవరం, దోనేటికూరు, ఎనికేపాడు, గంగూరు, గన్నవరం, గొల్లపూడి గ్రామాలు, మెట్రోపాలిటన్ ప్రాంతంలో గూడవల్లి, జక్కంపూడి, కానూరు, కీసరపల్లి, నిడమానూరు, నున్న, పాతపాడు, పెనమలూరు, ఫిర్యాదీనైనవరం, పోరంకి, ప్రసాదంపాడు, రామవరప్పాడు, తాడిగడప, యనమలకుదురు వుంటాయి.[31]

విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా పరిపాలనా కేంద్రం. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి.[32]. నగరంలోని 63 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక సబ్-కలెక్టర్ ఉంటారు. నగరపాలక సంస్థ కార్యనిర్వహణ బాధ్యతలు మున్సిపల్ కమీషనర్ వి. కమీషనర్ కింద రెవెన్యూ, ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా, క్రీడలు మొదలైన 13 విభాగాల అధికారులు పనిచేస్తారు.[33] వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి.

మురుగునీటి శుద్ధి మార్చు

నగరంలో నాలుగు (ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్‌లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్‌ల నుంచి ఎస్‌టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్‌లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత ముడి నీరుగా మరొక రిజర్వాయర్‌లోకి మళ్ళిస్తారు. చివరకు స్వచ్ఛమైన నీటి దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.[34]

రాజకీయాలు మార్చు

విజయవాడ 1940ల నుంచీ కొన్ని దశాబ్దాలు కమ్యూనిస్టుల కంచుకోటగా కొనసాగింది.[35]

రవాణా మార్చు

పండిత్ నెహ్రూ బస్ స్టేషన్

విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్.

 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన అమరావతి బస్సు

రహదారులు మార్చు

నగరంలో 1,264.24 km (785.56 mi) రహదారులున్నాయి.[36] వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం.[37] నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు.[38]

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 65, నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలుపుతుంది.[39][40] జాతీయ రహదారి 30, చత్తీస్‌గఢ్లొని జగదల్‌పుర్ని నగర సమీపంలోని ఇబ్రహీంపట్నం వరకు కలుపుతుంది.[40] నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, ఇన్నర్‌ రింగు రోడ్డు, జాతీయ రహదారి 16, 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.[41]

ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు మార్చు

 
బెంజ్ సర్కిల్

గతంలో తాడేపల్లి మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల మీదుగా కృష్ణానది దాటి విజయవాడ, మచిలీపట్నం (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో నిడమానూరు వద్ద కలుస్తుంది.

బస్ రవాణా మార్చు

సిటీ బస్సులు, ఆటోలు ప్రాథమికంగా నగర అంతర్గత ప్రజా రవాణా సేవలు.[42] ఇవి కాకుండా మోటారు బైకులు, రిక్షాలు, సైకిళ్ళు కూడా రవాణా వ్యవస్థలో భాగం.[42]: 37, 44  పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను రోడ్డు, రైలు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపయాలు.[43] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన విజయవాడ సిటీ డివిజణ్, రొజూ 400 వరకు బస్సులను నడుపుతూ, 300,000 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది.[44] విజయవాడ బీ.ఆర్.టి.ఎస్ మార్గాలు వేగవంతమైన సిటీబస్సు ప్రయాణానికి సహకరిస్తాయి.[45] పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లొ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ప్రదాన కార్యాలయం ఉంది.[46] పండిట్ నెహ్రూ బస్ స్టేషను, దేశంలోనే నాలుగవ అతి పెద్ద బస్సు టెర్మినల్.[47]

678,004 నాన్-ట్రాంస్పోర్ట్, 94,937 ట్రాంస్పోర్ట్ వాహనాలు ఉన్నాయి.[48] లారీలు వంటి భారీ వాహనాలు సరుకు రవాణాకు వాడుతారు, ఇది దేశంలో 18% వాటా కలిగి ఉంది.[49] 27,296 ఆటోలు, తక్కువ దూరం ప్రయాణం కోసం, ప్రతీ రోజు నగర రోడ్డ్ల పైన సేవలు అందిస్తున్నాయి.[48]

రైలు మార్చు

 
విజయవాడ జంక్షన్‌ రైల్వే స్టేషను

సబర్బన్ రైళ్ళు విజయవాడ నుండి గుంటూరు, తెనాలి వరకు సేవలు అందిస్తునాయి.[50][51] కొత్త సర్కులర్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు, ఇది రాజధాని అమరావతి వరకు ఉంటుంది.[52][53] విజయవాడ మెట్రో ప్రాజెక్టు రెండు కారిడార్లలో కడుతున్నారు.[54] విజయవాడ రైల్వే స్టేషన్ A1గా గుర్తింపు పొందింది,,[55] భారతీయ రైల్వేల్లో అత్యంత రద్ది జంక్షను.[56] విజయవాడ రైల్వే డివిజను ప్రదాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.[57]

విమానం మార్చు

 
విజయవాడ విమానాశ్రయం

విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై, జైపూర్, వైజాగ్, తిరుపతి, ఢిల్లీ నగరములకు విమాన సౌకర్యము ఉంది.[58] 2017 మే 3న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు, అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.[58] 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ.[59] అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతో, 54.8% వృద్ధి నమోదు చేసింది.[60]

విద్య మార్చు

విశ్వవిద్యాలయాలు మార్చు

 
ఎన్.టి.ఆర్. ఆరోగ్య వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం.

ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయంగా పేరొందింది. ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి.

పాఠశాలలు మార్చు

సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే 1977లో స్థాపించబడింది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన భూమిలో ప్రారంభమైంది.

వైద్యం మార్చు

సాధారణ ప్రభుత్వ వైద్యశాలని మరిన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో అత్యాధునిక ఆసుపత్రిగా తీర్చిదిద్దే ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది.[61] ప్రైవేట్ రంగంలో అత్యాధునిక ఆసుపత్రులున్నాయి.

సమాచార. వినోద సాధనాలు మార్చు

 
బెంజి సర్కిల్ దగ్గర ట్రెండ్‌సెట్ మాల్

రేడియో మార్చు

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో శ్రోతలకు తెలుగు ప్రసారాలను అందించడంతో పాటు అందులో పనిచేసిన పలువురు సాహిత్యకారులు, కళాకారులకు విజయవాడను స్థిరనివాసం చేసింది. ఇది 1948 డిసెంబరు 1 న ప్రారంభించబడింది.[62] దీని భవనం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరుబెట్టారు.[63][63] ఆకాశవాణి ప్రసారాలు విజయవాడ,[64] వివిధభారతి (రెయిన్ బౌ కృష్ణవేణి ఎఫ్ ఎమ్102.2MHz) .[65]

ఇవి కాక ప్రైవేట్ రంగంలో, రేడియో మిర్చి ఎఫ్‌ఎమ్ (98.3MHz), రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5MHz) ప్రసార కేంద్రాలున్నాయి.

టెలివిజన్ మార్చు

దూరదర్శన్ సప్తగిరి విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నది.

సినిమా మార్చు

విజయవాడ నగర సంస్కృతిలో సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లోనే నగరంలో ప్రారంభమైన మారుతీ హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. దుర్గా కళామందిరం (1923), రామా టాకీసు (1929) వంటి సినిమా హాళ్ళు తెలుగు సినిమా టాకీలు ప్రారంభం కావడానికి ముందే విజయవాడలో వెలిశాయి. తెలుగు సినిమా రంగం ప్రారంభమయ్యాకా నిర్మాణ కేంద్రం కాలేకపోయినా పంపిణీ కేంద్రంగా విజయవాడ అభివృద్ధి చెందింది. దానితో పాటుగా తెలుగు సినిమా రంగంపై చర్చాగోష్టులు, సమావేశాలు, అభిమాన సంఘాలు, సినిమా పత్రికలు వంటివాటన్నిటికీ కూడా స్థానంగా నిలిచింది. తెలుగు సినిమాల్లో విజయవాడతోనూ, పరిసర ప్రాంతాలతో అనుబంధం ఉన్న ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి వంటి నటీనటులు మంచి పేరు సంపాదించారు. నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ ఏర్పడి ఉత్తమ చిత్రాలను ఆదరించేలా ప్రేక్షకుల్లో అభిరుచి పెంపొందించాలన్న లక్ష్యంతో చాలాకాలం పనిచేసింది. ఈ పరిణామాలన్నీ నగర జన జీవితంలో సినిమా ప్రభావం చూపడానికి దోహదపడ్డాయి.[66][67]

ముద్రణ మార్చు

విశాలాంధ్ర విజయవాడ నుండి ప్రారంభమైన తొలి తెలుగు వార్తాపత్రిక.[68] 2013–14 వార్షిక ప్రెస్ నివేదిక ప్రకారం, విజయవాడనుండి వెలువడే పెద్ద, మధ్యమ వార్తాపత్రికలలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, సూర్య, ఆంధ్రప్రభ, వార్త, ప్రజాశక్తి, ఉదయ భారతం ఉన్నాయి. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.[69]

విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం, ప్రచురితమౌతున్నాయి. విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే కోల్కతా తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, జయంతి,అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.

విజయవాడలో పుస్తక ప్రచురణ సంస్థలు, పుస్తకాల షాపులు, గ్రంథాలయాలు సాహిత్య వాతావరణాన్ని కల్పించాయి. 1903లో ఇ.సుబ్బుకృష్ణయ్య ఆస్తిక పుస్తక భాండాగారం పేరిట గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1916లో దీనిని బకింగ్ హాం పేటలోని శాశ్వత భవనంలోకి మార్చి, శ్రీ రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారంగా పేరు మార్చారు. దీన్నే సాధారణంగా శ్రీ రామ్మోహన గ్రంథాలయంగా వ్యవహరిస్తారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, జైల్లో మరణించిన వెలిదండ్ల హనుమంతరావు పేరుమీదుగా హనుమంతరాయ గ్రంథాలయం 1934 డిసెంబరు 2న ప్రారంభమైంది. చిరకాలం నుంచి ఈ గ్రంథాలయాలు నగరంలో సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. హనుమంతరాయ గ్రంథాలయానికి అధ్యక్షులుగు నగరంలో పలువురు రాజకీయవేత్తలు, విద్యావేత్తలు వ్యవహరించి అభివృద్ధి చేశారు.[70]

రాజకీయాలు మార్చు

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ కేంద్రంగా పేరొందింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మార్చు

ఈనగరంలో దాదాపు 20 ఐ.టీ. సంస్థలున్నాయి, 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఇవి 42 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఆం.ప్ర.ఐ.ఐ.సి. సంస్థ గన్నవరంలో ఐ.టీ. పార్కు, ఎస్.ఇ.జెడ్. (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు చేసింది. వీటి నిర్మాణాలకోసం ఎల్.‍& టి. కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది, దీని బడ్జెట్ 300 కోట్ల రూపాయలు. ఈ ఐ.టీ. పార్కులు దాదాపు 10,000 మంది ఐ.టీ. ప్రొఫెషనల్స్ కు ఉద్యోగావకాశాలు కలుగజేస్తుంది. ఇంకో ఐ.టీ.పార్కు, మంగళగిరిలో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నవి.

సంస్కృతి మార్చు

 
పివిపి స్క్వేర్, విజయవాడ

మ్యూజియంలు, పర్యాటక ప్రదేశాలు మార్చు

మత విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు మార్చు

విజయవాడ నగరంలో ప్రాచీన కాలం నుంచి బౌద్ధం, జైనం, తర్వాత శైవం వృద్ధిచెందాయి. విజయనగర సామ్రాజ్య పరిపాలన అనంతరం 16వ శతాబ్దం నాటికి కొంతమేరకు వైష్ణవాలయాలు కూడా ఉండేవి. రామ, రాఘవ, కృష్ణ ఆలయాలు, వాటి మాన్యాలు కూడా శాసనాల్లో కనిపిస్తాయి. ఏ సంక్షోభం కారణంగా ఆ వైష్ణవాలయాలు రూపుమాశాయన్న చరిత్ర కూడా లేకుండా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వైశ్యులు వైష్ణవాన్ని పుచ్చుకుని, దాని అభివృద్ధికి దానధర్మాలు చేయడం ప్రారంభించడంతో నగరంలో 19వ శతాబ్ది నుంచి తిరిగి వైష్ణవాలయాలు ఏర్పడడం కనిపిస్తుంది.[71] విజయవాడ జనాభాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లింలు ఉన్నారు. దాదాపు 15 శాతం అని 2000 నాటి ఒక అంచనా. 19వ శతాబ్దిలో విజయవాడ వన్ టౌన్లో సంఖ్యాధిక్యతే కాక సాంస్కృతిక ఆధిపత్యం కూడా ముస్లింలదే. షియా ముస్లింలకు సంబంధించిన పంజాలు, సూఫీలకు సంబంధించిన దర్గాలు విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఆనాడు విజయవాడలో కీలకమైన ప్రాంతాల్లో ఆస్తుల్లో ఎక్కవ భాగం వీరివి. మొదట్లో బంగారు, వెండి దుకాణాలన్నీ వీరి చేతిలోనే ఉండేవి. కాలక్రమేణా ఆస్తులు చేతులు మారి, ముస్లింలు ప్రస్తుతం పాత ఇనుము, టైర్లు తిరిగి అమ్మకం, టైలరింగ్ వంటి వ్యాపారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నా విజయవాడ ముస్లింల ఒకప్పటి సిరిసంపదలు వారిచేతిలో లేదని లంక వెంకటరమణ వ్యాఖ్యానించాడు. వీరు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న విజయవాడ పశ్చిమ శాసన సభ నియోజక వర్గంలో రాజకీయంగానూ ప్రభావం చూపుతున్నారు.[72][73] సిక్ఖులూ నగరంలో నివసిస్తున్నారు. ఆటోనగర్ సమీపంలో ఒక కాలనీకి గురునానక్ కాలనీ అని పేరుపెట్టుకున్నారు. 2000 ప్రాంతంలో ఖల్సా 300 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నగరంలో వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించారు.[74]

కనక దుర్గ అమ్మ వారి దేవాలయం మార్చు

 
విజయవాడ – కనక దుర్గ అమ్మ వారి దేవాలయం

కనకదుర్గ అలయం, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.

మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట మార్చు

ఇది ఆధునిక యుగంలో అపురూపమైన శిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో గణపతి సచ్చిదానంద చే ఈ గుడి కుంభాభిషేకం, ప్రతిష్ఠ జరుపబడింది.

ఇతర దేవాలయాలు మార్చు

  • ఆంజనేయస్వామి వారి దేవాలయం - మాచవరం
  • క్షిప్రగణపతి దేవాలయం - పటమట
  • త్రిశక్తి పీఠం
  • రామలింగేశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు, స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉంది. బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉంది.

సమీప దేవాలయాలు మార్చు

చెప్పుకోదగ్గ వ్యక్తులు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Vijayawada: A Profile". Vijayawada Municipal Corporation. Archived from the original on 2019-05-27. Retrieved 2019-08-14.
  2. "Maps, Weather, and Airports for Vijayawada, India". fallingrain.com. Archived from the original on 2016-03-14. Retrieved 2016-08-17.
  3. 3.0 3.1 3.2 3.3 "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 2 July 2016.
  4. లంక వెంకటరమణ 2014, p. 11.
  5. 5.0 5.1 లంక వెంకటరమణ 2014, p. 12.
  6. జాన్సన్ చోరగుడి 2000, p. 1.
  7. 7.0 7.1 జాన్సన్ చోరగుడి 2000, p. 2.
  8. లంక వెంకటరమణ 2014, p. 15.
  9. లంక వెంకటరమణ 2014, p. 16.
  10. 10.0 10.1 10.2 జాన్సన్ చోరగుడి 2000, p. 3.
  11. లంక వెంకటరమణ 2014, p. 5.
  12. లంక వెంకటరమణ 2014, p. 8.
  13. లంక వెంకటరమణ 2014, p. 9.
  14. కంభపు వెంకటేశ్వర ప్రసాద్ 1999, p. 4.
  15. No. 45. (A.R. No. 491 of 1906.) Pulivendla, Pulivendla Taluk, Cuddapah District. On a slab set up at the entrance of the Ranganathasvamin temple. Krishnaraya, AD 1509. This is dated Saka 1431, Sukla, Kartika su. 12, corresponding to AD 1509, October 24, which was, Wednesday. It records a gift of the village Kunddal Kundu to the god Sri Ranga Raju of Pulivindla by Narasayya Deva Maharaju, brother of Basava Raju, son of Tamma Raju, grandson of Valla Bharaya and great-grandson of Bejawada Madhava Varma of Vasishtha-gotra and Surya-vamsa. The gift village is said to be situated in Pulivindalasthala, a subdivision of Mulkinadu in Gandhi Kotasima of Udayagiri Rajya.
  16. జాన్సన్ చోరగుడి 2000, p. 4.
  17. జాన్సన్ చోరగుడి 2000, pp. 5, 6.
  18. లంక వెంకటరమణ 2014, pp. 75, 76.
  19. పి. రఘునాధరావు 2010, p. 234.
  20. "Presence of leopards, wild dogs detected in Krishna forests". The Hindu. 2006. Archived from the original on 2007-11-27. Retrieved 2008-05-25.
  21. reddy, u sudhakar (2016-08-19). "Vijayawada is third densely packed city; 31,200 people in every square km". Deccan Chronicle. Archived from the original on 2019-05-29. Retrieved 2019-05-29.
  22. "Sex Ratio". The Registrar General & Census Commissioner, India. Archived from the original on 22 సెప్టెంబరు 2014. Retrieved 2 September 2014.
  23. "Chapter–3 (Literates and Literacy rate)" (PDF). Registrar General and Census Commissioner of India. Archived (PDF) from the original on 13 నవంబరు 2013. Retrieved 2 September 2014.
  24. "The Hindu : Andhra Pradesh / Vijayawada News : Championing the cause of Telugu language". The Hindu. Retrieved 14 June 2017.
  25. "C-16 Population By Mother Tongue – Town Level". Census of India. Registrar General and Census Commissioner of India. Archived from the original on 14 నవంబరు 2018. Retrieved 13 May 2019. Select "Andhra Pradesh" from the download menu. Data for "Vijayawada (M+OG)" is at row 11723 of the excel file.
  26. "C-1 Population By Religious Community". Census of India. Registrar General and Census Commissioner of India. Archived from the original on 13 సెప్టెంబరు 2015. Retrieved 13 May 2019. Select "Andhra Pradesh" from the download menu. Data for "Vijayawada (M+OG)" is at row 2395 of the excel file.
  27. Bhatnagar, Subhash (2009-03-01). Unlocking E-Government Potential: Concepts, Cases and Practical Insights. SAGE Publications India. p. 195. ISBN 9788132102489. Retrieved 9 May 2017.
  28. "Vijayawada Municipal Corporation". Ourvmc.org. Archived from the original on 2 ఫిబ్రవరి 2012. Retrieved 30 January 2012.
  29. "Welcome to Government Order Issue Register". goir.ap.gov.in. Archived from the original on 7 మే 2017. Retrieved 27 March 2017.
  30. "Govt Declares Vijayawada A Metropolitan City". Primepost.in. 25 March 2017. Archived from the original on 4 మే 2017. Retrieved 30 May 2017.
  31. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu. Retrieved 27 March 2017.
  32. "VMC". Archived from the original on 2008-12-20. Retrieved 2007-05-07.
  33. టి. వెంకటేశ్వరరావు 2008, pp. 98, 99.
  34. జూలై 16, 2010 ఆంధ్రజ్యోతి విజయవాడ అనుబంధం
  35. "విజయవాడలోని ఈ కమ్యూనిస్టుల విగ్రహాలు ఏం చెబుతున్నాయి?". బీబీసీ తెలుగు.
  36. "Details of Roads in each ULB of Andhra Pradesh". Municipal Administration and Urban Development Department. Archived from the original on 1 ఆగస్టు 2016. Retrieved 27 June 2016.
  37. "Roads and Drains" (PDF). Vijayawada Municipal Corporation. p. 4. Archived from the original (PDF) on 14 ఆగస్టు 2012. Retrieved 9 May 2017.
  38. "Pedestrians crossing roads at the mercy of motorists". The Hindu. Retrieved 12 May 2017.
  39. "Road safety vehicles to focus on infrastructure too". The Hindu. 4 April 2017. Retrieved 12 May 2017.
  40. 40.0 40.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
  41. "IRR flyover to be completed by Jan. end". The Hindu. 11 December 2015. Archived from the original on 21 డిసెంబరు 2016. Retrieved 22 June 2016.
  42. 42.0 42.1 "Traffic and Transportation" (PDF). Vijayawada Municipal Corporation. p. 43. Archived from the original (PDF) on 20 డిసెంబరు 2016. Retrieved 18 April 2017.
  43. Correspondent, Special. "Rush at PNBS, railway station peaks". The Hindu. Retrieved 8 May 2017.
  44. "Vijayawada City Bus System" (PDF). Vijayawada Municipal Corporatiom. p. 1. Archived from the original (PDF) on 15 సెప్టెంబరు 2017. Retrieved 12 May 2017.
  45. "Vijayawada BRT System" (PDF). Vijayawada Municipal Corporation. Archived from the original (PDF) on 14 సెప్టెంబరు 2017. Retrieved 4 May 2017.
  46. "Vijayawada bus station to be RTC headquarters". The Hans India (in ఇంగ్లీష్). 20 August 2015. Archived from the original on 17 మే 2017. Retrieved 8 May 2017.
  47. Correspondent, Special. "Festival rush chokes city bus and railway stations". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 12 May 2017.
  48. 48.0 48.1 "Traffic Wing – VijayawadaPolice". vijayawadapolice.ap.gov.in. Archived from the original on 2017-07-08. Retrieved 8 May 2017.
  49. "All you need to know about Andhra Pradesh's new capital - Vijayawada". dna. 5 September 2014. Archived from the original on 2017-08-01. Retrieved 30 May 2017.
  50. Reporter, Staff. "'A quick and cheaper mode of transport'". The Hindu. Retrieved 27 May 2017.
  51. Correspondent, Special. "Vijayawada-Guntur-Tenali MEMU diverted". The Hindu. Retrieved 8 May 2017.
  52. Reporter, Staff. "Circular rail line for Amaravati approved". The Hindu. Archived from the original on 2019-07-13. Retrieved 8 May 2017.
  53. "Circular trains to connect capital towns with Amaravati - Times of India". The Times of India. Archived from the original on 17 మే 2017. Retrieved 8 May 2017.
  54. "Metro rail to connect airport, Amaravati". The Hans India (in ఇంగ్లీష్). Archived from the original on 14 సెప్టెంబరు 2017. Retrieved 27 May 2017.
  55. "Statement showing Category-wise No.of stations" (PDF). Indian Railways. p. 2. Archived (PDF) from the original on 28 జనవరి 2016. Retrieved 12 May 2017.
  56. "Trains are back at Vijayawada station - Times of India". The Times of India. Archived from the original on 7 నవంబరు 2017. Retrieved 8 May 2017.
  57. "South Central Railway". South Central Railway. Archived from the original on 6 ఫిబ్రవరి 2011. Retrieved 8 May 2017.
  58. 58.0 58.1 "International status to boost air traffic from Vijayawada airport". The New Indian Express. 5 May 2017. Archived from the original on 8 మే 2017. Retrieved 8 May 2017.
  59. "Domestic Passengers" (PDF). Airports Authority of India. p. 2. Archived from the original (PDF) on 28 ఏప్రిల్ 2017. Retrieved 24 May 2017.
  60. "Domestic Aircraft Movements" (PDF). Airports Authority of India. p. 2. Archived from the original (PDF) on 28 ఏప్రిల్ 2017. Retrieved 24 May 2017.
  61. "విజయవాడలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్". సాక్షి. 2014-07-14. Archived from the original on 2019-08-15. Retrieved 2019-08-15.
  62. "AIR Vijayawada". allindiaradio.gov.in. Archived from the original on 3 జూన్ 2017. Retrieved 5 June 2017.
  63. 63.0 63.1 "AIR Vijayawada poised for digitisation by Dec end". The Hans India. Archived from the original on 14 సెప్టెంబరు 2017. Retrieved 13 June 2017.
  64. "Prasara Bharati Annual Report 2010-11" (PDF). Prasara Bharati. p. 65. Archived (PDF) from the original on 2015-07-22. Retrieved 13 June 2017.
  65. Correspondent, Special. "Vividh Bharati on FM for Vijayawada listeners". The Hindu. Archived from the original on 30 ఆగస్టు 2014. Retrieved 13 June 2017.
  66. జాన్సన్ చోరగుడి 2000, p. 16.
  67. జాన్సన్ చోరగుడి 2000, p. 17.
  68. Correspondent, Special. "'Visalandhra maintaining quality of information'". The Hindu. Archived from the original on 29 సెప్టెంబరు 2013. Retrieved 5 June 2017.
  69. జాన్సన్ చోరగుడి 2000, p. 15.
  70. జాన్సన్ చోరగుడి 2000, p. 14.
  71. లంక వెంకటరమణ 2014, p. 29.
  72. జాన్సన్ చోరగుడి 2000, p. 31.
  73. లంక వెంకటరమణ 2014, p. 66.
  74. జాన్సన్ చోరగుడి 2000, p. 32.

ఆధార గ్రంథాలు మార్చు

చిత్రమాలిక మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=విజయవాడ&oldid=4091833" నుండి వెలికితీశారు