పటేల్ సుధాకర్ రెడ్డి

పటేల్ సుధాకర్ రెడ్డి ప్రముఖ మావోయిస్ట్ నాయకుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ నాయకుడిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలంలోని కుర్తి రావులచెర్వు గ్రామానికి చెందినవాడు.భూస్వామ్య కుటుంబానికి చెందినవాడు అయినా, చదువుకొనే రోజుల్లో రాడికల్ సిద్దాంతాల పట్ల ఆకర్షితుడై గద్వాలలో మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాలలో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరి క్రియాశీలంగా పనిచేశాడు.[1] తరువాత పీపుల్స్ వార్ గ్రూప్‌లో సభ్యుడిగా చేరాడు. పీపుల్స్ వార్ గ్రూప్‌ తదనంతర కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్)గా మారింది. 1983లో ఉత్తర తెలంగాణలోని ఏటూరు నాగారం-మహదేవ్‌పూర్ ఆటవీ ప్రాంతంలో మావోయిస్ట్ గెరిల్లా దళనాయకుడిగా పనిచేశాడు. మహదేవ్‌పూర్ తరువాత ఇతనిని పార్టీ నాయకత్వం గడ్చిరోలీ జిల్లాకు బదిలీ చేసింది. 1992లో బెంగళూరులో అరెస్ట్ అయ్యేదాకా అక్కడే పనిచేశాడు.[1] ఏడు సంవత్సరాల కారాగారాజీవితాన్ని అనుభవించాకా తిరిగి విప్లవ పంథాలో దండకారాణ్యంలో రహస్య జీవితాన్ని కొనసాగించాడు. 2005లో ఆతను పార్టీ కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషించాడు. 2009 మే 23 వ తేదిన వరంగల్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించాడు. అయితే అతనిని అంతకు ముందే మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసి, హత్యచేశారని ఆరోపణలు ఉన్నాయి.

పటేల్ సుధాకర్ రెడ్డి

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 On the murder of two CPI(M) comrades in Andhra Pradesh Archived 2018-09-27 at the Wayback Machine, A World to Win News Service, July 13, 2009